ఈ నగరానికి ఏమైంది.. అని తెలుగు ప్రజలంతా ఆశ్చర్యపోవాల్సిన సందర్భమిది. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్లలో అధికార, ప్రతిపక్ష పార్టీలు హోరాహోరీ పోరాడి మేయర్ పదవిని కైవసం చేసుకోవాలని తహతహలాడాయి. గతంలో కంటే ఈసారైనా పోలింగ్ శాతం పెరుగుతుందని భావించారు. కానీ అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. సగం కన్నా ఎక్కువ అనేదే ప్రజాస్వామ్యానికి మూల సూత్రం. మరి ప్రజల్లో 50 శాతం పోలింగ్ కానప్పుడు దాన్ని ప్రజాస్వామ్యంగా పరిగణించవచ్చా? అది మేలైన ప్రజాస్వామ్యమేనా అనే చర్చ మొదలైంది. ఇలాంటి పరిస్థితి ఇంకా ఎన్నాళ్లు? కేంద్రమో, రాష్ట్రాలో దీనికోసం పూనుకోవాల్సిన అవసరం లేదా?
(పాఠకులు ఇబ్బంది అనుకోకుండా తెలంగాణ స్లాంగ్ లో చదువుకోవాలని మనవి)
గీ పట్నపోల్లకు ఏమైంది? యూత్ పోరలు, సదువుకున్నోల్లు, జాబుల్ జేసేటోల్లు యాడ వోయిండ్రు? మొన్నటి సంది జెప్తనే ఉన్నం గదా... ఓట్లేసుడంటే ప్రజాస్వామ్య పండుగ అన్జెప్తన్నం గదా.. మల్లేమాయె. అరె.. మొన్న బీజేపీ పెద్దసార్లయితే ఓ మునుం బెట్టి పట్నానికచ్చిండ్రు గదా. అమిత్ సార్ గల్లీ మార్చ్ సౌండూ.. డిల్లీదాక పాకింది గదా. గా షో జూత్తెనైతే ఇగ హైదరాబాద్ జనం పోలింగ్ బూత్ ల కాడ లైన్ల మీద లైన్లు గట్టి ఓట్లకోసం పోటెత్తుతరు గావచ్చు అనుకున్నరు గదా. కనీ గసొంటి లెక్కలైతే యాడ నజర్ కు రాలే. అటు అమిత్ సారూ.. ఇటు అత్కార పార్టీ మంత్రులు, పెద్దపెద్ద లీడల్రు గల్లీలల్లనే టికానా వెట్టి అన్ని దగ్గరుండి సూస్కున్నరు. అయినా గూడ హైదరాబాద్ ఎలచ్చన్లు గింత అద్వానంగా తయారైనైయేంది? గీ ముచ్చటతోని పార్టీలన్ని గూడా పరేషాన్ల వడ్డయి.
పల్లెలతోని టచ్చున్న పటాంచెరువసోంటి ఊర్లల్ల బగ్గనే పోలింగైంది. గీడ అమీర్ పేట, మాదాపూర్, కొండాపూర్ అసోంటి సాఫ్ట్ వేరోల్లు ఎక్వ మంది ఉండేకాడనేమో అద్వానంగా తయారైంది. పట్నంల సద్వుకున్న సార్ల తీరు జూసి అన్ని పార్టీల లీడల్రు గూడా.. ఇగ ఏడ్సుడొక్కటే తక్వవైతందాట. ఎందుకీల్లు గిట్ల తయారైండ్రు.. అన్ని గావాల్నంటరు... ఆకర్కు ఓటెయ్యరు.. ఓటెయ్యకపోతే ప్రజాస్వామ్యానికి అర్తమేంది? 20 శాతమో.. 30 శాతమో పోలైన పర్సెంటేజ్ను ప్రజాస్వామ్యం అన్జెప్పి సంకలు గుద్దుకొని సంబరపడ్దామా? గంత తక్వ పోలింగ్తోని మున్సిపల్ ఆపీస్ల గూసుండే లీడరు.. ఏంజేత్తె గాదాన్ని మనం అందరం ఆమోదించినట్టేనా? అండ్ల ప్రజాస్వామ్యం ఉన్నట్టేనా? గిసోంటి ఆలోశన్లు మేదావులల్ల, పార్టీలల్ల, ఎన్జీవోలల్ల మొదలైనయాట. మరి గసొంటప్పుడు తప్పకుంట ఓటేసే తీర్గ ఏమన్న కొత్త రూల్ దీస్కద్దామా? ఓటేసినోల్లకే నల్లా కనెచ్చను, ఓటర్ కారటు, రేషన్ కారటు ఉంటయని, లేకుంటే బంద్ జేత్తమని పెడ్తే ఎట్లుంటదీ.. అని గూడ సోచాయిస్తండ్రాట. మరి.. గీ ఎలచ్చన్ల ఎవల్ గెల్తరో సూసి.. రూలింగ్లకు వచ్చినోల్లు ఏం జేత్తరో సూద్దాం.
Comments
Post a Comment
Your Comments Please: