Skip to main content

చేతులు కడిగారా? చేతులు కలిపారా?

ఊరక రారు మహానుభావులన్నట్లు ఢిల్లీ నుండి ఓ పెద్దాయన వచ్చాడు. చాలా పెద్ద రాచకార్యానికి వచ్చిన ఆ పెద్దాయన.. జూనియర్ ను పిలిపించుకొని ముచ్చటించాడు. పెద్దవాళ్లు పెద్దపెద్ద టాపిక్‎లు మాట్లాడుకోవాలి గానీ.. కుర్రాళ్లతో మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటాయబ్బా.. అని గల్లీ లెవల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. అసలే ఆ పెద్దాయనకు అగ్గిపుల్ల స్వామి అనే పేరొకటి ఉంది. మరి అలాంటప్పుడు కాక మీదున్న కుర్రాణ్ని అగ్గిపుల్ల స్వామి కలిస్తే.. అగ్గి రాజుకోకుండా ఎలా ఉంటుంది? 

Also Read: పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా?

Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

కేంద్రహోంమంత్రి అమిత్ షా.. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల భేటీపై తెలుగు రాజకీయాల్లో రేగిన చర్చ రచ్చ రచ్చ అవుతోంది. ఈ మీటింగ్ పై ఎవరికి తోచినవిధంగా వారు మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అబ్బురపడి ఆయన్ని పిలిపించుకుని అమిత్ షా శెభాష్ అంటూ కితాబిచ్చారని పైకి చెబుతున్న మాటలు.. కామెడీగా తేలిపోతున్నాయి. అదే నిజమైతే మరి రామ్‎చరణ్ ను, సినిమా దర్శకుడు రాజమౌళిని ఎందుకు పిలవలేదన్న ప్రశ్నలకు బీజేపీ నేతల దగ్గర సమాధానం దొరకటం లేదట. ఏమో మాకేం తెలుసు.. వాళ్లు ఏకాంతంగా భేటీ అయ్యారు.. ఏం మాట్లాడుకున్నారో తెలీదని కొందరు నేతలు దాటవేసే ప్రయత్నం చేస్తున్నా.. అవేవీ అతికేలా కనిపించడం లేదు. అయితే అమిత్ షాకు, బాద్ షాకు తప్ప వారేం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియకపోవటంతో ఆ భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీకి పవన్ దూరం అవుతున్నారనీ, ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ ను ఆ పార్టీ ఎంచుకుందనే ఊహాగానాలు ఓ వైపు... కాదు కాదూ.. తెలంగాణలో ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని, మరీ ముఖ్యంగా గ్రేటర్ లో పార్టీ బలోపేతంలో భాగంగానే ఎన్టీఆర్ తో స్నేహానికి బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

వారి భేటీపై మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‎లో చర్చ జరుగుతుంటే.. టీడీపీలో మాత్రం వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణి కనిపిస్తోంది. బుద్ధా వెంకన్న లాంటి ఒకరిద్దరు నేతలు మాత్రం ఎన్టీఆర్, అమిత్ షాను కలిస్తే తప్పేంటని ప్రశ్నించినప్పటికీ మెజారిటీ నేతలు మాత్రం దృశ్యం సినిమాలో సీన్ లాగా తాము ఆ భేటీ చూడలేదని.. అక్కడ ఏం జరగిందో తెలీదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈ భేటీని అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది పార్టీ అధిష్టానం ఫీలింగట. అయితే ఇది నమ్మేబుల్ గా కనిపించడం లేదనేవారు కూడా టీడీపీలోనే ఉన్నారు. తాము ప్రధాని మోడీని కలిసినప్పుడు కూడా ఇలాంటి చర్చే జరిగిందనీ, పవర్ ఫుల్ పర్సన్స్ కమింగ్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్ అన్న సినిమా డైలాగ్ లా.. కేంద్రంలో పవర్ లో ఉన్న పెద్దలు కదుపుతున్న పావుల్ని జాగ్రత్తగా గమనిద్దామని సదరు నేతలకు టీడీపీ హైకమాండ్ నుండి ఆదేశాలు వెళ్లాయట. అయితే అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ వల్ల టీడీపీకి వచ్చే ఇబ్బందేమీ లేదనీ... ప్రస్తుతానికి జూనియర్.. టీడీపీకి దగ్గరగా లేకపోయినా.. పార్టీకి నష్టం కలిగేలా ఎన్టీఆర్ ఎటువంటి నిర్ణయాలూ తీసుకోబోరని మరికొంతమంది నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొన్నామధ్య ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు కంటితడి పెట్టిన ఘటనపై కూడా ఎన్టీఆర్ స్పందించారనీ, అదేవిధంగా పార్టీకి కచ్చితంగా తన సేవలు అవసరమైనపుడు ఎన్టీఆర్ మళ్లీ ముందుకు వస్తారనీ, 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ పార్టీ కోసం పడ్డ శ్రమను మనం గుర్తుంచుకోవాలని డైలమాలో ఉన్న నేతలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారట.

