Skip to main content

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ


భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ. 

రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు బహుశా భరతఖండంలోని ఏ రాజు కూడా చేసి ఉండకపోవచ్చంటారు చరిత్ర పరిశోధకులు. 

సూర్యవంశ రాజులు ఈ దేశంలోని చాలా భూభాగాలను యుగయుగాలుగా పరిపాలిస్తున్నారు. ఆ సూర్యవంశానికి చెందిన సిసోడియా రాజపుత్రుల కుటుంబంలో ఉద్భవించిన త్యాగశీలుడైన గొప్ప పరిపాలకుడే మహారాణా ప్రతాప్. ఆయన పూర్తిపేరు కుంవర్ ప్రతాప్‎ సింహ్ జీ. 1540 మే 9న రాజస్థాన్‎లోని కుంభల్ గఢ్‎లో జన్మించాడు. తండ్రి మహారాణా ఉదయసింహ్. తల్లి రాణి జీవత్ కుంవర్ జీ. 1568 నుంచి 1597 వరకు మేవాడ్ పాలకుడిగా 29 ఏళ్లు పరిపాలించాడు. పాలకుడిగా ఉన్నన్నాళ్లూ మొఘల్ దాడులను తిప్పికొట్టడానికే జీవితాతం పోరాడిన వ్యక్తి రాణాప్రతాప్. ఇక సిసోడియా రాజవంశీకులు 13వ శతాబ్దం నుంచీ ఓ గొప్పనైన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వీరు ఎక్కడా తమను తాము రాజులుగా ప్రకటించుకోలేదు. రాజరికపు ఛాయలు వారి పాలనలో ఎక్కడా కనిపించలేదని చరిత్ర విశ్లేషకులు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. తమ దృష్టిలో వారంతా రాజ్యానికి కాపలాదారులే తప్ప.. రాజులు కారు. ఇంకో రకంగా చెప్పాలంటే వారు రాజ్యానికి సేవకులు మాత్రమే. ఇదే అవగాహనతో సిసోడియా రాజవంశీకులు చివరివరకూ వ్యవహరించారు. అందుకే వారి పేర్ల చివర గానీ, ముందు గానీ రాజు అనో, రాజాధిరాజు అనో, మహారాజా అనో... ఇలాంటి పదాలు కనిపించవంటారు చరిత్రకారులు. మరి రాజెవరు? పరిపాలన ఎవరి పేరుతో సాగుతుందన్నది మరో ఆసక్తికరమైన అంశం. సిసోడియా రాజవంశీకుల దృష్టిలో మేవాడ్ కు రాజు.. స్వామి ఏక్ లింగ్‎జీ. అంటే మేవాడ్ లో కొలువైన శివుడన్నమాట. పరమేశ్వరుడే రాజుగా.. ఆ పరమేశ్వరుడి పేరు మీద రాజ్యాన్ని కాపలా కాసే సైనికులుగా మాత్రమే తమను తాము భావించుకుంటారు. రాణా అంటే కస్టోడియన్. మహారాణా అంటే ప్రధాన కస్టోడియన్.. లేదా ప్రధాన కాపలాదారుడన్నమాట. ఇంతటి ఔదార్యమైన భావనతో పరిపాలించినవారిని నేటి కాలంలోనైతే అసలు ఊహించలేం కూడా. 

భారతదేశానికి చక్రవర్తిని అనిపించుకోవాలన్న ఉద్దేశంతో అక్బర్.. తన సామ్రాజ్యాన్ని విస్తరింపుజేసుకోవడంలో నిగ్నమయ్యాడు. అందులో భాగంగానే మేవాడ్ ను కూడా కలుపుకోవాలని కలలు గన్నాడు. మహారాణా ప్రతాప్ గురించి ఎందరో రాజులు గొప్పగా చెప్పిన ఫలితంగా ఆయనపై యుద్ధం చేయడం కన్నా ఆయన్ని రాజీ పరచుకొని సామంతుడిగా ఉండమని ఒప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అక్బర్. తనకు సామంతులుగా మారిన ఎందరో హిందూ రాజుల చేత రాయబారం నడిపించాడు. అప్పటికే అనేక మంది హిందూ రాజపుత్రులతో సంబంధాలు కలుపుకొని.. మతాతీత లౌకికవాదిగా తన దగ్గరి కవులచేత రాతలు రాయించుకున్న అక్బర్.. మిగతా రాజులు అందరికన్నా రాణాప్రతాప్ కు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు తనకు ఎదురులేని సామ్రాజ్యం నిర్మించుకోవాలనేది అక్బర్ కల. అందుకు మధ్యలో రాజస్థాన్ లోని మేవాడ్ రాజ్యం ఉంది. మేవాడ్ ను లోబరచుకోకుండా గుజరాత్ చేరుకోవడం అసాధ్యం కాబట్టి.. మేవాడ్ కు అతను అధిక ప్రాధాన్యతనిచ్చాడు. అయితే రాయబారాలేవీ ఫలించకపోవడంతో యుద్ధ తంత్రం ప్రయోగించాడు అక్బర్. 

అక్బర్ కు సామంతుడైన అంబర్ కు చెందిన రాజా మాన్‎సింగ్ నేతృత్వంలోని మొఘల్ దళాలకు.. మేవాడ్ మహారాణాకు హల్దీఘాటీ అనే కొండప్రాంతంలో జరిగిన చారిత్రక యుద్ధమే హల్దీఘాటీ యుద్ధం. 1576 జూన్ 18న ఈ యుద్ధం మొదలైందని చెబుతారు. ఈ యుద్ధంలో మొఘలు సేనలు.. మేవాడ్ దళాలకు గణనీయమైన ప్రాణనష్టం కలిగించాయి. చివరికి చిత్తోడ్, మండల్ గఢ్ వంటి పలు ప్రాంతాలు మొఘలుల వశమైపోయాయి. సైనికపరంగా రాణాప్రతాప్ దగ్గర దాదాపు 20 వేలు, అక్బర్ సైన్యంలో దాదాపు 80వేల మంది ఉన్నారంటారు చరిత్రకారులు. మరోవైపు మొఘల్స్ దగ్గర తుపాకులు, ఫిరంగులు ఉండగా.. రాణాప్రతాప్ దగ్గరున్న భిల్లు అనే గిరిజన జాతి సైనికులే ఉన్నారు. ఈటలు, బల్లాలు వంటి నాటు ఆయుధాలు మాత్రమే వీళ్ల దగ్గర ఉన్నాయి. ఫలితంగా యుద్ధంలో ఓటమితో రాణాప్రతాప్ ను యుద్ధభూమి నుంచి తప్పించారు అతని ఆంతరంగికులు. అక్బర్ కు పట్టుపడకుండా తప్పించుకుని అడవుల్లో తలదాచుకుంటూ.. కోల్పోయిన భూభాగాలను మళ్లీ పొందేందుకు నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు మహారాణా ప్రతాప్. అడవుల్లో తిండి కూడా దొరకని పరిస్థితుల్లో గడ్డి రొట్టెలు చేసుకొని తిన్నాడు. సార్వభౌమాధికారం కలిగిన ఒక భారతీయ రాజు ఇంతటి కష్టాలు అనుభవించిన దాఖలాలు బహుశా లేవనే చెప్పాలి. 

ఇక అడవుల్లో అజ్ఞాతంగా ఉంటున్న రాణాప్రతాప్.. తనచుట్టూ అక్బర్ కు సామంతులుగా ఉన్న రాజులను నమ్మలేదు. అందుకు బదులుగా.. భిల్లు జాతి గిరిజన సేనను సమకూర్చుకున్నాడు. వారికి సైనికంగా తర్ఫీదునిచ్చాడు. భామాషా అనే ఆనాటి పెద్ద వ్యాపారి.. అక్బర్ కు వ్యతిరేకంగా పోరాడుతూ స్వేదేశీ ఆత్మగౌరవం కోసం ప్రయత్నిస్తున్న రాణాప్రతాప్ కు భారీఎత్తున సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. అతను ఇచ్చిన డబ్బుతో అవసరమైన సరంజామాను రాణాప్రతాప్ సమకూర్చుకున్నాడు. అయితే మొఘలుల దృష్టి 1585 తర్వాత సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలపైకి మళ్లడంతో.. దాన్ని అవకాశంగా మలచుకున్నాడు రాణా ప్రతాప్. ఇదే అదునుగా పోరాటానికి దిగిన ప్రతాప్.. తాను కోల్పోయిన ఒక్కొక్క కోటనే స్వాధీనం చేసుకుంటూ వచ్చాడు. ఈ విషయం సమకాలీన శిలాశాసనాల్లోనూ దొరుకుతుంది. ఇలా రాణా ప్రతాప్ తిరిగి స్వాధీనం చేసుకున్నవాటిలో చిత్తోడ్, మండల్‌గఢ్‎లతో పాటు మేవాడ్‎లో ఉన్న అన్ని అవుట్‌ పోస్టులను స్వాధీనం చేసుకున్నాడు. తాను కోల్పోయిన భూభూగాలను తన జీవితకాలంలోనే తిరిగి సాధించి ఆత్మగౌరవం నిలుపుకున్న గొప్పనైన పాలకుడు మహారాణా ప్రతాప్. 

కోల్పోయిన మేవాడ్ చేజిక్కిన తరువాత రాణాప్రతాప్.. గోగండా, ఉదయ్‎పూర్ వంటి అనేక కోటలు ఆధీనంలోకి వచ్చాయి. హిందూ రాజపుత్రులను అక్బర్ తనవైపు తిప్పుకొని తనను ఒంటరిని చేసినా.. రాణాప్రతాప్.. ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. గెరిల్లా యుద్ధాల ద్వారా మొఘలులకు వ్యతిరేకంగా ప్రతిఘటన కొనసాగించాడు. మరణించేలోపు.. తన పూర్వీకుల రాజ్యాన్ని తిరిగి సాధించుకున్న గొప్ప దేశభక్తుడు రాణాప్రతాప్. 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా రాణా ప్రతాప్ చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకం. 


Comments

Popular posts from this blog

ఆ పాటను సరి చేసుకుంటాను: గోరటి వెంకన్న

జబర్దస్త్ ఆర్టిస్ట్ రాకింగ్ రాకేశ్ నటిస్తూ నిర్మిస్తున్న KCR (కేశవ చంద్ర రమావత్) అనే సినిమాలో తాను రాసిన పాటను సరి చేసుకుంటానని తెలంగాణ వాగ్గేయకారుడు, కవి, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న వివరణ ఇచ్చారు. తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాల సందర్భంగా ఆ సినిమాలోని ఓ పాటను రిలీజ్ చేశారు. హైదరాబాద్‌ లో  మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఆ పాటను రిలీజ్ చేశారు. హీరో, నిర్మాత రాకింగ్‌ రాకేశ్ తో పాటు మ్యూజిక్‌ డైరెక్టర్‌ చరణ్‌ అర్జున్‌, జోర్దార్‌ సుజాత తదితరులు కేసీఆర్‌ను కలిసి ఆయన చేతులో ఆ పాటను రిలీజ్ చేశారు. ఆ పాటలో తెలంగాణకు తలమానికంగా నిలిచిన, ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేసిన ఎందరో పోరాట యోధులు, వాగ్గేయకారులు, రచయితలు, కవులకు ఆ పాటలో పట్టం కట్టారు గోరటి వెంకన్న. పాల్కురికి సోమనాథుడు, సర్వాయి పాపన్న, మల్లు స్వరాజ్యం, దాశరథి వంటివారితో పాటు ఆఖరున కేసీఆర్ ను కూడా ఉటంకిస్తూ పాటను అద్భుతంగా రాశారు గోరటి. అంతవరకు బాగానే ఉన్నా.. అసలు తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆవిర్భావానికి కారణమైన తెలంగాణ మేధావి, సిద్ధాంతకర్త, జాతిపితగా అందరి చేతా ఆప్యాయంగా పిలిపించుకున్న ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఊసైనా లేకపోవడం విమర్శలకు తావిస్తోంది.

అన్నభీమోజు ఆచారి జయంతి వేడుకలు

తొలిదశ తెలంగాణ పోరాటయోధుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, అభ్యుదయవాది, పలు కార్మిక సంఘాల స్థాపకుడు అయిన అన్నభీమోజు ఆచారి అలియాస్ మదనాచారి 86వ జయంతి వేడుకలను మిర్యాలగూడ ప్రభుత్వాసుపత్రిలో ఘనంగా నిర్వహించుకున్నామని ఆచారి తనయుడు జితేంద్రాచారి చెప్పారు. ఆచారి 1969 తొలి తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని 9 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారని.. ఆ తర్వాత మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు (1975-1979) నిర్వహించారని జితేందర్ చెప్పారు. మిర్యాలగూడ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతుల, రైతు కూలీల కష్టాలు తీర్చేందుకు ఆచారి ఎన్నో వినూత్నమైన నిర్ణయాలు తీసుకొని.. వారి కష్టాలు తీర్చారన్నారు. ఆయన జీవితకాలంలో తనదైన ప్రజా సంక్షేమ కోణాన్ని ఆవిష్కరించి రాజకీయాలకు, ప్రజాసేవకు కొత్త నిర్వచనం చెప్పిన మహనీయుడని జితేందర్ తన తండ్రిగారి సేవలను కొనియాడారు. ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగిందని తెలిసినా.. అక్కడ మరు క్షణమే వాలిపోయి వారి పక్షాన నిలబడి పోరాడిన ధీశాలిగా.. ప్రజాసమస్యలకు ప్రభుత్వాల నుంచి పరిష్కారం చపిన మహనీయుడిగా అభివర్ణించారు. తన విలువైన సమయాన్ని వ్యక్తిగత అవసరాల కోసమో, కుటుంబం కోసమో గాక... అశేష పీడిత ప

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?