కొట్లాడుకున్నా తిట్లాడుకున్నా.. ఒక్కటయ్యేది మాత్రం దావత్ దగ్గరే. అందులోనూ తెలంగాణ రాజకీయాల్లో దావత్ లకు టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఎప్పుడూ అసమ్మతులతో, అసంతృప్తులతో రగిలిపోయే టీ-కాంగ్రెస్ నేతల్ని ఒక్కటి చేయాలంటే ఈ దావత్ ల స్ట్రాటజీ అయితేనే బాగుంటుందని ఆ పార్టీ ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ భావించినట్టున్నారు. అందుకోసం స్పెషల్ గా ప్లాన్ చేశారు.
టీ కాంగ్రెస్ లో బుజ్జగింపుల పర్వం, హెచ్చరికల పర్వం ముగిసి.. విందు రాజకీయాల పర్వం నడుస్తోంది. ఈ మధ్య పార్టీకి మాంచి ఊపొచ్చిందని భావిస్తున్న కాంగ్రెస్ పెద్దలు.. ఇకనైనా అంతర్గత కుమ్ములాటలు అదుపు చేయకపోతే లాభం ఉండదని భావించారు. ఇందుకోసం నాయకుల మధ్య విభేదాలు రూపుమాపాలని మాణిక్కం ఠాగూర్ ఓ వినూత్నమైన ఆలోచన చేశారు. తన రెండు రోజుల పర్యటనలో హైదరాబాద్ వచ్చిన ఠాగూర్.. ఈసారి నేతల మధ్య సమన్వయం కోసం విందు రాజకీయాలకు తెరలేపారు. బ్రేక్ ఫాస్ట్ ఒక నేత ఇంట్లో చేస్తే.. లంచ్ ఇంకో లీడర్సాబ్ ఇంట్లో చేయడం.. అందరికీ యాక్సిస్ ఉండే చోట మరో చోట రాత్రిపూట చేతులు కడగడం. ఇదీ ఠాగూర్ నిర్ణయించుకున్న ప్రోగ్రామ్. ఇందుకోసం వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్గౌడ్తో డిన్నర్ ఏర్పాటు చేసినప్పటికీ అనుకున్న లక్ష్యం నెరవేరలేదని నేతలంతా వాపోతున్నారట. నేతల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన విందులో... ఎవరైతే పార్టీలో అంతర్గత అంశాలపై బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్నారో ఆ నేతలే హాజరు కాకపోవడంతో విందు సమన్వయ రాజకీయం కాస్తా జస్ట్ భోజనాలతోనే ముగిసిందట.
Also Read: కేసీఆర్ను ఓడించే భారీ స్కెచ్ రెడీ
Also Read: విశ్వబ్రాహ్మణులను అవమానపరుస్తున్న టీ-సర్కారు
ఆదివారం మధ్యాహ్నం కోమటిరెడ్డి ఏర్పాటు చేసిన లంచ్ మీట్లో ఠాగూర్తో పాటు ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు పాల్గొన్నారు. అక్కడ సునీల్ రిపోర్టు ఆధారంగా జరిగిన చేరికలు, అంతర్గత అంశాలు, షర్మిల పార్టీ ప్రభావం తదితర అంశాలు చర్చకు వచ్చాయట. అయితే ఇలాంటి కీలక విందుకు కోమటిరెడ్డి.. రేవంత్ రెడ్డిని ఆహ్వానించినా.. రేవంత్ మాత్రం హ్యాండిచ్చారు. ఆ టైమ్ కి ఆయన వేరే ప్రోగ్రాంలో పాల్గొనడంతో ఈ లంచ్ మీట్ నిష్ప్రయోజనంగా మారిందని నేతలు వాపోతున్నారు. దీంతో అసలైన అంశాలకు బదులు పస లేని అంశాలమీదనే చర్చించుకోవాల్సి వచ్చిందట. అంతకుముందు ఉదయం జానారెడ్డితో ఠాగూర్ ఒక రహస్య ప్రదేశంలో అల్పాహార విందులో పాల్గొని పార్టీకి సంబంధించిన అంశాలు చర్చించినట్లు సమాచారం. ఈ బ్రేక్ఫాస్ట్ మీట్లో ఎవరెవరు పాల్గొన్నారన్నది బయటకు పొక్కకుండా నేతలంతా సీక్రసీ మెయింటెయిన్ చేయడం మాత్రం విశేషంగానే భావించాలి.
ఇదంతా ఒక ఎత్తయితే పార్టీ నేతలంతా ఆసక్తిగా ఎదురుచూసిన డిన్నర్ మీట్కి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు జగ్గారెడ్డి కూడా డుమ్మా కొట్టడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేవంత్ ను వ్యతిరేకించే ఇతర నేతలు మాత్రం ఈ విందుకు యథావిథిగా హాజరయ్యారు. అసలు విందు ఏర్పాటు చేసిందే నేతల మధ్య సమన్వయం కోసమని.. కానీ ఎవరైతే పార్టీ పట్ల బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ పీసీసీ మీద అసంతృప్తిగా ఉన్నారో.. ఆ నేతలే హాజరు కాకపోవడంతో సమన్వయ విందు కాస్తా ఆ ఇద్దరు కీలక నేతల గైర్హాజరుతో భోజనాలకే పరిమితమైందట. ఉన్న కొంతమంది నేతలు పార్టీ అంశాలు చర్చించినప్పటికీ అనుకున్న లక్ష్యం నెరవేరకపోవడంతో కొంతమంది నైరాశ్యంలో మునిగిపోయారని సమాచారం. అయితే మధ్యాహ్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి రేవంత్ రాకపోవడం.. పీసీసీ ఏర్పాటు చేసిన డిన్నర్ మీట్ కి కోమటిరెడ్డి రాకపోవడం.. ఇల్లు కూడా పక్కనే ఉన్న జగ్గారెడ్డి కూడా అలాగే వ్యవహరించడంతో పీసీసీ డిన్నర్ మీట్ అంశం హాట్ టాపిగ్గా మారింది. నేతలందరి ఇళ్లు కూడా జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లోనే ఉండడంతో.. ఇలాంటి విందుల వల్ల ఒరిగేదేంటి అనుకొని నేతలంతా నిట్టూర్పులు విడిచారట.
ముఖ్యనేతలంతా సమన్వయ విందులకు డుమ్మా కొట్టడంతో.. ఇప్పట్లో టీ-కాంగ్రెస్ నేతల మధ్య సమన్వయం కష్టమేనని భావిస్తున్నారట. పార్టీ జోష్ లో ఉన్న సమయంలో బహిరంగ వ్యాఖ్యలతో ప్రజల్లోకి తప్పుడు మెసేజ్లు పోకుండా.. సమన్వయం కోసం ఠాగూర్ చేసిన విందు రాజకీయం బెడిసికొట్టడంతో.. మరి సమన్వయం కోసం అధిష్టానం ఎలా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Comments
Post a Comment
Your Comments Please: