ఇది మా ఇలాకా.. ఇక్కడెవరి పప్పులూ ఉడకవు.. ఉడకనివ్వం అనుకొని విర్రవీగుతుంటే.. ఆ పప్పులు ఉడకబెట్టే మనిషెవరో ఎక్కడి నుంచో దిగి వస్తాడు. రాక తప్పదు. అలా రాకపోతేనే ప్రమాదం. గల్లీ పేరు జెప్పి ఢిల్లీని కొడతానంటే.. ఢిల్లీలో కూర్చున్నవాడు గల్లీలో వేలు పెట్టక తప్పదు. దాన్ని సమర్థించినవాడు దీన్ని కూడా సమర్థించాలి. లేదు.. నా ఇష్టం నాదే అంటే.. ఎవరిష్టం వారిదే అని కూడా అంగీకరించాల్సిందే. అలాంటప్పుడు బలమున్నవాడిదే బడితె... బర్రె కూడా.
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముంబైలో పర్యటిస్తున్నారు. పర్యటించడమే కాదు.. బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయన వేలు కూడా పెట్టారు. దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైకి అంతటి ఆయువుపట్టు తెచ్చింది సినిమా ఇండస్ట్రీనే. సినిమా ఇండస్ట్రీని అడ్డం పెట్టుకొనే అక్కడి రాజకీయాలు అధ్వానంగా తయారయ్యాయి. ప్రాంతీయ ప్రయోజనాలు, ఆత్మగౌరవం కోసం ఆవిర్భవించిన శివసేన కూడా హిందుత్వ ఎజెండాతో పాదుకొని సినీ ఇండస్ట్రీని చెప్పుచేతల్లో పెట్టుకుంది. మొన్న కంగనా రనౌత్ ను ఇబ్బంది పెట్టినా, అంతకుముందు అర్నాబ్ గోస్వామిని వెంటాడినా ఆ బలుపు చూసుకునే అనేది అందరికీ తెలిసిందే. అంతేకాదు.. శివసేన మొన్నటి బిహార్ ఎన్నికల్లో కూడా ఎన్డీయేను దెబ్బ కొట్టేందుకు అక్కడ ఓ వారం రోజులపాటు ఠికానా వేసి శాయశక్తులా ప్రయత్నించి విఫలమైంది. అటువంటి బలుపును తగ్గించేందుకే మోడీ-షా కనుసన్నల్లో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ముంబైలో కాలు మోపారు. పలువురు బాలీవుడ్ పెద్దలతో భేటీ అయి చర్చించారు. బాలీవుడ్ కి దీటుగా యూపీలో ఇండస్ట్రీ తయారయ్యేందుకు తాయిలాలు ప్రకటించారు. దాన్ని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ఎంపీ సంజయ్ నిరుపమ్ యహా సే బాలీవుడ్ కో కోయీ నహీ లే జా సక్తా... అని అక్కసు వెళ్లగక్కాల్సి వచ్చింది.
ఇక గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం-బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నప్పుడు.. బండి సంజయ్ ని, తెలంగాణ పర్యటించబోతున్న ఉత్తరాది నాయకుల టూర్ ను దృష్టిలో పెట్టుకొని.. తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.. మా హైదరాబాద్ ల మీ లొల్లేందిర బై అని అనడాన్ని గుర్తు చేసుకోవాలి. హైదరాబాద్ లో పుట్టి పెరిగినంత మాత్రాన మేం ఏం చేసినా చల్తా హై అనే యాటిట్యూడ్ ను ఏ విధంగా సమర్థించుకుంటారు? హైదరాబాద్ మీదైతే మీరేం చేసినా ఓకేనా? మీకు అవగాహన ఉన్నవారితో చీకటి ఒప్పందాలు చేసుకొని రాజ్యమేలుతామంటే ప్రజలకు ఓకేనా? ఈ వైఖరే మంచిది కాదు. హైదరాబాద్ లో పాదుకొని ఉన్న సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సర్కారు చెప్పినట్టు వింటారు.. మాదకద్రవ్యాల ఆరోపణల కేసును కూడా నీరుగార్చినా ఎవరేం మాట్లాడొద్దు.. వారు ఇక్కడే ఉండటానికి ఏమైనా చేస్తాం.. మేం చెప్పినట్టే వారు వింటారు.. వినాల్సిందే... అనే వైఖరి ఇక్కడ తెలంగాణ సర్కారులో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
రామోజీరావు ఫిల్మ్ సిటీ కి ప్రత్యామ్నాయంగా రాచకొండ గుట్టల మీద సువిశాలమైన భూమిలో ప్రపంచం నివ్వెరపోయే ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేస్తామని తెలంగాణ వచ్చిన కొత్తలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో గర్వంగా ప్రకటించారు. అందరూ సంతోషించారు. చాలా మంది పేదలకు, తెలంగాణలో ఉన్న సినిమా ప్రియులకు మంచిరోజులు వచ్చాయని అంతా సంతోషించారు. కానీ అలాంటిదేదీ జరగలేదు. ఇక్కడివారు ఏపీకి వెళ్లలేదు. వెళ్లాలన్న ఆలోచన కూడా వారికి లేదు. ఇదే అదనుగా ఇక్కడే ఉన్న సినీ ప్రముఖులను ఎలా మేనేజ్ చేయాలో, వారితో ఎలా రాజకీయ ప్రయోజనాలు పొందాలో మాత్రం కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా పని చేసుకుపోతున్నారు.
Also Read: గ్రేటర్ ఎన్నికలపై సర్వేలు ఏం చెప్తున్నాయి?
అయితే ముంబైలో పాతుకుపోయిన బాలీవుడ్ కీ-పర్సన్స్ ఒకవేళ నిజంగా యూపీకి తరలిపోతే.. తెలంగాణలో పాతుకుపోయిన టాలీవుడ్ కీ-పర్సన్స్ కూడా ఎక్కడికీ పోరని, లేక ఇక్కడే ఉంటారన్న గ్యారెంటీ ఏంటి? ఉండాలన్న కన్సర్న్ ఏంటి? శివసేన-కాంగ్రెస్ అవగాహనతో ఏమైనా చేద్దాం అనుకొని పథకరచన చేసుకున్నాయి. ఇక్కడా అలాంటిదే జరిగింది... జరుగుతోంది. మహారాష్ట్రలో బీజేపీ ఆ ఇద్దరినీ డిస్టర్బ్ చేస్తోంది. ఇక్కడ కూడా అదే బీజేపీ ఈ ఇద్దరినీ డిస్టర్బ్ చేయడం చూస్తూనే ఉన్నాం. మరి.. సొంతమని తెగ ఇదైపోతూ ఫీలైపోతున్న సొంత ఇలాకాలోకి ఇతరులు రాకుండా అడ్డుకునేదెవరు? రమ్మని తలుపులు తెరవాల్సిందెవరు? ఎవరి పని వారు చేసుకుపోవడమే రాజకీయ క్రీడ. ఆట ఇప్పుడు అంతటా మొదలవుతోంది. బీ కేర్ఫుల్.
Comments
Post a Comment
Your Comments Please: