Skip to main content

చేతులు కడిగారా? చేతులు కలిపారా?

ఊరక రారు మహానుభావులన్నట్లు ఢిల్లీ నుండి ఓ పెద్దాయన వచ్చాడు. చాలా పెద్ద రాచకార్యానికి వచ్చిన ఆ పెద్దాయన.. జూనియర్ ను పిలిపించుకొని ముచ్చటించాడు. పెద్దవాళ్లు పెద్దపెద్ద టాపిక్‎లు మాట్లాడుకోవాలి గానీ.. కుర్రాళ్లతో మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటాయబ్బా.. అని గల్లీ లెవల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. అసలే ఆ పెద్దాయనకు అగ్గిపుల్ల స్వామి అనే పేరొకటి ఉంది. మరి అలాంటప్పుడు కాక మీదున్న కుర్రాణ్ని అగ్గిపుల్ల స్వామి కలిస్తే.. అగ్గి రాజుకోకుండా ఎలా ఉంటుంది? 

Also Read: పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా?

Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

కేంద్రహోంమంత్రి అమిత్ షా.. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల భేటీపై తెలుగు రాజకీయాల్లో రేగిన చర్చ రచ్చ రచ్చ అవుతోంది. ఈ మీటింగ్ పై ఎవరికి తోచినవిధంగా వారు మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అబ్బురపడి ఆయన్ని పిలిపించుకుని అమిత్ షా శెభాష్ అంటూ కితాబిచ్చారని పైకి చెబుతున్న మాటలు.. కామెడీగా తేలిపోతున్నాయి. అదే నిజమైతే మరి రామ్‎చరణ్ ను, సినిమా దర్శకుడు రాజమౌళిని ఎందుకు పిలవలేదన్న ప్రశ్నలకు బీజేపీ నేతల దగ్గర సమాధానం దొరకటం లేదట. ఏమో మాకేం తెలుసు.. వాళ్లు ఏకాంతంగా భేటీ అయ్యారు.. ఏం మాట్లాడుకున్నారో తెలీదని కొందరు నేతలు దాటవేసే ప్రయత్నం చేస్తున్నా.. అవేవీ అతికేలా కనిపించడం లేదు. అయితే అమిత్ షాకు, బాద్ షాకు తప్ప వారేం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియకపోవటంతో ఆ భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీకి పవన్ దూరం అవుతున్నారనీ, ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ ను ఆ పార్టీ ఎంచుకుందనే ఊహాగానాలు ఓ వైపు... కాదు కాదూ.. తెలంగాణలో ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని, మరీ ముఖ్యంగా గ్రేటర్ లో పార్టీ బలోపేతంలో భాగంగానే ఎన్టీఆర్ తో స్నేహానికి బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

వారి భేటీపై మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‎లో చర్చ జరుగుతుంటే.. టీడీపీలో మాత్రం వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణి కనిపిస్తోంది. బుద్ధా వెంకన్న లాంటి ఒకరిద్దరు నేతలు మాత్రం ఎన్టీఆర్, అమిత్ షాను కలిస్తే తప్పేంటని ప్రశ్నించినప్పటికీ మెజారిటీ నేతలు మాత్రం దృశ్యం సినిమాలో సీన్ లాగా తాము ఆ భేటీ చూడలేదని.. అక్కడ ఏం జరగిందో తెలీదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈ భేటీని అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది పార్టీ అధిష్టానం ఫీలింగట. అయితే ఇది నమ్మేబుల్ గా కనిపించడం లేదనేవారు కూడా టీడీపీలోనే ఉన్నారు. తాము ప్రధాని మోడీని కలిసినప్పుడు కూడా ఇలాంటి చర్చే జరిగిందనీ, పవర్ ఫుల్ పర్సన్స్ కమింగ్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్ అన్న సినిమా డైలాగ్ లా.. కేంద్రంలో పవర్ లో ఉన్న పెద్దలు కదుపుతున్న పావుల్ని జాగ్రత్తగా గమనిద్దామని సదరు నేతలకు టీడీపీ హైకమాండ్ నుండి ఆదేశాలు వెళ్లాయట. అయితే అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ వల్ల టీడీపీకి వచ్చే ఇబ్బందేమీ లేదనీ... ప్రస్తుతానికి జూనియర్.. టీడీపీకి దగ్గరగా లేకపోయినా.. పార్టీకి నష్టం కలిగేలా ఎన్టీఆర్ ఎటువంటి నిర్ణయాలూ తీసుకోబోరని మరికొంతమంది నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొన్నామధ్య ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు కంటితడి పెట్టిన ఘటనపై కూడా ఎన్టీఆర్ స్పందించారనీ, అదేవిధంగా పార్టీకి కచ్చితంగా తన సేవలు అవసరమైనపుడు ఎన్టీఆర్ మళ్లీ ముందుకు వస్తారనీ, 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ పార్టీ కోసం పడ్డ శ్రమను మనం గుర్తుంచుకోవాలని డైలమాలో ఉన్న నేతలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారట.

మరోవైపు టీడీపీకి, ఎన్టీఆర్ కు దూరం పెరిగిందనీ, ఎన్టీఆర్ ను ప్రోత్సహిస్తే లోకేశ్ లీడర్ షిప్ కు ఇబ్బందిగా మారుతుంది కాబట్టి.. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందనీ బీజేపీలో ఇంకో వర్గం భావిస్తోంది. ఏపీలో ఇప్పటికే పవన్ తో పొత్తులో ఉన్న నేపథ్యంలో, అటు తెలంగాణలో ఎన్టీఆర్ చరిష్మా సైతం తమకు కొంత ఉపయోగపడుతుందనీ, ఇప్పటికే విజయశాంతి లాంటి క్రేజీ స్టార్ బీజేపీలో ఉన్నారు.. త్వరలో మరోసీనియర్ నటి జయసుధ కూడా చేరిపోతారు... ఇక ఎన్టీఆర్ లాంటి వారిని దగ్గర చేసుకుంటే తిరుగులేని సినీ చరిష్మా తెలుగురాష్ట్రాల్లో పార్టీకి ఉపయోగపడుతుందన్నది హైకమాండ్ వ్యూహమనీ, కాబట్టి వారి ప్రతి భేటీ, ప్రతి కలయికా రాజకీయ ప్రయోజనాలతోనే కూడి ఉంటుందని ఆ వర్గం నేతలు కుండబద్ధలు కొడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న కొద్దిపాటి ఓటింగ్ బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని.. ఇటు ఏపీలో బీజేపీ, టిడిపి, జనసేనలకు సంబంధించిన 2014 కాంబినేషన్ మళ్లీ హిట్ కొట్టే ఛాన్స్ ఉందన్న ఆశాభావం మరికొందరిలో కనిపిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనీ, అందుకోసమే ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై తొందరపడొద్దన్న సంకేతాలు టీడీపీ నుండి వచ్చాయని వారంటున్నారు. 

ఓవరాల్ గా చూస్తే.. భేటీలో కూర్చున్న వాళ్లిద్దరూ డిన్నర్ చేసి తాపీగా వెళ్లిపోతే... ఆ తర్వాత చాలా నేతల డిన్నర్స్ లోనూ, లంచ్ మీటింగ్స్ లోనూ ఇదే చర్చ కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతానికి కీలకనిర్ణయాలు తీసుకునే విధంగా ఆ భేటీ జరగకపోయినప్పటికీ భవిష్యత్తులో తెలుగురాష్ట్రాల్లో కీలకంగా మారే పరిణామాలకు మాత్రం వారిద్దరి భేటీ ఓ టీజర్ లాంటిదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందన మరింత ఇంట్రెస్టింగ్‎గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనీ, టీడీపీని స్వాధీనం చేసుకోవాలని ఆమె కోరుతుండడం.. టీడీపీలో హాట్ టాపిగ్గా మారింది. పాడ్యమి నాడో, విదియ నాడో కనిపించని చంద్రుడు.. తదియ నాడు తానే కనిపిస్తాడంటారు. ఓ వారం పోతే.. వారిద్దరి భేటీలో ఏం జరిగిందో తెలియకుండా ఎలా ఉంటుంది? కాస్త ఓపిక పట్టాలంతే. 


Comments

Popular posts from this blog

హైదరాబాద్ లో అమెరికా ఆస్ట్రాలజీ యూనివర్సిటీ ప్రారంభం

హైదరాబాద్ లో జ్యోతిష్యం, యోగ శాస్త్రం నేర్పేందుకు ఓ కొత్త యూనివర్సిటీ ప్రారంభమైంది. జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీ పేరుతో అమెరికాలోని ఫ్లోరిడాలో ఇప్పటికే నడుస్తున్న ఆ యూనివర్సిటీకి హైదరాబాద్ లో అనుబంధ శాఖ ఏర్పడింది. జేకేఆర్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి గత 12 ఏళ్లుగా ఔత్సాహికులకు జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన విజ్ఞానాన్ని అందిస్తున్న ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ఆధ్వర్యంలోని ఇనిస్టిట్యూట్ కు ఫ్లోరిడా యూనివర్సిటీవారు గుర్తింపునిచ్చారు. దీంతో ఫ్లోరిడాలోని జ్యోతిష యోగశాస్త్ర యూనివర్సిటీకి అనుబంధంగా హైదరాాబాద్ లో ఓ బ్రాంచ్ ఏర్పడిందని, ఆ బ్రాంచ్ కార్యకలాపాలను విజయదశమి శుభ సందర్భంగా ప్రారంభిస్తున్నట్లు ప్రొఫెసర్ ఎన్.వి.ఆర్.ఎ. రాజా ప్రకటించారు. హైదరాబాద్ చిక్కడపల్లిలో గల శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో యూనివర్సిటీ లోగో, బ్యానర్ ను ఓపెన్ చేసి కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్టు రాజా చెప్పారు.  Read This: పవన్ మాజీ భార్య తాజా కామెంట్లు Read This:  కాంగ్రెస్ లో రేవంత్ "రెడ్ రాజకీయం" జ్యోతిష్యం, వాస్తు వంటి భారతీయ సనాతన శాస్త్రాలను ఔత్సాహికులకు ప్రపంచ స్థాయిలో అందిస్తున్న తమ సేవలను గుర్తి

ఔను.. అది "సామాజిక విశ్వరూప మహాసభ"

తేదీ: 11-11-2023, శనివారం, సాయంత్రం (నరక చతుర్దశి నడుస్తున్న సమయం) అది చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక శుభ ముహూర్తం.  దళితజాతిలోని మాదిగ బిడ్డలకు సామాజిక న్యాయం జరగబోతోంది అనడానికి పునాదులు పడిపోయిన పుణ్య తిథి. 14 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని మించి నడుస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాటం అంతిమ ఘట్టానికి చేరిందన్న సంకేతం వెలువడిన అద్భుత సందర్భం.  హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఒక చారిత్రక సన్నివేశానికి వేదికగా మారింది. దేశవ్యాప్తంగా మరో భారీ నిర్ణయానికి అంకురారోపణం జరిగిపోయింది. ఇక ఆవిష్కారమే తరువాయి. అదే ఎస్సీ వర్గాలు, అందులోని ఉపకులాల వాటాలు తేల్చే విభజన విషయం.  మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆ సంస్థ అధినేత, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే గాక.. వాటికి నేతృత్వం వహించిన మందకృష్ణ మాదిగ మాట్లాడిన తీరు అపురూపం, ఆయన ఆవిష్కరించిన స్వప్నం రేపటి రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న ఒక ఉద్విగ్నభరిత సచిత్ర దృశ్యరూపం. 20 నిమిషాలకు పైగా మందృష్ణ మాట్లాడింది ఒక మామూలు ప్రసంగం కాదు. తన జీవిత పోరాటాన్ని, మాదిగ జాతి 30 ఏళ్లుగా తన హక్కుల సాకారం కోసం నిరంతరా

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ

భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ.  రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చే