Skip to main content

భారతీయుడి శౌర్య 'ప్రతాపం'.. స్పెషల్ స్టోరీ


భారతీయ దేశభక్తుల్లో మహారాణా ప్రతాప్‎కు బహుశా ఎవరూ సాటిరారు. జననీ జన్మభూమిశ్చ.. అనే మాటను కలియుగంలో అక్షరాలా పాటించిన మహా సేనాని ఆయన. లంకలోని అందాలకు మోహితుడైన లక్ష్మణుడు.. రావణ సంహారం తరువాత అక్కడే ఉండిపోదామని అన్నతో అంటే.. అప్పుడు రాముడి నోటి నుంచి వచ్చిన వాక్యమే "జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ". కన్నతల్లి, జన్మనిచ్చిన భూమి.. ఆ రెండూ కూడా స్వర్గం కన్నా మహిమాన్వితమైనవి అంటాడు రాముడు. అలాంటి రాముడి వంశానికి చెందిన రాణాప్రతాప్.. చివరి శ్వాస వరకూ మాతృభూమి రక్షణ కోసమే పోరాడాడు. స్వాతంత్ర్య అమృతోత్సవాల సందర్భంగా.. ఒళ్లు గగుర్పొడిచే ఆ వీరుడి గాథ. 

రాణాప్రతాప్.. కాదుకాదు.. మహారాణా ప్రతాప్. ఆయన పేరు చెప్పగానే దేశాన్ని ప్రేమించేవారికి ఎక్కడా లేని చైతన్యం ఆవహిస్తుంది. జాతీయతా స్ఫూర్తి ప్రదర్శనలో ఎన్ని కష్టాలు ఎదురైనా సహించే ఓర్పు సమకూరుతుంది. మనదేశ పాఠ్యపుస్తకాల్లో ఆయనకు పెద్దగా చోటు దక్కకపోవచ్చు. ఎడారి దేశాల నుంచి వచ్చిన దారిదోపిడీగాళ్లకే వారి పేర్ల ముందు 'ద గ్రేట్' అన్న తోకలు తగిలించుకొని ఉండవచ్చు. కానీ చరిత్ర పుటల్లో రాణాప్రతాప్‎కు దక్కిన స్థానం అజరామరం. దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు బహుశా భరతఖండంలోని ఏ రాజు కూడా చేసి ఉండకపోవచ్చంటారు చరిత్ర పరిశోధకులు. 

సూర్యవంశ రాజులు ఈ దేశంలోని చాలా భూభాగాలను యుగయుగాలుగా పరిపాలిస్తున్నారు. ఆ సూర్యవంశానికి చెందిన సిసోడియా రాజపుత్రుల కుటుంబంలో ఉద్భవించిన త్యాగశీలుడైన గొప్ప పరిపాలకుడే మహారాణా ప్రతాప్. ఆయన పూర్తిపేరు కుంవర్ ప్రతాప్‎ సింహ్ జీ. 1540 మే 9న రాజస్థాన్‎లోని కుంభల్ గఢ్‎లో జన్మించాడు. తండ్రి మహారాణా ఉదయసింహ్. తల్లి రాణి జీవత్ కుంవర్ జీ. 1568 నుంచి 1597 వరకు మేవాడ్ పాలకుడిగా 29 ఏళ్లు పరిపాలించాడు. పాలకుడిగా ఉన్నన్నాళ్లూ మొఘల్ దాడులను తిప్పికొట్టడానికే జీవితాతం పోరాడిన వ్యక్తి రాణాప్రతాప్. ఇక సిసోడియా రాజవంశీకులు 13వ శతాబ్దం నుంచీ ఓ గొప్పనైన సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. వీరు ఎక్కడా తమను తాము రాజులుగా ప్రకటించుకోలేదు. రాజరికపు ఛాయలు వారి పాలనలో ఎక్కడా కనిపించలేదని చరిత్ర విశ్లేషకులు అనేక సందర్భాల్లో పేర్కొన్నారు. తమ దృష్టిలో వారంతా రాజ్యానికి కాపలాదారులే తప్ప.. రాజులు కారు. ఇంకో రకంగా చెప్పాలంటే వారు రాజ్యానికి సేవకులు మాత్రమే. ఇదే అవగాహనతో సిసోడియా రాజవంశీకులు చివరివరకూ వ్యవహరించారు. అందుకే వారి పేర్ల చివర గానీ, ముందు గానీ రాజు అనో, రాజాధిరాజు అనో, మహారాజా అనో... ఇలాంటి పదాలు కనిపించవంటారు చరిత్రకారులు. మరి రాజెవరు? పరిపాలన ఎవరి పేరుతో సాగుతుందన్నది మరో ఆసక్తికరమైన అంశం. సిసోడియా రాజవంశీకుల దృష్టిలో మేవాడ్ కు రాజు.. స్వామి ఏక్ లింగ్‎జీ. అంటే మేవాడ్ లో కొలువైన శివుడన్నమాట. పరమేశ్వరుడే రాజుగా.. ఆ పరమేశ్వరుడి పేరు మీద రాజ్యాన్ని కాపలా కాసే సైనికులుగా మాత్రమే తమను తాము భావించుకుంటారు. రాణా అంటే కస్టోడియన్. మహారాణా అంటే ప్రధాన కస్టోడియన్.. లేదా ప్రధాన కాపలాదారుడన్నమాట. ఇంతటి ఔదార్యమైన భావనతో పరిపాలించినవారిని నేటి కాలంలోనైతే అసలు ఊహించలేం కూడా. 

భారతదేశానికి చక్రవర్తిని అనిపించుకోవాలన్న ఉద్దేశంతో అక్బర్.. తన సామ్రాజ్యాన్ని విస్తరింపుజేసుకోవడంలో నిగ్నమయ్యాడు. అందులో భాగంగానే మేవాడ్ ను కూడా కలుపుకోవాలని కలలు గన్నాడు. మహారాణా ప్రతాప్ గురించి ఎందరో రాజులు గొప్పగా చెప్పిన ఫలితంగా ఆయనపై యుద్ధం చేయడం కన్నా ఆయన్ని రాజీ పరచుకొని సామంతుడిగా ఉండమని ఒప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు అక్బర్. తనకు సామంతులుగా మారిన ఎందరో హిందూ రాజుల చేత రాయబారం నడిపించాడు. అప్పటికే అనేక మంది హిందూ రాజపుత్రులతో సంబంధాలు కలుపుకొని.. మతాతీత లౌకికవాదిగా తన దగ్గరి కవులచేత రాతలు రాయించుకున్న అక్బర్.. మిగతా రాజులు అందరికన్నా రాణాప్రతాప్ కు అధిక ప్రాధాన్యతనిచ్చాడు. ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు తనకు ఎదురులేని సామ్రాజ్యం నిర్మించుకోవాలనేది అక్బర్ కల. అందుకు మధ్యలో రాజస్థాన్ లోని మేవాడ్ రాజ్యం ఉంది. మేవాడ్ ను లోబరచుకోకుండా గుజరాత్ చేరుకోవడం అసాధ్యం కాబట్టి.. మేవాడ్ కు అతను అధిక ప్రాధాన్యతనిచ్చాడు. అయితే రాయబారాలేవీ ఫలించకపోవడంతో యుద్ధ తంత్రం ప్రయోగించాడు అక్బర్. 

అక్బర్ కు సామంతుడైన అంబర్ కు చెందిన రాజా మాన్‎సింగ్ నేతృత్వంలోని మొఘల్ దళాలకు.. మేవాడ్ మహారాణాకు హల్దీఘాటీ అనే కొండప్రాంతంలో జరిగిన చారిత్రక యుద్ధమే హల్దీఘాటీ యుద్ధం. 1576 జూన్ 18న ఈ యుద్ధం మొదలైందని చెబుతారు. ఈ యుద్ధంలో మొఘలు సేనలు.. మేవాడ్ దళాలకు గణనీయమైన ప్రాణనష్టం కలిగించాయి. చివరికి చిత్తోడ్, మండల్ గఢ్ వంటి పలు ప్రాంతాలు మొఘలుల వశమైపోయాయి. సైనికపరంగా రాణాప్రతాప్ దగ్గర దాదాపు 20 వేలు, అక్బర్ సైన్యంలో దాదాపు 80వేల మంది ఉన్నారంటారు చరిత్రకారులు. మరోవైపు మొఘల్స్ దగ్గర తుపాకులు, ఫిరంగులు ఉండగా.. రాణాప్రతాప్ దగ్గరున్న భిల్లు అనే గిరిజన జాతి సైనికులే ఉన్నారు. ఈటలు, బల్లాలు వంటి నాటు ఆయుధాలు మాత్రమే వీళ్ల దగ్గర ఉన్నాయి. ఫలితంగా యుద్ధంలో ఓటమితో రాణాప్రతాప్ ను యుద్ధభూమి నుంచి తప్పించారు అతని ఆంతరంగికులు. అక్బర్ కు పట్టుపడకుండా తప్పించుకుని అడవుల్లో తలదాచుకుంటూ.. కోల్పోయిన భూభాగాలను మళ్లీ పొందేందుకు నిద్రాహారాలు మాని కష్టపడ్డాడు మహారాణా ప్రతాప్. అడవుల్లో తిండి కూడా దొరకని పరిస్థితుల్లో గడ్డి రొట్టెలు చేసుకొని తిన్నాడు. సార్వభౌమాధికారం కలిగిన ఒక భారతీయ రాజు ఇంతటి కష్టాలు అనుభవించిన దాఖలాలు బహుశా లేవనే చెప్పాలి. 

ఇక అడవుల్లో అజ్ఞాతంగా ఉంటున్న రాణాప్రతాప్.. తనచుట్టూ అక్బర్ కు సామంతులుగా ఉన్న రాజులను నమ్మలేదు. అందుకు బదులుగా.. భిల్లు జాతి గిరిజన సేనను సమకూర్చుకున్నాడు. వారికి సైనికంగా తర్ఫీదునిచ్చాడు. భామాషా అనే ఆనాటి పెద్ద వ్యాపారి.. అక్బర్ కు వ్యతిరేకంగా పోరాడుతూ స్వేదేశీ ఆత్మగౌరవం కోసం ప్రయత్నిస్తున్న రాణాప్రతాప్ కు భారీఎత్తున సాయం చేసేందుకు ముందుకొచ్చాడు. అతను ఇచ్చిన డబ్బుతో అవసరమైన సరంజామాను రాణాప్రతాప్ సమకూర్చుకున్నాడు. అయితే మొఘలుల దృష్టి 1585 తర్వాత సామ్రాజ్యంలోని ఇతర ప్రాంతాలపైకి మళ్లడంతో.. దాన్ని అవకాశంగా మలచుకున్నాడు రాణా ప్రతాప్. ఇదే అదునుగా పోరాటానికి దిగిన ప్రతాప్.. తాను కోల్పోయిన ఒక్కొక్క కోటనే స్వాధీనం చేసుకుంటూ వచ్చాడు. ఈ విషయం సమకాలీన శిలాశాసనాల్లోనూ దొరుకుతుంది. ఇలా రాణా ప్రతాప్ తిరిగి స్వాధీనం చేసుకున్నవాటిలో చిత్తోడ్, మండల్‌గఢ్‎లతో పాటు మేవాడ్‎లో ఉన్న అన్ని అవుట్‌ పోస్టులను స్వాధీనం చేసుకున్నాడు. తాను కోల్పోయిన భూభూగాలను తన జీవితకాలంలోనే తిరిగి సాధించి ఆత్మగౌరవం నిలుపుకున్న గొప్పనైన పాలకుడు మహారాణా ప్రతాప్. 

కోల్పోయిన మేవాడ్ చేజిక్కిన తరువాత రాణాప్రతాప్.. గోగండా, ఉదయ్‎పూర్ వంటి అనేక కోటలు ఆధీనంలోకి వచ్చాయి. హిందూ రాజపుత్రులను అక్బర్ తనవైపు తిప్పుకొని తనను ఒంటరిని చేసినా.. రాణాప్రతాప్.. ఎక్కడా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. గెరిల్లా యుద్ధాల ద్వారా మొఘలులకు వ్యతిరేకంగా ప్రతిఘటన కొనసాగించాడు. మరణించేలోపు.. తన పూర్వీకుల రాజ్యాన్ని తిరిగి సాధించుకున్న గొప్ప దేశభక్తుడు రాణాప్రతాప్. 75 ఏళ్ల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా రాణా ప్రతాప్ చరిత్ర ఎంతో స్ఫూర్తిదాయకం. 


Comments

Popular posts from this blog

రైతు సమస్యలు పరిష్కరించకపోతే పెను ప్రమాదమే

రైతు సమస్యలు పరిష్కరించకపోతే సమాజం అతిపెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని అది జరగకుండా ఉండేందుకు మీడియా చాలా క్రియాశీలమైన పాత్ర పోషించాల్సి ఉంటుందని, రైతుల కోసం పనిచేసే సంస్థలు సంఘాలు ముఖ్యంగా బి కే ఎస్ - భారతీయ కిసాన్ సంఘ్ లాంటి స్వచ్ఛంద సంస్థలు రైతుల కోసం ఎంతో శ్రమించాల్సి ఉందని సీనియర్ జర్నలిస్ట్ తాటికొండ రమేష్ బాబు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రచార ఆయామ్ సమావేశము BKS రాష్ట్ర కార్యాలయం రాజపుత్ రెసిడెన్సి లో *ప్రాంత ప్రచార ప్రముఖ్  ల్యాగల శ్రీనివాస్ గారి అధ్యక్షతన నిర్వహించడం జరిగినది. సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ ఆర్ట్స్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ శ్రీ సుదర్శన్ రావు, సీనియర్ జర్నలిస్ట్ రమేష్ బాబు రాకల్లోకం యూట్యూబ్ ఛానల్ ఫౌండర్ రాక సుధాకర్ హాజరయ్యారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం రిటైర్డ్ ప్రొఫెసర్ సుదర్శన్ రావు మాట్లాడుతూ సమాచార విప్లవం వచ్చిన తర్వాత ప్రజలకు నేరుగా సమాచారం అందడం వలన ప్రజలు విజ్ఞానవంతులైనారు, కానీ సమాచారం అనేది పుస్తకాల రూపంలో పత్రికలు రూపంలో ఇంటర్నెట్లో ప్రత్యక్షంగా పరోక్షంగా నేడు అవసరమైన దానికంటే ఎక్కువ అందుబాటులో ఉన్నది. కానీ సరియైన సమాచారం  వినియోగించుకొని నూతనంగా

కొత్త పన్నులు రాబోతున్నాయి

వివిధ వస్తువులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వసూలు చేసే పన్నుల్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతున్నాయా? ప్రతి నిత్యం వాడే వస్తువులపై పన్నులు పెరగక తప్పదా? ఇప్పటికే పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడుతుంటే మళ్లీ కొత్త పన్నులతో బాదడం దేనికి.. అన్న అనుమానం కలుగుతుంది కదా?  మొన్ననే కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూశాం. ఇక్కడ కేసీఆర్, అక్కడ జగన్ సర్కార్ల బడ్జెట్లు కూడా చూశాం. ఎవరూ పన్నుల జోలికి పోలేదు. దీంతో ప్రజలందరూ ఎంతోకొంత రిలీఫ్ ఫీలయ్యారు. ప్రభుత్వాలు పన్నుల జోలికి పోలేదు.. బతుకు జీవుడా అనుకున్నారు. అయితే ఆ ఆనందం ఎంతో కాలం నిలిచే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే ఆదాయం తగ్గిపోయి అల్లాడుతూ అప్పులతో నెట్టుకొస్తున్న రాష్ట్రాలు కొత్త ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తున్నాయి. వచ్చే నెలలో జరగబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కొత్త పన్నుల ప్రతిపాదనలు తెరమీదికు రాబోతున్నాయి.  మోడీ సర్కారు అధికారంలోకి వచ్చాక 2017 నుంచి గూడ్స్ అండ్ సర్విసెస్ ట్యాక్స్.. జీఎస్టీ ని అమల్లోకి తీసుకొచ్చింది. దాని ప్రకారం దేశమంతా ఒక వస్తువుకు ఒకే రకమైన పన్ను విధానం అమల్లోకి వచ్చింది. అయితే ఇందులో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం వాటిల్లుతో

బీజేపీ విశ్వబ్రాహ్మణ అధికార ప్రతినిధిగా చెన్నయ్య.. మీడియా ఇంచార్జ్ గా రవికిరణ్

క్షేత్రస్థాయిలో బీజేపీని పటిష్టం చేసే క్రమంలో హైదరాబాద్ లో పలు కీలకమైన బాధ్యతలను క్రియాశీలమైన కార్యకర్తలకు అప్పగించారు. బ్రహ్మశ్రీ తల్లోజు చెన్నయ్యాచారిని విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం నుంచి అధికార ప్రతినిధిగా నియమిస్తూ ఆ పార్టీ విశ్వబ్రాహ్మణ మీడియా సెల్ కన్వీనర్ పూసాల బ్రహ్మచారి ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే బ్రహ్మశ్రీ వలబోజు రవికిరణ్ ఆచారికి తెలంగాణ మీడియా కో కన్వీనర్ గా బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రం అందించారు. బీజేపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పని చేయాలని, పార్టీని క్షేత్రస్థాయిలో పటిష్టం చేయాలని కొత్తగా బాధ్యతలు అందుకున్నవారిని బ్రహ్మచారి కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఓబీసీ ప్రెసిడెంట్ ఆలె భాస్కర్, భాగ్యనగర జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు పెండం లక్ష్మణ్, కౌలే జగన్నాథం, రుద్రోజు శివలింగాచారి తదితరులు పాల్గొన్నారు.