Skip to main content

వనపర్తి గెలుపు బాటలో నిరంజన్ రెడ్డి

తెలంగాణలో సుదీర్ఘమైన, చెప్పుకోదగిన చరిత్ర గల పాతకాలపు సంస్థానమే వనపర్తి. ఆత్మాభిమానానికి, పౌరుష పరాక్రమాలకు, కవి గాయక వైతాళికులకు పెట్టింది పేరు.. ఈ వనపర్తి. కాలక్రమంలో అదే ఇప్పుడు నియోజకవర్గంగా మారింది. అలాంటి వనపర్తిలో ఎన్నికల పోరాటం రసవత్తరంగా మారుతోంది. అందుక్కారణం సిట్టింగ్ మినిస్టర్ గా, నీళ్ల నిరంజనుడిగా పేరున్న కేసీఆర్ అనుచరుడు ఒకరైతే.. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేసి, తెలంగాణ ఆవిర్భవించిన సమయంలోనూ ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్ నాయకుడు చిన్నారెడ్డి మరొకరు. అయితే ఆయనకు టికెట్ ఇస్తానని ఊరించిన కాంగ్రెస్ అధిష్టానం.. మేఘారెడ్డిని అభ్యర్థిగా మార్చేసింది. ఇలాంటి సమయంలో వనపర్తిలో గెలుపు జెండా ఎగరేసేది ఎవరు?
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని వనపర్తి నియోజకవర్గం గురించి చెప్పుకోవాలంటే తెలంగాణకు ముందు.. తెలంగాణకు తరువాత అని చెప్పుకోవాల్సి ఉంటుంది. తెలంగాణ ఆవిర్భావం తరువాత పాలమూరు రూపురేఖలు మారిపోయాయి. అందులో భాగమైన వనపర్తి జిల్లా పేరుతో ఏర్పడిన నియోజకవర్గం కూడా అభివృద్ధిలో పరుగులు తీసింది.
ఇప్పుడీ నియోజకవర్గంలో అధికార పార్టీ నుంచి సిట్టింగ్ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. కాంగ్రెస్ నుంచి మేఘారెడ్డి మధ్య పోరు తీవ్రంగా సాగుతోంది. బీజేపీ నుంచి అనుజ్ఞారెడ్డి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే ఎన్నికల రణక్షేత్రంలో పోరు మాత్రం బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్యే అన్నట్టుగా సాగుతోంది. మారిన పరిస్థితుల్లో బీజేపీ గ్రాఫ్ పడిపోవడంతో నియోజకవర్గంలో ఆ ఊసు ఎత్తేవారే లేకుండా పోయారట. ఇతరుల బలాబలాల గురించి కాసేపు పక్కన పెడితే.. ప్రధాన పోరు కొనసాగుతున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ల గురించే ప్రస్తుత చర్చంతా సాగుతోంది.

నిరంజన్ రెడ్డి తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్ కు నమ్మిన బంటుగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో 2014లో నిరంజన్ రెడ్డి అదే తెలంగాణ సెంటిమెంట్ ను నమ్ముకొని బరిలో నిలిచారు. అయితే ఆ సమయంలో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. అయినా ఓటమికి వెరువకుండా ఆయన ప్రజాక్షేత్రాన్నే అంటి పెట్టుకొని ఉన్నారు. బీఆర్ఎస్ కేడర్, తెలంగాణ ఉద్యమకారులతోనే కలిసి ఉంటూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన ఆలోచనలను ప్రజల ముందు పెడుతూ వచ్చారు. నీళ్లు లేక, వ్యవసాయం లేక, పడావు పడ్డ భూములను ఏం చేయాలో అర్థం కాక ఉన్న నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నిలపాలో మేధావులతో, ఉద్యమకారులతో, కవులతో కలిసి అనేక చర్చాగోష్టులు నిర్వహించారు. తనకు ఇష్టమైన రంగమైన వ్యవసాయాన్ని వనపర్తిలో ఏ విధంగా కొత్తపుంతలు తొక్కించాలో నిరంతరం అభిప్రాయాలు పంచుకున్నారు. ఆయన కృషిని గుర్తించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ బాధ్యతలు కట్టబెట్టి ప్రభుత్వంలో ఆయన సేవలను అకామొడేట్ చేయడం విశేషం. అటు పార్టీ ఫౌండర్ మెంబర్ గా ఉన్న నిరంజన్ రెడ్డి పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగారు. ఈ క్రమంలో 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నిరంజన్ రెడ్డి 50 వేలకు పైగా బంపర్ మెజారిటీతో గెలుపొందారు. ఆ తరువాత వనపర్తి రూపురేఖలే మారిపోయాయంటే అతిశయోక్తి కాదు. 2018లో బంపర్ మెజారిటీతో గెలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి.. ఇప్పుడు తాను చేసిన అభివృద్ధిని చూపుతూ ఓట్లు అడుగుతున్నారట. 

మరోవైపు కాంగ్రెస్ నుంచి యువకుడైన మేఘారెడ్డి.. ప్రస్తుత మంత్రి అయిన నిరంజన్ రెడ్డిని ఢీకొంటున్నారు. అయితే మేఘారెడ్డి వాస్తవానికి ఒకప్పుడు నిరంజన్ రెడ్డికి అనుచరుడిగా ఉండేవారట. ఆయన ప్రోత్సాహంతోనే వ్యాపార రంగంలో రాణించారట మేఘారెడ్డి. అయితే రాజకీయాల్లో రాణించాలన్న లక్ష్యంతో మేఘారెడ్డి.. నిరంజన్ రెడ్డికి దూరమై కాంగ్రెస్ టికెట్ కోసం శతవిధాలా ప్రయత్నించి ఎట్టకేలకు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు కాంగ్రెస్ కు ఉన్న ఊపే తనను గెలిపిస్తుందని, రేవంత్ రెడ్డి చరిష్మా గట్టెక్కిస్తుందని మేఘారెడ్డి భావిస్తున్నారట. కానీ మేఘారెడ్డికి టికెట్ దక్కడంలో జరిగిన ప్రహసనమే ఆయనకు గుదిబండగా మారిందన్న టాక్ వినిపిస్తోంది.

వనపర్తి కాంగ్రెస్ టికెట్ మొదట సీనియర్ నేత అయిన చిన్నారెడ్డికే కేటాయించారు. ఆయన పేరునే ప్రకటించారు. దీంతో చిన్నారెడ్డి ప్రచార కార్యక్రమాలకు రూపకల్పన చేసుకున్నారు. వనపర్తిలో భారీ ర్యాలీ కూడా తీశారట. ఎప్పుడూ ఖర్చు చేయని చిన్నారెడ్డి.. ఇది తనకు ఆఖరు ఎన్నికగా భావించి.. ఎలాగైనా గెలవాలని చేతికి ఎముక లేకుండా ఖర్చు కూడా చేశారట. అయితే కాంగ్రెస్ లో తెరవెనుక జరిగిన డ్రామాల ఫలితంగా చిన్నారెడ్డికి దక్కిన టికెట్ కాస్తా ఆఖరు నిమిషంలో మేఘారెడ్డి ఎగరేసుకుపోయారు. మరి టికెట్ వేటలో గెలిచిన మేఘారెడ్డి.. ఓట్ల వేటలో కూడా విజయం సాధిస్తారా అన్న చర్చే వనపర్తిలో ఇప్పుడు హాట్ టాపిగ్గా మారుతోంది. ఆ అంశమే అనుమానాస్పదంగా కూడా మారిందన్న టాక్ బలపడుతోంది.

నిజానికి చిన్నారెడ్డి సోనియా కోటాలోనే టికెట్ దక్కించుకున్నారట. టీ-పీసీసీ చీఫ్, ఇతర స్థానిక లీడర్లతో పని లేకుండా నేరుగా అధిష్టానమే తన పేరు ఖరారు చేసింది. దీంతో కేడర్ అంతా తనకు సపోర్టు చేస్తుందని.. ఇప్పుడున్న హవాలో తాను తప్పకుండా గెలిచి వస్తానని చిన్నారెడ్డి భావించారు. తీరా మేఘారెడ్డిని రీ-కన్ఫామ్ చేయడంతో చిన్నారెడ్డి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట. ఒకవైపు కాంగ్రెస్ కు విధేయుడిగా కనిపిస్తూ.. మరోవైపు తనకు వచ్చిన టికెట్ చేజారిన ఫలితంగా పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పని చేయడానికి మనసొప్పడం లేదట. మరోవైపు.. తాను ఈసారి పార్టీకి సహకరించాలంటే.. భవిష్యత్తులో తన కుమారుడైన ఆదిత్యకు అవకాశం ఇవ్వాలని అధిష్టానంతో ఒప్పందం కుదుర్చుకున్నారట చిన్నారెడ్డి. ఈ ఈక్వేషన్ కు హైకమాండ్ ఓకే చెప్పడంతో చిన్నారెడ్డి మేఘారెడ్డికి సహకరిస్తానని కార్యకర్తల సమక్షంలోనే చెప్పారట. అయితే మేఘారెడ్డికి మాత్రం తాను మనస్పూర్తిగా సహకరించడం లేదట. ఏదో నామ్ కే వాస్తే అన్నట్టుగా ప్రచారంలో అడపాదడపా కనిపించడం మినహా.. మనసు పెట్టి వర్క్ చేయడం లేదట. అటు తన అనుచరులకు మీ ఇష్టం వచ్చినవారికి చేయండి అంటూ తెలివిగా నిశ్శబ్దం పాటిస్తున్నారట. దీంతో అనుచరులు తమ ఇష్టానుసారం కొందరు మేఘారెడ్డికి, మరికొందరు నిరంజన్ రెడ్డి వైపు వెళ్లిపోయి ప్రచారంలో పాల్గొంటున్నారట.

మరోవైపు మంత్రి నిరంజన్ రెడ్డి ఇప్పటికే టీడీపీ మాజీ నేత, మంత్రిగా పని చేసిన రావుల చంద్రశేఖర్ రెడ్డికి బీఆర్ఎస్ కండువా కప్పడంలో సఫలీకృతుడై.. గెలుపును ఖాయం చేసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఒకవైపు బీడు భూముల్లో నీళ్లు పారించిన నిరంజన్ రెడ్డి.. మరోవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి దిశలో పరుగులు తీయిస్తున్నారన్న పేరు తెచ్చుకున్నారు. అటు కాంగ్రెస్ కేడర్ కూడా కళ్లకు కనిపిస్తున్న అభివృద్ధిని కాదనలేకపోతోంది. దీంతో మేఘారెడ్డి తొలుత టఫ్ ఫైట్ ఇస్తారన్న అభిప్రాయం కలిగించినా.. మారిన పరిస్థితుల నేపథ్యంలో నిరంజన్ రెడ్డికి గెలుపు అవకాశాలు మరింత మెరుగయ్యాయన్న టాక్ వినిపిస్తోంది. తనకు గురువైన నిరంజన్ రెండోసారి గెలుపును అడ్డుకోవడం.. శిష్యుడైన మేఘారెడ్డి వల్ల అవుతుందా.. అనే చర్చనే వనపర్తిలో నడుస్తోంది. మరోవైపు బీజేపీ నుంచి కొత్త వ్యక్తి అయిన అనుజ్ఞారెడ్డిని ఆ పార్టీ అధిష్టానం బరిలో నిలిపింది. ఇక్కడ బీజేపీ గురించి పెద్దగా చర్చలో లేకపోవడం.. నిరంజన్ రెడ్డికి కలిసొస్తుందనే టాక్ కూడా వినిపిస్తోంది. రేపు మరేం జరుగుతుందో చూడాలి. 



Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?