Skip to main content

చేతులు కడిగారా? చేతులు కలిపారా?

ఊరక రారు మహానుభావులన్నట్లు ఢిల్లీ నుండి ఓ పెద్దాయన వచ్చాడు. చాలా పెద్ద రాచకార్యానికి వచ్చిన ఆ పెద్దాయన.. జూనియర్ ను పిలిపించుకొని ముచ్చటించాడు. పెద్దవాళ్లు పెద్దపెద్ద టాపిక్‎లు మాట్లాడుకోవాలి గానీ.. కుర్రాళ్లతో మాట్లాడుకునే టాపిక్స్ ఏముంటాయబ్బా.. అని గల్లీ లెవల్లో తీవ్రమైన చర్చ నడుస్తోంది. అసలే ఆ పెద్దాయనకు అగ్గిపుల్ల స్వామి అనే పేరొకటి ఉంది. మరి అలాంటప్పుడు కాక మీదున్న కుర్రాణ్ని అగ్గిపుల్ల స్వామి కలిస్తే.. అగ్గి రాజుకోకుండా ఎలా ఉంటుంది? 

Also Read: పవన్‎కు, చంద్రబాబుకు చెక్ పెట్టేశారా?

Also Read: వేయి పున్నముల వేదాధ్యాయి పెదపాటి

కేంద్రహోంమంత్రి అమిత్ షా.. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ల భేటీపై తెలుగు రాజకీయాల్లో రేగిన చర్చ రచ్చ రచ్చ అవుతోంది. ఈ మీటింగ్ పై ఎవరికి తోచినవిధంగా వారు మాట్లాడుకుంటున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ నటనకు అబ్బురపడి ఆయన్ని పిలిపించుకుని అమిత్ షా శెభాష్ అంటూ కితాబిచ్చారని పైకి చెబుతున్న మాటలు.. కామెడీగా తేలిపోతున్నాయి. అదే నిజమైతే మరి రామ్‎చరణ్ ను, సినిమా దర్శకుడు రాజమౌళిని ఎందుకు పిలవలేదన్న ప్రశ్నలకు బీజేపీ నేతల దగ్గర సమాధానం దొరకటం లేదట. ఏమో మాకేం తెలుసు.. వాళ్లు ఏకాంతంగా భేటీ అయ్యారు.. ఏం మాట్లాడుకున్నారో తెలీదని కొందరు నేతలు దాటవేసే ప్రయత్నం చేస్తున్నా.. అవేవీ అతికేలా కనిపించడం లేదు. అయితే అమిత్ షాకు, బాద్ షాకు తప్ప వారేం మాట్లాడుకున్నారో ఎవరికీ తెలియకపోవటంతో ఆ భేటీపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీకి పవన్ దూరం అవుతున్నారనీ, ప్రత్యామ్నాయంగా ఎన్టీఆర్ ను ఆ పార్టీ ఎంచుకుందనే ఊహాగానాలు ఓ వైపు... కాదు కాదూ.. తెలంగాణలో ఉన్న కమ్మ సామాజికవర్గాన్ని, మరీ ముఖ్యంగా గ్రేటర్ లో పార్టీ బలోపేతంలో భాగంగానే ఎన్టీఆర్ తో స్నేహానికి బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు కూడా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.

వారి భేటీపై మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్‎లో చర్చ జరుగుతుంటే.. టీడీపీలో మాత్రం వెయిట్ అండ్ వాచ్ అనే ధోరణి కనిపిస్తోంది. బుద్ధా వెంకన్న లాంటి ఒకరిద్దరు నేతలు మాత్రం ఎన్టీఆర్, అమిత్ షాను కలిస్తే తప్పేంటని ప్రశ్నించినప్పటికీ మెజారిటీ నేతలు మాత్రం దృశ్యం సినిమాలో సీన్ లాగా తాము ఆ భేటీ చూడలేదని.. అక్కడ ఏం జరగిందో తెలీదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఈ భేటీని అంత సీరియస్ గా పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నది పార్టీ అధిష్టానం ఫీలింగట. అయితే ఇది నమ్మేబుల్ గా కనిపించడం లేదనేవారు కూడా టీడీపీలోనే ఉన్నారు. తాము ప్రధాని మోడీని కలిసినప్పుడు కూడా ఇలాంటి చర్చే జరిగిందనీ, పవర్ ఫుల్ పర్సన్స్ కమింగ్ ఫ్రమ్ పవర్ ఫుల్ ప్లేసెస్ అన్న సినిమా డైలాగ్ లా.. కేంద్రంలో పవర్ లో ఉన్న పెద్దలు కదుపుతున్న పావుల్ని జాగ్రత్తగా గమనిద్దామని సదరు నేతలకు టీడీపీ హైకమాండ్ నుండి ఆదేశాలు వెళ్లాయట. అయితే అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ వల్ల టీడీపీకి వచ్చే ఇబ్బందేమీ లేదనీ... ప్రస్తుతానికి జూనియర్.. టీడీపీకి దగ్గరగా లేకపోయినా.. పార్టీకి నష్టం కలిగేలా ఎన్టీఆర్ ఎటువంటి నిర్ణయాలూ తీసుకోబోరని మరికొంతమంది నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొన్నామధ్య ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలు, చంద్రబాబు కంటితడి పెట్టిన ఘటనపై కూడా ఎన్టీఆర్ స్పందించారనీ, అదేవిధంగా పార్టీకి కచ్చితంగా తన సేవలు అవసరమైనపుడు ఎన్టీఆర్ మళ్లీ ముందుకు వస్తారనీ, 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ పార్టీ కోసం పడ్డ శ్రమను మనం గుర్తుంచుకోవాలని డైలమాలో ఉన్న నేతలను సముదాయించే ప్రయత్నం చేస్తున్నారట.

మరోవైపు టీడీపీకి, ఎన్టీఆర్ కు దూరం పెరిగిందనీ, ఎన్టీఆర్ ను ప్రోత్సహిస్తే లోకేశ్ లీడర్ షిప్ కు ఇబ్బందిగా మారుతుంది కాబట్టి.. ఈ పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందనీ బీజేపీలో ఇంకో వర్గం భావిస్తోంది. ఏపీలో ఇప్పటికే పవన్ తో పొత్తులో ఉన్న నేపథ్యంలో, అటు తెలంగాణలో ఎన్టీఆర్ చరిష్మా సైతం తమకు కొంత ఉపయోగపడుతుందనీ, ఇప్పటికే విజయశాంతి లాంటి క్రేజీ స్టార్ బీజేపీలో ఉన్నారు.. త్వరలో మరోసీనియర్ నటి జయసుధ కూడా చేరిపోతారు... ఇక ఎన్టీఆర్ లాంటి వారిని దగ్గర చేసుకుంటే తిరుగులేని సినీ చరిష్మా తెలుగురాష్ట్రాల్లో పార్టీకి ఉపయోగపడుతుందన్నది హైకమాండ్ వ్యూహమనీ, కాబట్టి వారి ప్రతి భేటీ, ప్రతి కలయికా రాజకీయ ప్రయోజనాలతోనే కూడి ఉంటుందని ఆ వర్గం నేతలు కుండబద్ధలు కొడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఉన్న కొద్దిపాటి ఓటింగ్ బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతుందని.. ఇటు ఏపీలో బీజేపీ, టిడిపి, జనసేనలకు సంబంధించిన 2014 కాంబినేషన్ మళ్లీ హిట్ కొట్టే ఛాన్స్ ఉందన్న ఆశాభావం మరికొందరిలో కనిపిస్తోంది. రాజకీయాల్లో ఎప్పుడైనా ఏమైనా జరగొచ్చనీ, అందుకోసమే ఎన్టీఆర్, అమిత్ షా భేటీపై తొందరపడొద్దన్న సంకేతాలు టీడీపీ నుండి వచ్చాయని వారంటున్నారు. 

ఓవరాల్ గా చూస్తే.. భేటీలో కూర్చున్న వాళ్లిద్దరూ డిన్నర్ చేసి తాపీగా వెళ్లిపోతే... ఆ తర్వాత చాలా నేతల డిన్నర్స్ లోనూ, లంచ్ మీటింగ్స్ లోనూ ఇదే చర్చ కొనసాగుతుండడం విశేషం. ప్రస్తుతానికి కీలకనిర్ణయాలు తీసుకునే విధంగా ఆ భేటీ జరగకపోయినప్పటికీ భవిష్యత్తులో తెలుగురాష్ట్రాల్లో కీలకంగా మారే పరిణామాలకు మాత్రం వారిద్దరి భేటీ ఓ టీజర్ లాంటిదన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల నుండి వినిపిస్తోంది. అయితే ఇదే సమయంలో దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి స్పందన మరింత ఇంట్రెస్టింగ్‎గా మారింది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలనీ, టీడీపీని స్వాధీనం చేసుకోవాలని ఆమె కోరుతుండడం.. టీడీపీలో హాట్ టాపిగ్గా మారింది. పాడ్యమి నాడో, విదియ నాడో కనిపించని చంద్రుడు.. తదియ నాడు తానే కనిపిస్తాడంటారు. ఓ వారం పోతే.. వారిద్దరి భేటీలో ఏం జరిగిందో తెలియకుండా ఎలా ఉంటుంది? కాస్త ఓపిక పట్టాలంతే. 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత