Skip to main content

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ


భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ. 

రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు బహుశా భరతఖండంలోని ఏ రాజు కూడా చేసి ఉండకపోవచ్చంటారు చరిత్ర పరిశోధకులు. 

సూర్యవంశ రాజులు ఈ దేశంలోని చాలా భూభాగాలను యుగయుగాలుగా పరిపాలిస్తున్నారు. ఆ సూర్యవంశానికి చెందిన సిసోడియా రాజపుత్రుల కుటుంబంలో ఉద్భవించిన త్యాగశీలుడైన గొప్ప పరిపాలకుడే మహారాణా ప్రతాప్. ఆయన పూర్తిపేరు కుంవర్ ప్రతాప్‎ సింహ్ జీ. 1540 మే 9న రాజస్థాన్‎లోని కుంభల్ గఢ్‎లో జన్మించాడు. తండ్రి మహారాణా ఉదయసింహ్. తల్లి రాణి జీవత్ కుంవర్ జీ. 1568 నుంచి 1597 వరకు మేవాడ్ పాలకుడిగా 29 ఏళ్లు పరిపాలించాడు. పాలకుడిగా ఉన్నన్నాళ్లూ మొఘల్ దాడులను తిప్పికొట్టడానికే జీవితాతం పోరాడిన వ్యక్తి రాణాప్రతాప్. ఇక సిసోడియా రాజవంశీకులు 13వ శతాబ్దం నుంచీ ఓ గొప్పనైన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వీరు ఎక్కడా తమను తాము రాజులుగా ప్రకటించుకోలేదు. రాజరికపు ఛాయలు వారి పాలనలో ఎక్కడా కనిపించలేదని చరిత్ర విశ్లేషకులు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. తమ దృష్టిలో వారంతా రాజ్యానికి కాపలాదారులే తప్ప.. రాజులు కారు. ఇంకో రకంగా చెప్పాలంటే వారు రాజ్యానికి సేవకులు మాత్రమే. ఇదే అవగాహనతో సిసోడియా రాజవంశీకులు చివరివరకూ వ్యవహరించారు. అందుకే వారి పేర్ల చివర గానీ, ముందు గానీ రాజు అనో, రాజాధిరాజు అనో, మహారాజా అనో... ఇలాంటి పదాలు కనిపించవంటారు చరిత్రకారులు. మరి రాజెవరు? పరిపాలన ఎవరి పేరుతో సాగుతుందన్నది మరో ఆసక్తికరమైన అంశం. సిసోడియా రాజవంశీకుల దృష్టిలో మేవాడ్ కు రాజు.. స్వామి ఏక్ లింగ్‎జీ. అంటే మేవాడ్ లో కొలువైన శివుడన్నమాట. పరమేశ్వరుడే రాజుగా.. ఆ పరమేశ్వరుడి పేరు మీద రాజ్యాన్ని కాపలా కాసే సైనికులుగా మాత్రమే తమను తాము భావించుకుంటారు. రాణా అంటే కస్టోడియన్. మహారాణా అంటే ప్రధాన కస్టోడియన్.. లేదా ప్రధాన కాపలాదారుడన్నమాట. ఇంతటి ఔదార్యమైన భావనతో పరిపాలించినవారిని నేటి కాలంలోనైతే అసలు ఊహించలేం కూడా. 

భారతదేశానికి చక్రవర్తిని అనిపించుకోవాలన్న ఉద్దేశంతో అక్బర్.. తన సామ్రాజ్యాన్ని విస్తరింపుజేసుకోవడంలో నిగ్నమయ్యాడు. అందులో భాగంగానే మేవాడ్ ను కూడా కలుపుకోవాలని కలలు గన్నాడు. మహారాణా ప్రతాప్ గురించి ఎందరో రాజులు గొప్పగా చెప్పిన ఫలితంగా ఆయనపై యుద్ధం చేయడం కన్నా ఆయన్ని రాజీ పరచుకొని సామంతుడిగా ఉండమని ఒప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అక్బర్. తనకు సామంతులుగా మారిన ఎందరో హిందూ రాజుల చేత రాయబారం నడిపించాడు. అప్పటికే అనేక మంది హిందూ రాజపుత్రులతో సంబంధాలు కలుపుకొని.. మతాతీత లౌకికవాదిగా తన దగ్గరి కవులచేత రాతలు రాయించుకున్న అక్బర్.. మిగతా రాజులు అందరికన్నా రాణాప్రతాప్ కు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు తనకు ఎదురులేని సామ్రాజ్యం నిర్మించుకోవాలనేది అక్బర్ కల. అందుకు మధ్యలో రాజస్థాన్ లోని మేవాడ్ రాజ్యం ఉంది. మేవాడ్ ను లోబరచుకోకుండా గుజరాత్ చేరుకోవడం అసాధ్యం కాబట్టి.. మేవాడ్ కు అతను అధిక ప్రాధాన్యతనిచ్చాడు. అయితే రాయబారాలేవీ ఫలించకపోవడంతో యుద్ధ తంత్రం ప్రయోగించాడు అక్బర్. 

అక్బర్ కు సామంతుడైన అంబర్ కు చెందిన రాజా మాన్‎సింగ్ నేతృత్వంలోని మొఘల్ దళాలకు.. మేవాడ్ మహారాణాకు హల్దీఘాటీ అనే కొండప్రాంతంలో జరిగిన చారిత్రక యుద్ధమే హల్దీఘాటీ యుద్ధం. 1576 జూన్ 18న ఈ యుద్ధం మొదలైందని చెబుతారు. ఈ యుద్ధంలో మొఘలు సేనలు.. మేవాడ్ దళాలకు గణనీయమైన ప్రాణనష్టం కలిగించాయి. చివరికి చిత్తోడ్, మండల్ గఢ్ వంటి పలు ప్రాంతాలు మొఘలుల వశమైపోయాయి. సైనికపరంగా రాణాప్రతాప్ దగ్గర దాదాపు 20 వేలు, అక్బర్ సైన్యంలో దాదాపు 80వేల మంది ఉన్నారంటారు చరిత్రకారులు. మరోవైపు మొఘల్స్ దగ్గర తుపాకులు, ఫిరంగులు ఉండగా.. రాణాప్రతాప్ దగ్గరున్న భిల్లు అనే గిరిజన జాతి సైనికులే ఉన్నారు. ఈటలు, బల్లాలు వంటి నాటు ఆయుధాలు మాత్రమే వీళ్ల దగ్గర ఉన్నాయి. ఫలితంగా యుద్ధంలో ఓటమితో రాణాప్రతాప్ ను యుద్ధభూమి నుంచి తప్పించారు అతని ఆంతరంగికులు. అక్బర్ కు పట్టుపడకుండా తప్పించుకుని అడవుల్లో తలదాచుకుంటూ.. కోల్పోయిన భూభాగాలను మళ్లీ పొందేందుకు నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు మహారాణా ప్రతాప్. అడవుల్లో తిండి కూడా దొరకని పరిస్థితుల్లో గడ్డి రొట్టెలు చేసుకొని తిన్నాడు. సార్వభౌమాధికారం కలిగిన ఒక భారతీయ రాజు ఇంతటి కష్టాలు అనుభవించిన దాఖలాలు బహుశా లేవనే చెప్పాలి. 

ఇక అడవుల్లో అజ్ఞాతంగా ఉంటున్న రాణాప్రతాప్.. తనచుట్టూ అక్బర్ కు సామంతులుగా ఉన్న రాజులను నమ్మలేదు. అందుకు బదులుగా.. భిల్లు జాతి గిరిజన సేనను సమకూర్చుకున్నాడు. వారికి సైనికంగా తర్ఫీదునిచ్చాడు. భామాషా అనే ఆనాటి పెద్ద వ్యాపారి.. అక్బర్ కు వ్యతిరేకంగా పోరాడుతూ స్వేదేశీ ఆత్మగౌరవం కోసం ప్రయత్నిస్తున్న రాణాప్రతాప్ కు భారీఎత్తున సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. అతను ఇచ్చిన డబ్బుతో అవసరమైన సరంజామాను రాణాప్రతాప్ సమకూర్చుకున్నాడు. అయితే మొఘలుల దృష్టి 1585 తర్వాత సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలపైకి మళ్లడంతో.. దాన్ని అవకాశంగా మలచుకున్నాడు రాణా ప్రతాప్. ఇదే అదునుగా పోరాటానికి దిగిన ప్రతాప్.. తాను కోల్పోయిన ఒక్కొక్క కోటనే స్వాధీనం చేసుకుంటూ వచ్చాడు. ఈ విషయం సమకాలీన శిలాశాసనాల్లోనూ దొరుకుతుంది. ఇలా రాణా ప్రతాప్ తిరిగి స్వాధీనం చేసుకున్నవాటిలో చిత్తోడ్, మండల్‌గఢ్‎లతో పాటు మేవాడ్‎లో ఉన్న అన్ని అవుట్‌ పోస్టులను స్వాధీనం చేసుకున్నాడు. తాను కోల్పోయిన భూభూగాలను తన జీవితకాలంలోనే తిరిగి సాధించి ఆత్మగౌరవం నిలుపుకున్న గొప్పనైన పాలకుడు మహారాణా ప్రతాప్. 

కోల్పోయిన మేవాడ్ చేజిక్కిన తరువాత రాణాప్రతాప్.. గోగండా, ఉదయ్‎పూర్ వంటి అనేక కోటలు ఆధీనంలోకి వచ్చాయి. హిందూ రాజపుత్రులను అక్బర్ తనవైపు తిప్పుకొని తనను ఒంటరిని చేసినా.. రాణాప్రతాప్.. ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. గెరిల్లా యుద్ధాల ద్వారా మొఘలులకు వ్యతిరేకంగా ప్రతిఘటన కొనసాగించాడు. మరణించేలోపు.. తన పూర్వీకుల రాజ్యాన్ని తిరిగి సాధించుకున్న గొప్ప దేశభక్తుడు రాణాప్రతాప్. 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా రాణా ప్రతాప్ చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకం. 


Comments

Popular posts from this blog

మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్

హైదరాబాద్ శివారులోని మంచిరేవులలో కె-క్యూబ్ లెర్నింగ్ ఇనిస్టిట్యూట్ సేవలు మొదలయ్యాయి. ప్రైమరీ తరగతుల నుంచి ఇంజినీరింగ్ విద్యార్థుల వరకు అన్ని సబ్జెక్టులలో ట్యూషన్స్ అందిస్తున్నామని, ముఖ్యంగా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో స్పెషలైజ్డ్ క్లాసెస్ అందిస్తున్నామని ఇనిస్టిట్యూట్ ఎండీ కె.కిరణ్ కుమార్, డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కె-క్యూబ్ బ్యానర్ పై గత రెండేళ్లుగా నార్సింగి, మంచిరేవుల విద్యార్థులకు తాము శిక్షణనిస్తున్నామన్నారు. కేవలం అకడమిక్ బోధనలే కాకుండా ఎక్స్‎ట్రా కరికులమ్ యాక్టివిటీస్ అయిన చెస్, ఇతర గేమ్స్ లో కూడా తాము శిక్షణ అందిస్తూ వాటిలో పోటీలు కూడా నిర్వహిస్తూ విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తున్నామన్నారు.  కె-క్యూబ్ లెర్నింగ్స్ ఆధ్వర్యంలో ప్రత్యేకించి సమ్మర్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామన్నారు. అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యను అందించడానికి నిపుణులైన స్టాఫ్ తో శిక్షణనిస్తున్నట్లు కిరణ్, శ్రీనివాస్ తెలిపారు. మరిన్ని వివరాల కోసం 6281903108 నెంబర్లో సంప్రదించాలని డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు.  Read this also: రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?...

ఒక కులాన్ని మాయం చేసిన తెలంగాణ సర్కారు

(విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యులు నిర్మించిన రామప్ప ఆలయం) ప్రభుత్వాలు తలుచుకుంటే దేన్నయినా మాయం చేస్తాయా? అనేక ప్రజా సమూహాలు అనాదిగా తమ ఉనికిని, ఆత్మగౌరవాన్ని చాటుకుంటూ వస్తున్న కులాన్ని కూడా ప్రభుత్వాలు మాయం చేయగలవా? అన్న సందేహాలు తాజాగా వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు తెలంగాణలో ఇదే జరుగుతుందని.. తమ ఉనికిని పూర్తిగా భూస్థాపితం చేస్తున్నట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు వ్యవహరిస్తోందని రాష్ట్రంలోని విశ్వబ్రాహ్మణ కుల సంఘాలు, యువతరం ఆవేదన చెందుతున్నారు.  నవంబర్ 6న మొదలైన బీసీ కులగణలో అనాదిగా వస్తున్న విశ్వబ్రాహ్మణ కులాన్ని విస్మరించారన్న విమర్శలు తీవ్రంగా వ్యక్తమవుతున్నాయి. విశ్వబ్రాహ్మణులు కమ్మరి, వడ్రంగి, కంచరి, శిల్పి, అవుసుల వంటి పేర్లే గాక.. వడ్ల, కంసాలి వంటి ఇతర పేర్ల వృత్తిపనులు చేసుకుంటూ సమాజంలో గౌరవ ప్రదంగా జీవిస్తున్నారు. వీరిలో పౌరోహిత్యం చేసేవారు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరి వృత్తుల ఆధారంగానే గ్రామ వికాసం, దేవీ దేవతలు, గుళ్లూ, గోపురాలు ఏర్పడ్డాయి. కేవలం విశ్వబ్రాహ్మణ శిల్పాచార్యుల వల్లే భారతదేశ టూరిజం ఉనికి చాటుకుంటోంది అంటే అతిశయోక్తి కాదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకైనా, ...

బెంగాల్ నిర్భయకు న్యాయం కోసం రోడ్డెక్కిన లాయర్లు

కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ కు జరిగిన దారుణమైన హత్యాచార ఘటనపై ఏపీ న్యాయవాదుల సంఘం నిరసన వ్యక్తం చేసింది. ఏపీ హైకోర్టు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద పలువురు సీనియర్ న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ కేసులో సీరియస్ నెస్ లేకుండా చేసేందుకు ప్రయత్నించిన మమతా బెనర్జీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాలని, అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్ గా స్పందించి చర్యలకు ఉపక్రమించాలని డిమాండ్ చేశారు. దేశంలో నిర్భయ తరువాత ఎంత కఠినమైన, పటిష్టమైన చట్టాలు వచ్చినా.. మహిళలపై అత్యాచారాలు, హత్యలు మాత్రం ఆగిపోవడం లేదని.. నేరస్తులు తప్పించుకోకుండా పలు వ్యవస్థలు ఇప్పటికీ కొమ్ము కాస్తున్నాయని పలువురు సీనియర్ న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. కోల్ కతా నిర్భయ కుటుంబానికి సంతాపం తెలుపుతున్నామని లాయర్ల సంఘం ప్రకటించింది.  ఈ కార్యక్రమంలో అబలా నారీ సంస్థ చైర్మన్ రావిపాటి లావణ్య, ఏపీ హైకోర్టు అసోసియేషన్ నుంచి చిదంబరం, ప్రభుత్వ ప్లీడర్ టీఎస్ రాయల్, పెద్దసంఖ్యలో పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. కార్యక్రమం అబలా నారీ చైర్ పర్సన్ రావిపాటి లావణ్య ఆధ్వర్యంలో నిర్వహించారు.