మరోవైపు టీడీపీకి, ఎన్టీఆర్ కు దూరం పెరిగిందనీ, ఎన్టీఆర్ ను ప్రోత్సహిస్తే లోకేశ్ లీడర్ షిప్ కు ఇబ్బందిగా మారుతుంది కాబట్టి.. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందనీ బీజేపీలో ఇంకో వర్గం భావిస్తోంది. ఏపీలో ఇప్పటికే పవన్ తో పొత్తులో ఉన్న నేపథ్యంలో, అటు తెలంగాణలో ఎన్టీఆర్ చరిష్మా సైతం తమకు కొంత ఉపయోగపడుతుందనీ, ఇప్పటికే విజయశాంతి లాంటి క్రేజీ స్టార్ బీజేపీలో ఉన్నారు.. త్వరలో మరోసీనియర్ నటి జయసుధ కూడా చేరిపోతారు... ఇక ఎన్టీఆర్ లాంటి వారిని దగ్గర చేసుకుంటే తిరుగులేని సినీ చరిష్మా తెలుగురాష్ట్రాల్లో పార్టీకి ఉపయోగపడుతుందన్నది హైకమాండ్ వ్యూహమనీ, కాబట్టి వారి ప్రతి భేటీ, ప్రతి కలయికా రాజకీయ ప్రయోజనాలతోనే కూడి ఉంటుందని ఆ వర్గం నేతలు కుండబద్ధలు కొడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న కొద్దిపాటి ఓటింగ్ బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని.. ఇటు ఏపీలో బీజేపీ, టిడిపి, జనసేనలకు సంబంధించిన 2014 కాంబినేషన్ మళ్లీ హిట్ కొట్టే ఛాన్స్ ఉందన్న ఆశాభావం మరికొందరిలో కనిపిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనీ, అందుకోసమే ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై తొందరపడొద్దన్న సంకేతాలు టీడీపీ నుండి వచ్చాయని వారంటున్నారు. 

ఓవరాల్ గా చూస్తే.. భేటీలో కూర్చున్న వాళ్లిద్దరూ డిన్నర్ చేసి తాపీగా వెళ్లిపోతే... ఆ తర్వాత చాలా నేతల డిన్నర్స్ లోనూ, లంచ్ మీటింగ్స్ లోనూ ఇదే చర్చ కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతానికి కీలకనిర్ణయాలు తీసుకునే విధంగా ఆ భేటీ జరగకపోయినప్పటికీ భవిష్యత్తులో తెలుగురాష్ట్రాల్లో కీలకంగా మారే పరిణామాలకు మాత్రం వారిద్దరి భేటీ ఓ టీజర్ లాంటిదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందన మరింత ఇంట్రెస్టింగ్‎గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనీ, టీడీపీని స్వాధీనం చేసుకోవాలని ఆమె కోరుతుండడం.. టీడీపీలో హాట్ టాపిగ్గా మారింది. పాడ్యమి నాడో, విదియ నాడో కనిపించని చంద్రుడు.. తదియ నాడు తానే కనిపిస్తాడంటారు. ఓ వారం పోతే.. వారిద్దరి భేటీలో ఏం జరిగిందో తెలియకుండా ఎలా ఉంటుంది? కాస్త ఓపిక పట్టాలంతే. 


Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. 

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?