Skip to main content

వీరభద్ర విజయం - ఒక పర్ఫెక్ట్ సర్జికల్ స్ట్రయిక్

సర్జికల్ స్ట్రయిక్ అంటే 2016లో భారతదేశం పాకిస్తాన్ మీద చేసిందే అనుకుంటారు అందరూ. కానీ అది ఓ కొనసాగింపు మాత్రమే. అలాంటి సర్జికల్ స్ట్రయిక్, అంతకన్నా ప్రమాదకరమైంది, అంతకన్నా ఎన్నో రెట్ల భయంకరమైంది భారతీయ పురాణ కాలంలోనే జరిగింది. ఆ సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించిన రుద్రమూర్తే వీరభద్రస్వామి. బహుశా దాన్ని మొట్టమొదటి సర్జికల్ స్ట్రయిక్ గా భావించవచ్చేమో. 
శత్రువు చేతిలో జరిగిన అవమానానికి ప్రతీకారమే సరైన చర్య. అవమానించడానికి శత్రువే కానక్కర లేదు. కాళ్లు కడిగి కన్యాదానం చేసిన మామ అయినా సరే.. అవమానించాడంటే శత్రువు కిందే లెక్క. సాక్షాత్తూ పరమశివుడు కూడా అదే సూత్రాన్ని పాటించాడు. అల్లుణ్ని అవమానించడానికే దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టాడట. తండ్రి పిలవకపోయినా ఓ గొప్ప కార్యాన్ని, శుభకార్యాన్ని తలపెట్టాడు కాబట్టి వెళ్లొస్తానని శివుని దగ్గర బలవంతంగా అనుమతి తీసుకొని వెళ్లిపోయింది పార్వతి. దుర్బుద్ధితోనే యజ్ఞం తలపెట్టిన దక్షుడు.. కూతురు ముందే అల్లుణ్ని దారుణంగా అవమానించాడు. శివుడికి కూతురును ఇచ్చి పెళ్లి చేయడమే ఇష్టం లేని దక్షుడు.. కూతురే ఇష్టపడి చేసుకోవడంతో ఏమీ అనలేకపోయాడు. కానీ అల్లుడి మీద, అల్లుడి పేదరికం మీదా, ఆడంబరాలకు ఏమాత్రం విలువ ఇవ్వని ఆయన వైరాగ్యం మీద, బిచ్చమెత్తుకుంటే తప్ప పూట గడవని శివుడి దైన్యం మీద దక్షుడికి ఏమాత్రం గౌరవ భావం లేదు. ఆదరణ అసలే లేదు. ఇలాంటి తరుణంలో పిలవని పేరంటానికి వచ్చిన కూతురును సాకుగా తీసుకొని అల్లుడి మీద వాగ్బాణాలు సంధించాడు. ఘోరంగా అవమానించాడు. వెకిలిగా విమర్శించాడు. ఆ యజ్ఞానికి అతిథులుగా వచ్చిన దేవతలందరి ముందూ తన భువనైక నాథుడిని సాక్షాత్తూ తండ్రే ఛీత్కరించడంతో పార్వతీదేవి మనసు కలుక్కుమంది. అలా అందరి ముందూ జరిగిన అవమానం తరువాత బతికి ఉండడం అనేది చావు కన్నా దారుణం. అది కూడా అక్కడ ఆహూతులుగా వచ్చిన దేవీదేవతలందరూ కొలిచే శివుణ్నే అవమానించాక.. తానిక బతికిి ఉండడంలో అర్థం లేదనుకుంది. యోగాగ్ని రాజేసుకొని మంటల్లో ఆహుతైంది.
అక్కడ కైలాసనాథుడికి ఈ దుర్వార్త తెలిసింది. ముక్కు అదిరింది. మూడోనేత్రం నిప్పులు చిమ్మింది. తన ప్రియసతి, తనలో సగభాగంగా నిలుపుకున్న పార్వతీదేవి మరణానికి కారణమైన దక్షుడు ఇకపై ఎప్పుడూ అలాంటి పని చేయకూడదనుకున్నాడు. పట్టలేని ఆగ్రహంతో తాండవం ఆడాడు. తన జడల్లోంచి ఓ పాయను తీసి నేలకేసి కొట్టగా.. ఆ నిప్పుల్లోంచి వీరభద్రుడు ఉదయించాడు. కోరమీసాలతో, భయంకరమైన రూపంతో, బహు బాహువులతో, అనేక ఆయుధాలతో పట్టసం అనే ఖడ్గాన్ని చేతబూని తండ్రి శివయ్య నుంచి ఆజ్ఞ తీసుకొని దక్షుడు చేస్తున్న యజ్ఞవాటికకు వెళ్లి విధ్వంసం సృష్టించాడు. తండ్రిని అవమానించేందుకు తలపెట్టిన యజ్ఞశాలలను అగ్నికి ఆహుతి చేశాడు. అడ్డుకోవడానికి వచ్చిన దక్షుడి పరివారాన్ని, దేవతా గణాలను సైతం చీల్చి చెండాడాడు. ఆ ఉగ్రరూపానికి మహామహులందరూ తలోదిక్కు పరారయ్యారు. అహంకరించి తండ్రిని అవమానించినందుకు, తల్లి పార్వతి దహనానికి కారణమైన దక్షుడి తల నరికేశాడు. ఆ తరువాత అందరి కోరిక మేరకు మేక తల తొడిగి కాపాడారు. అది వేరే కథ. దీన్ని మించిన సర్జికల్ స్ట్రయిక్ బహుశా మన పురాణగాథల్లో ఎక్కడా కనిపించదు. పరమశివుడు తలపెట్టిన ఆనాటి సర్జికల్ స్ట్రయిక్ ను అత్యంత కచ్చితత్వంతో పూర్తి చేసిన శివాంశ సంభూతుడే వీరభద్రస్వామి. వీరభద్రుడికి దేశమంతటా అనేక ప్రాంతాల్లో దేవాలయాలు ఉన్నాయి. 
వీరభద్రస్వామి కొలువైన కొత్తకొండ
పాత కరీంనగర్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం కొత్తకొండలో వెలసిన శ్రీ వీరభద్రస్వామి పుణ్యక్షేత్రం తెలంగాణలోని ప్రముఖ శైవాలయాల్లో ఒకటి. ఆసియా ఖండంలో ఖ్యాతికెక్కిన పాల సహకార సంఘం, ముల్కనూరుకు కేవలం 5 కి.మీ. దూరంలోనే ఉందీ క్షేత్రం. తొలుత కొండ మీదనే స్వామి ఉండేవాడంటారు. అయితే భక్తులందరికీ అందుబాటులో ఉండడానికి వీలుగా కొన్ని తరాల క్రితమే కిందికి తీసుకొచ్చారు. ఎత్తయిన కొండ పైనుంచి వీరభద్రుణ్ని జాగ్రత్తగా దింపటానికి చాలా మొత్తంలో దూదిని వాడారట. ఆ పని చేసింది స్థానిక కుమ్మరులే అని స్థల పురాణం చెబుతుంది. అయితే స్వామిని కిందికి దింపే క్రమంలో ఆయన కాలు విరిగినట్లు స్థానికులు చెబుతుంటారు. అందుకే విగ్రహం రెండు కాళ్లు సమానంగాా ఉండవు అంటారు. నిరాడంబరుడైన తెలంగాణ సహజకవి బమ్మెర పోతన రాసిన పురాణేతిహాసమే వీరభద్ర విజయం. విజయానికి చిరునామా వీరభద్రుడేనని ఇంతకన్నా చెప్పాల్సింది లేదంటారు అనుభవజ్ఞులు.

కాకతీయుల కాలం నాటి ఈ దేవాలయాన్ని రాళ్ల మధ్య నిర్మించారు. ఇలాంటి శిలామయమైన ప్రదేశంలో కూడా ఏడు కోనేరులు నీటితో నిండి ఉండటం వీరభద్రస్వామి మహిమగా ప్రజలు చెప్పుకుంటారు. ప్రతి సంవత్సరం జనవరిలో సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి మారిన సంక్రాంతి ముందురోజు ఇక్కడ భవ్యమైన జాతర జరుగుతుంది. ఈ జాతర ప్రధాన ఆకర్షణగా సంక్రాంతి రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు ఎడ్లబండ్లలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి సంవత్సరం పుష్య బహుళ పంచమి నుంచి 10 రోజులపాటు స్వామివారి కళ్యాణోత్సవం జరుగుతుంది. 

వీరభద్రుణ్ని ప్రతిష్టించిన వీరబ్రహ్మేంద్రస్వామి
వీరభద్రుడికి వీరబ్రహ్మేంద్రస్వామికి ఓ ఆశ్చర్యకరమైన సామ్యం ఉంది. చిల్లర రాళ్లకు మొక్కుతు ఉంటే చిత్తము చెడురా ఒరే ఒరే.. అని ప్రబోధించిన కాలజ్ఞానకర్త, జగద్గురువు వీరబ్రహ్మేంద్రస్వామి కడప జిల్లాలోని అల్లాడుపల్లెలో స్వహస్తాలతో వీరభద్రుడి శిల్పాన్ని చెక్కి ప్రతిష్టించారు. అల్లాడుపల్లె వీరభద్రుణ్ని  దర్శించుకోవడానికి రాయలసీమ నుంచే గాక కర్నాటక నుంచి పెద్దసంఖ్యలో క్యూ కడతారు భక్తులు. తలపెట్టిన పనిని పక్కాగా పూర్తి చేసే శక్తి వీరభద్రుడికి ఉందని.. ఆయన్ని ఆరాధిస్తే శత్రువులపై విజయం ఖాయమని మహానుభావులు ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి స్వయంగా వీరభద్రుణ్ని ప్రతిష్టించడం అందుకు ఓ తిరుగులేని తార్కాణంగా భావిస్తారు. కొత్తకొండకు వచ్చే భక్తులు కూడా తాము కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా వీరభద్రుణ్ని కొలుస్తారు. 

ఈ సంవత్సరం (2023) జనవరి 10 నుంచి 18వ తేదీ వరకు వీరభద్రుడి బ్రహ్మోత్సవాలు జరుగుతాయని ఆలయ ఈఓ కిషన్ రావు చెప్పారు. 10వ తేదీ, మంగళవారం సా. 6-20కి శ్రీ వీరభద్రస్వామి-భద్రకాళీమాత కళ్యాణం, 14వ తేదీన భోగీ పండుగ, 15వ తేదీ సంక్రాంతి రోజున బండ్లు తిరగడం, 16వ తేదీ నాగవెల్లి, 17వ తేదీ త్రిశూల స్నానం, 18వ తేదీ అగ్నిగుండాలు వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయని కిషన్ రావు చెప్పారు. 

Comments

Post a Comment

Your Comments Please:

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత