Skip to main content

ఔను.. అది "సామాజిక విశ్వరూప మహాసభ"

తేదీ: 11-11-2023, శనివారం, సాయంత్రం (నరక చతుర్దశి నడుస్తున్న సమయం)

అది చరిత్ర పుటల్లో శాశ్వతంగా నిలిచిపోయే ఒక శుభ ముహూర్తం. 

దళితజాతిలోని మాదిగ బిడ్డలకు సామాజిక న్యాయం జరగబోతోంది అనడానికి పునాదులు పడిపోయిన పుణ్య తిథి.
14 ఏళ్ల తెలంగాణ పోరాటాన్ని మించి నడుస్తున్న మాదిగ రిజర్వేషన్ పోరాటం అంతిమ ఘట్టానికి చేరిందన్న సంకేతం వెలువడిన అద్భుత సందర్భం. 
హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ ఒక చారిత్రక సన్నివేశానికి వేదికగా మారింది. దేశవ్యాప్తంగా మరో భారీ నిర్ణయానికి అంకురారోపణం జరిగిపోయింది. ఇక ఆవిష్కారమే తరువాయి. అదే ఎస్సీ వర్గాలు, అందులోని ఉపకులాల వాటాలు తేల్చే విభజన విషయం. 

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభలో ఆ సంస్థ అధినేత, అనేక సామాజిక ఉద్యమాల్లో పాల్గొనడమే గాక.. వాటికి నేతృత్వం వహించిన మందకృష్ణ మాదిగ మాట్లాడిన తీరు అపురూపం, ఆయన ఆవిష్కరించిన స్వప్నం రేపటి రాజకీయాలను కీలక మలుపు తిప్పనున్న ఒక ఉద్విగ్నభరిత సచిత్ర దృశ్యరూపం. 20 నిమిషాలకు పైగా మందృష్ణ మాట్లాడింది ఒక మామూలు ప్రసంగం కాదు. తన జీవిత పోరాటాన్ని, మాదిగ జాతి 30 ఏళ్లుగా తన హక్కుల సాకారం కోసం నిరంతరాయంగా చేస్తున్న ఆరాటాన్ని ఆవిష్కరింపజేశారు. ప్రధానమంత్రి మోడీని ఆయనే రప్పించారా.. లేక మోడీ అండ్ టీమ్ వ్యూహాత్మకంగా మందకృష్ణకు ఆ అవకాశం ఇచ్చి బహిరంగ సభను ఏర్పాటు చేయించారా అనే రంధ్రాన్వేషణను కాసేపు పక్కన పెట్టి అసలు చిత్రాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 

తమ జాతి బిడ్డలు, తమకు ఎదురైన సామాజిక వివక్షకు ఎదురీదుతూ రాజ్యాంగ నిర్మాత ప్రసాదించిన హక్కుల సాధన కోసం 30 ఏళ్లు పోరాడాల్సిన కపట రాజకీయ సన్నివేశాలు ఈ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయని.. పెట్టుబడులకు, కట్టుకథలకు పుట్టిన దుష్ట సంతతి మీడియా కూడా తమ పట్ల తీవ్రమైన వివక్ష చూపుతోందని.. ఢిల్లీలో కొలువుదీరిన ప్రభువుల దృష్టిని ఆకర్షించేంత కవరేజీ బలం, కండబలం, కాసుల దమ్మూ తమకు లేవని.. తమ 30 ఏళ్ల పోరాటానికి న్యాయం దక్కాలంటే అది మోడీ ఒక్కడి వల్లనే సాధ్యమవుతుందని, మరో వ్యక్తితో, మరో నాయకుడితో అయ్యే పని కాదని ఆపుకోలేని ఉద్వేగం మాటున ఆసాంతం గద్గద స్వరంతోనే తన అంతరంగాన్ని మోడీ ముందు పరచారు. తమ సభకు మోడీ వంటి మహా నాయకుడు వస్తున్నాడంటే తమ సమస్యకు పరిష్కారం దొరికినట్టేననే భావన మాదిగ జాతి ప్రజల్లోకి వెళ్లిపోయందని రేపటి పరిణామాలకు పూర్వరంగాన్ని చూచాయగా స్పృశించారు మందకృష్ణ. 

ఆయన మాటలో అడుగడుగునా ఆనందమే కనిపించింది. ఆయన శరీరంలో అణువణువునా పులకరింతే వ్యక్తమైంది. తెలంగాణలో గానీ, ఆంధ్రాలో గానీ, ఉమ్మడి ఆంధ్రాలో గానీ ఎమ్మార్పీఎస్ ను వైఎస్ చంద్రబాబునాయుడు నుంచి వైఎస్ దాకా వాడుకుని వదిలేసినవారే. ఏ ప్రాంతంలో ఏ వర్గం ఓట్లు ఎన్నున్నాయి, అప్పుడు ఎలా వ్యవహరిస్తే బాగుంటుంది, అది ఎవరికి లాభం చేసి పెడుతుంది.. ఇలాంటి వ్యాపార లెక్కలే రాజకీయాలను శాసించాయి, శాసిస్తున్నాయి. తన 30 ఏళ్ల ఎమ్మార్పీఎస్ జీవితం, అంతకుముందు అజ్ఞాత ఉద్యమ జీవితం.. ఆయన ఎంతమందిని చూసి ఉంటారు? ఎంతమంది ముఖ్యమంత్రులతో చాలా దగ్గరగా మాట్లాడి ఉంటారు? ఎవరి వైఖరేంటో అర్థం చేసుకోలేనంత అమాయకుడా మందకృష్ణ? వారు తమ డిమాండ్ ను పరిష్కరిస్తారేమోనని ఎదురుచూసి చూసి అలసిపోయాడు మందకృష్ణ. దేశానికే కాదు.. ప్రపంచానికే పెద్దన్నగా అవతరించిన మోడీ కాక ఇంకెవరూ తమ సమస్యను పరిష్కరించలేరన్న భావన ఏర్పడితే అందులో వాస్తవం లేకపోలేదు. తన ఉపన్యాసం నిండా మోడీలోని అంతరంగాన్ని ఎంత చక్కగా ఆవిష్కరించారు మందకృష్ణ. 

అందుకు తగినట్టుగానే ప్రధాని కూడా మందకృష్ణకు ఎంత గొప్ప విలువ ఇచ్చారు? మాదిగ రిజర్వేషన్ పోరాటానికి నాయకుడు కృష్ణ అయితే... ఇక నుంచి ఆయనకు తాను కూడా ఒక కార్యకర్తగా  తోడవుతున్నానని ప్రకటించడం ఎంత గొప్ప రెస్పాన్స్? వన్ లైఫ్, వన్ మిషన్ అంటూ మందకృష్ణ జీవితానికి ఎంత అద్భుతమైన టైటిల్ ఇచ్చారు మోడీ? మాదిగ రిజర్వేషన్, వాటాల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని.. అందుకోసం ముందుగా ఓ కమిటీని వేస్తామని.. ఈ సమస్య సుప్రీంకోర్టులో ఉన్నందున కోర్టులో మందకృష్ణకు అండగా తమ ప్రభుత్వం నిలబడి పోరాడుతుందని ఎంత చక్కటి రోడ్ మ్యాప్ ప్రకటించారు మోడీ? మోడీ మాటల్లో.. సమస్య ఎంత లోతైనది అయినప్పటికీ, ఎంత క్లిష్టమైంది అయినప్పటికీ తాము వాటి సాధన దిశగా కలబడతామని చెప్పడానికి మించిన గ్యారెంటీ ఏం కావాలి? సమస్యకు దాదాపుగా ఓ అద్భుతమైన పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందన్న అభిప్రాయానికి అక్కడే పునాది పడిపోయింది. 

అటు మందకృష్ణ కూడా తమ సమస్యకు పరిష్కారం దొరికితే.. బీజేపీ బలహీనంగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో మోడీకి లక్ష్మణుడిగా, ఓ తమ్ముడిగా ఉండే బాధ్యతలు తీసుకుంటానని హామీ ఇవ్వడం రేపటి రాజకీయాలు, సామాజిక పరిణామాలు ఎలా ఉంటాయో చెప్పకనే చెబుతోంది. తెలంగాణ ప్రజలంతా కోరుకున్న తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి కేసీఆర్  ఓ ఉద్యమకారుడిగా తాత్కాలికంగా నటించిన దానికి ఆయన తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత? 30 ఏళ్లుగా మందకృష్ణ అండ్ టీమ్ పోరాడుతున్నదానికి వారికి దక్కిన రెమ్యూనరేషన్ ఎంత? ఆ రెండూ పక్కపక్కన పెట్టి చూస్తే.. ఎవరి ఉద్యమంలో వెయిటేజీ ఉంది? ఎవరి ఉద్యమంలో చిత్తశుద్ధి ఉంది? ఉద్యమం పేరు చెప్పి ఊరేగుతున్నది ఎవరు? చినిగిపోయిన బట్టలతో ఇప్పటికీ ఎక్కే గడపా, దిగే గడపా నడుస్తున్నది ఎవరు? 30  ఏళ్లుగా మాదిగల డిమాండ్ ను సజీవంగా ఉంచడానికి మందకృష్ణ ఎన్ని బాధలు భరించాడో, ఎన్ని అవమానాలు భరించాడో ఊహించడం కష్టమా? తెలంగాణ ఉద్యమాన్ని మందకృష్ణ ముందుండి నడిపించకపోయినా కీలకమైన అన్ని సమయాల్లో కూడా అండగా ఉండి.. ఉద్యమ దీపాన్ని ఆరిపోకుండా కాపాడాడు. అది నేటికీ తెలంగాణ సమాజం మరచిపోదు. కానీ ఉద్యమకారుల పేరిట, రాష్ట్రం వచ్చిన తరువాత ఆ ఫలాలు అనుభవిస్తూ ఇప్పటికీ అవసరాన్ని బట్టి మళ్లీ తెలంగాణ ముసుగు తొడుక్కుంటున్నవారి గురించి కూడా తెలంగాణ ప్రజలకు బాగానే అర్థమైంది. 

అందుకే ఇప్పుడు కేసీఆర్ మీద మందకృష్ణ ఓ తిరుగులేని అస్త్రం కాబోతున్నారు. రాజకీయం తప్ప ఏదీ తెలియని కేసీఆర్.. దుష్ట రాజకీయాల కోసం పనికిమాలిన హామీలు, దిక్కుమాలిన ఈక్వేషన్లు తెరమీదికి తీసుకొస్తూ ఓ ప్రమాదకరమైన అసాంఘిక శక్తిగా మారిపోయారంటే అతిశయోక్తి కాదేమో. ముస్లిం మైనారిటీల్లో మహిళలు ఎదుర్కొంటున్న ట్రిపుల్ తలాక్ గురించి మాట్లాడిన మందకృష్ణకు.. ఓట్ల కోసం మైనారిటీ కార్డును ప్లే చేస్తూ అత్యంత ప్రమాదకరమైన రాజకీయ క్రీడను మొదలుపెట్టిన కేసీఆర్ కు ఎంత తేడా ఉంది? బీజేపీకి తెలంగాణ మీదుగా దక్షిణాది రాజకీయ యాత్రలో తాను అండగా ఉంటానని చెప్పిన మందకృష్ణ.. ఇటు కేసీఆర్ ను, అటు కాంగ్రెస్ ను సమానంగా చెడుగుడు ఆడేశారు. అటు బీజేపీ కూడా దొరల సమాజానికి చెందిన కేసీఆర్ మీద, మాదిగ బిడ్డ అయిన మందకృష్ణను మరో పోరాటానికి సమాయత్తం చేస్తోంది. అందుకు మందకృష్ణ కూడా తాను సిద్ధంగా ఉన్నానని.. సభాముఖంగానే ప్రకటించడం విశేషం. 

ఈ అసెంబ్లీ ఎన్నికలు ఎలా ఉన్నా.. అటు తరువాత వచ్చే పార్లమెంట్ ఎన్నికల వరకు యావత్ ఈక్వేషన్స్ మారబోతున్నాయన్నమాట. అక్కడిదాకా ఎందుకు? కేసీఆర్ పై పోరాటం.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనే మొదలైనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. కేసీఆర్ ముస్లింలను దుర్నీతితో వాడుకుంటూ దుష్ట రాజకీయం చేసేందుకు అన్ని పథకాలూ వేసుకొని పెట్టుకుంటే... రేపు మందకృష్ణ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పోరు జరిగే ఆస్కారం ఉందన్న ఊహాచిత్రం కళ్లముందు కదలాడుతోంది. అయితే అంతకన్నా ముందు మాదిగ రిజర్వేషన్ విషయంలో మోడీ నుంచి హామీ నెరవేరితేనే అనేది మాత్రం మరువరాదు. మొత్తానికి దక్షిణాదిలో, ముఖ్యంగా తెలంగాణలో మందకృష్ణ ఒక భయంకరమైన నిశ్శబ్దాన్ని ఛేదించారు. ఇక శంఖం ఊదడమే మిగిలింది. 

నోట్- ఈ వార్త బాగుందనిపిస్తే షేర్ చేయండి. ఇంకా బాగుందనిపిస్తే ఓ కామెంట్ రాయండి. బాగా లేదనిపించినా కామెంట్ రాయండి. 

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత