Skip to main content

ఇమ్రాన్ ఇండియాను ఎందుకు పొగిడాడు?

పాపం.. పాక్ లో ఇమ్రాన్ పరిస్థితి పైనే ఇప్పుడంతా చర్చించుకుంటున్నారు. తాను గెలిచి దేశాన్ని ఓడించాడా? లేక తాను ఓడి దేశాన్ని గెలిపిస్తున్నాడా? ఈ చిక్కు ప్రశ్నలకు మూలాలెక్కడున్నాయో మనకే కాదు.. ఇమ్రాన్ కి కూడా అర్థం కావడం లేదు. అలాగే ఇండియా మీద ప్రశంసలు ఆయనకు కలిగిన జ్ఞానోదయాన్ని సూచిస్తున్నాయా.. లేక పాము చచ్చినా పగ మాత్రం చావదన్న జాతి నైజాన్ని సూచిస్తున్నాయా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

భారత రాజకీయాలపై పాకిస్తాన్ కు ఆసక్తి ఉన్నట్టే.. పాక్ రాజకీయాలపై కూడా భారత ప్రజల్లో ఆసక్తి ఉంటుంది. పాక్ ను పక్కలో బల్లెంలా సగటు భారతీయుడు ఎలా భావిస్తాడో.. భారత్ ను డిస్టర్బ్ చేయాలన్న దుర్బుద్ధి అక్కడి ఎక్కువ మంది పౌరుల్లో ఉంటుంది. దీనిక్కారణమేంటో అందరికీ తెలిసిందే. ద్విజాతి సిద్ధాంతం మీద దేశాన్ని బలవంతంగా విడగొట్టారన్న ఫీలింగ్ భారతీయుల్లో బలంగా పాతుకుపోయి ఉండడమే. అటు వాళ్లూ అంతే. ఇండియాను వాళ్లు ఏనాడూ పొరుగుదేశంగా చూడలేదు. ఇండియాతో శాశ్వత జాతివైరమే వారి దృష్టిలో శాశ్వతమైన ఎజెండా. కాబట్టి ఈ రెండు పొరుగు దేశాల వ్యవహారాల్లో శత్రుబద్ధమైన వైఖరి అలా దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇమ్రాన్ కూడా అందుకు మినహాయింపేమీ కాదు. అయితే ఇమ్రాన్ ప్రధాని పదవి త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో ఆయన భారత్ గురించి కొన్ని కఠోరమైన వాస్తవాలు మాట్లాడాడు. ఆ వాస్తవాలు ఆయనకు, ఆయనలాగే కోట్లాది పాక్ పౌరులకు జీర్ణం కానివే అయినా.. మాట్లాడాడు. 

ఇండియాను ఏ సూపర్ పవర్ కంట్రీ కూడా డిక్టేట్ చేయలేదని... బుల్లెట్ పాయింట్ లాగా ఇండియా గురించి ఒక్క మాటలో చెప్పేశాడు. ఒకరి శక్తి సామర్థ్యాలేంటో వాళ్ల కన్నా వాళ్ల శత్రువులకే బాగా తెలుస్తాయన్నది ఇమ్రాన్ మాటలు రుజువు చేశాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇండియాను శాసించజాలదని ఇమ్రాన్ రూఢిగా అర్థం చేసుకున్నాడు. మొన్నటికి మొన్న రష్యా విదేశాంగ మంత్రి  సెర్గీ లావ్రోవ్ భారత్ లో పర్యటించినప్పుడు ఇండియా ఏది కోరితే అది ఇస్తామని బాహాటంగా డిక్లేర్ చేశాడు. ఇండియాతో స్నేహానికి ఎంత దూరమైనా వెళ్తామన్నాడు. ముందుగా జైశంకర్ ను కలిసి.. అంతర్జాతీయ అంశాలపై భారత వైఖరి ఎలా ఉంటుందో తెలుసుకున్నాక.. ప్రధాని మోడీని కలిశాడు లావ్రోవ్. ఆ తరువాత ప్రెస్ కు పూర్తి క్లారిటీ ఇచ్చాడు. భారత్ పట్ల సంపూర్ణమైన విశ్వాసాన్ని ప్రకటించాడు. భారత్-రష్యా స్నేహబంధం బరాబర్ గా ఉండి తీరుతుందని అగ్రరాజ్యాన్ని ఉడికించాడు. అటు అమెరికా కూడా రష్యాతో భారత వైఖరిని మింగలేక, కక్కలేక.. ఏమనాలో తెలియక పిల్లిమొగ్గలేసింది. అంతకుమించి ముందుకెళ్తే ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని మేకపోతు గాంభీర్యం ప్రకటించింది. ఆంక్షల గురించి మాట్లాడకపోతే బాగుండదు కాబట్టి... రిక్వెస్టు లాంటి హెచ్చరికను జారీ చేసింది. అయితే అమెరికా హెచ్చరికను భారత్ ఏమాత్రం ఖాతరు చేయలేదు. మరి.. భారత్ కో ఇత్ నా హిమ్మత్ కహా సే ఆయీ? ఇండియాలో ప్రతిపక్ష పార్టీలకు అర్థం కాకపోవచ్చు గానీ.. ఇమ్రాన్ కు మాత్రం సెంట్ పర్సెంట్ తలకెక్కింది.

అది ఒక పార్శ్వమైతే.. ప్రపంచానికి అర్థమైన రెండో పార్శ్వం మరోటి ఉంది. రష్యా భారత్ మీద ఎంత నమ్మకాన్ని కనబరచిందో అంతే నమ్మకాన్ని, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ నమ్మకాన్నే ఉక్రెయిన్ వ్యక్తం చేసింది. భారత్ తల్చుకుంటే యుద్ధం ఆగుతుందని జెలెన్ స్కీ ఓపెన్ గా విజ్ఞప్తి చేయడం.. మనమేంటో ప్రపంచానికి చాటినట్లయింది. ప్రపంచంలో ఉన్న ఏ అగ్రరాజ్యం మీద కూడా పెట్టుకోని భరోసా.. ఉక్రెయిన్ మన మీదనే పెట్టుకుంది. అందుక్కారణం ఒక్కటే. అగ్రరాజ్యాలైనా, అథో రాజ్యాలైనా.. ఇతరుల అవసరాలపై అవకాశాలు వెదుక్కుంటాయి. సింపుల్ గా చెప్పాలంటే వ్యాపారాలు చేస్తాయి. తమ వ్యాపారానికి పనికొస్తే చేయూతనిస్తాయి... లేదంటే తొక్కేస్తాయి. అమెరికా చేస్తున్నది ఇదే కదా. కానీ భారత్ అలా ఎప్పుడూ చేయలేదు. ఎవరితోనూ చేయలేదు. భారత్ ఎలాంటిదో ప్రపంచం ముందు తెరిచిన పుస్తకమే. అమెరికా అందుకు భిన్నం. దాని లోగుట్లు ఒక్కొక్కటిగా ప్రపంచానికి తెలిసిపోతున్నాయి. మొన్న ఆఫ్ఘన్లో అమెరికా ఏం చేసిందో ప్రపంచమంతా చూసింది. తన గాలి తానే తీసేసుకుంది అమెరికా. అలాంటి అమెరికా భారత్ తో జరిగే వ్యాపారాన్ని కాలదన్నుకుంటుందా? వరదన పోయే వ్యాపారి ఊరికే పోడన్న సామెతలాగా ఎవరూ నమ్మలేకుండా తయారైంది అమెరికా పరిస్థితి. అయినా అమెరికాను ఎదిరించాలంటే గట్స్ కావాలి. ఆ గట్స్ ను ఇప్పుడు ఇండియా పుష్కలంగా సముపార్జించుకుంది. ఈ తత్వం ఇమ్రాన్ కు సెంట్ పర్సెంట్ బోధపడింది. అందుకే పాకిస్తాన్ లోని రాజకీయ పార్టీలు ఇండియాను చూసి నేర్చుకోండ్రా.. అంటూ ప్రధాని హోదాలో చివరిమాటగా చెప్పాడు. ఎందుకంటే ప్రధానిగా మాట్లాడే అవకాశం మళ్లీ రాదన్న విషయం ఆయనకు తెలుసు. పాక్ ప్రజల కోసం తానెంత కష్టపడ్డాడో.. ఆర్థికంగా నిలబెట్టడానికి ఎంత ట్రై చేశాడో.. అవన్నీ బూడిదలో పోసిన పన్నీరులాగా మార్చేశారని, అందుకు పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని చివరి వార్నింగ్ ఇచ్చాడు. ఎవరో వచ్చి మీ దేశాన్ని బాగు చేయరు. మీకై మీరే ముందుకు రావాలి. వీధుల్లోకి రావాలి. నాతో కలిసి పోరాడాలి. నీను మీతో పాటే ఉంటాను. ఎక్కడికీ పారిపోను. దేశ పరిస్థితి ఇంకా దిగజారిపోక ముందే ఎంతో భవితవ్యం ఉన్న దేశ యువతరం అడ్డదార్లు తొక్కకుండా ఉండాలంటే.. ఎన్నికైన ప్రజాప్రతినిధులు అంగట్లో పశువుల్లాగా అమ్ముడు పోకుండా ఉండాలంటే.. రండి.. శాంతియుతంగా పోరాడదాం.. అంటూ ఆఖరి అస్త్రం వదిలాడు. 

ప్రధాని హోదాలో ఇమ్రాన్ పోతూపోతూ చెప్పిన ఆఖరు మాటలు.. పాక్ చరిత్రలో నమోదు కావాలన్నదే ఆయన ఉద్దేశం అయి ఉండవచ్చు. దేశంలో రాజ్యమేలుతున్న అరాచకం, దేశాన్ని తేరుకోలేనంతగా ముంచేస్తున్న అవినీతి, ఆశ్రితపక్షపాతం, సైన్యం జోక్యం, అమెరికా వేసే ఎత్తులకు పావులుగా మారుతున్న ప్రతిపక్షాలు, స్వపక్షంలోని తిరుగుబాటుదార్లు, చివరిగా ప్రజలు.. ఇలా దేశంలో ఏం జరుగుతుందో.. అందరూ ఆలోచించాలని చెప్పాడు. మరి.. ఇమ్రాన్ కు అంత తెలివే ఉంటే... ఇంత మంచి ఇండియాతో వైరాన్ని కాక శత్రుత్వాన్ని ఎందుకు పెంచుకున్నాడు? పాక్ సైన్యం చెప్పినట్టల్లా ఎందుకు ఆడాడు? దశాబ్దాల శత్రుత్వాన్ని తుడిచేసుకొని కొత్త అధ్యాయం లిఖిద్దామని ఎందుకు భావించలేదు? కాశ్మీర్ ఇష్యూను ఎందుకు కెలికాడు? మనకు వ్యతిరేకమైన చైనాతో ఎందుకు చెట్టపట్టాలేసుకున్నాడు? ఈ తెలివి పదవి ఊడిపోతున్నప్పుడే రావాలా? శ్మశాన వైరాగ్యంలాగా ఈ మాటలు ఇప్పుడు చెప్పడం కన్నా.. అధికారంలో ఉన్నప్పుడే అమలు చేయవద్దని ఎవరైనా ఆపారా? ఇమ్రాన్ కైనా, రేపొచ్చే అతని బాబులకైనా పుర్రెలో బుద్ధి ఉండాలి కదా. ఉండాలని ఆశిద్దాం. 

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత