Skip to main content

ఈటల కోటలో గెల్లు గెలుపు ఖాయమేనా?

అంచనాలకు అందనిదే రాజకీయం. ఊహించని పరిణామాలు జరిగే వేదికే ఎన్నికల రణక్షేత్రం. అందులోనూ తెలంగాణ ఉద్యమకారుడిగా పరిచయమై, టీఆర్ఎస్ లో ఎంతో ఎత్తుకు ఎదిగిన ఈటల రాజేందర్ ను ఢీకొట్టడం అంటే ఆషామాషీ కాదు. అలాంటి ఈటలను హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎదుర్కొనేందుకు అత్యంత సామాన్యుడైన గెల్లు శ్రీనివాస్ ను కేసీఆర్ ఎందుకు ఎంచుకున్నారు? ఎందుకంటే అనూహ్యమైన పాచికలు వేసి శత్రువు అంచనాలు తల్లకిందులు చేయడం కేసీఆర్ కు వెన్నతో పెట్టిన విద్య. ఆయన మస్తిష్కమే వినూత్న ఆలోచనల కర్మాగారం. ఏ ఆలోచన వెనుక ఏ పరమార్థం దాగి ఉందో తెలుసుకోవడం సాధారణ రాజకీయ నాయకులకు సాధ్యం కాదు. అలాంటి ఓ వినూత్నమైన ఎన్నికల ఎత్తుగడే గెల్లు శ్రీనివాస్ ఎంపిక. 

టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ సాధనకు అసలు సిసలు చిరునామా. ఆ ఉద్యమ తోటలో పూసిన ఒక పువ్వే గెల్లు శ్రీనివాస్. అత్యంత సామాన్యమైన యాదవ కుటుంబం నుంచి వచ్చిన గెల్లు శ్రీనివాస్ ను ఈటల మీదికి పోటీకి దింపడం, హుజూరాబాద్ లో ప్రజాభిప్రాయాన్ని టీఆర్ఎస్ కు క్రమంగా అనుకూలంగా మార్చుకోవడం, అందుకోసం తన పార్టీ పరివారం యావత్తునూ హుజూరాబాద్ కు రప్పించడం, ఈటల క్యాంపులో అతిశయించిన ఆత్మవిశ్వాసం వెన్ను విరవడం... ఇదంతా కేసీఆర్ మార్కు రాజకీయ చాణక్యం. అందుకే బతుకమ్మ, దసరా పండుగల ముందువరకు ఉన్న అంచనాలు కాస్తా తారుమారవుతున్నాయి. తెలంగాణ ఉద్యమకారుడిగా, కేసీఆర్, కేటీఆర్ ల నమ్మకమైన అనుచరుడిగా ఉన్న గెల్లు శ్రీనివాస్ గెలుపు అవకాశాలు మెరుగవుతున్నాయన్న అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. అనేక సర్వేలు తొలుత ఈటలకే గెలుపు అవకాశాలున్నాయని తేల్చిచెప్పినా.. కొద్దిరోజులుగా గెల్లుకు వాతావరణం అనుకూలిస్తోంది. మారుతున్న స్థానిక ప్రజల అభిప్రాయాలే అందుకు నిదర్శనం. 


బలపడుతున్న గెల్లు పేరుకు కారణాలివే..
ఈటల బీసీ సామాజికవర్గం నుంచే వచ్చినా తెలంగాణ రాజకీయ నాయకులు అందరి కంటే ధనవంతుడన్న పేరుంది. అలా చెప్పుకోవడాన్ని ఈటల కూడా ప్రెస్టీజ్ గా ఫీలవుతారు. అందుకు భిన్నంగా గెల్లు శ్రీనివాస్ ఓ నిరుపేద యాదవ కుటుంబం నుంచి వచ్చిన సాదాసీదా ఉద్యమకారుడు. ఉద్యమకాలంలో కేసీఆర్ ఇచ్చిన పిలుపునందుకొని అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేశారు. ఓయూ విద్యార్థి నాయకుడిగా ఉన్న గెల్లు కుటుంబానికి హుజూరాబాద్ లో కూడా మంచి పేరుంది. గెల్లు తండ్రికి సైతం సౌమ్యుడిగా క్లీన్ ఇమేజ్ ఉంది. ఈ క్వాలిఫికేషన్స్ ఆధారంగానే కేసీఆర్ గెల్లును ఎంపిక చేశారు. అదే ఇప్పుడు వర్కవుటయ్యే అవకాశాలున్నాయన్న వాదన వినిపిస్తోంది. 


అందుకు కారణాలు ఏంటంటే.. ఓ పరిపాలుకుడిగా కేసీఆర్ తీసుకొచ్చిన ప్రజాసంక్షేమ పథకాలేనని చెప్పాలి. కేసీఆర్ ఎంత పర్ఫెక్టుగా పాచికలు వేస్తారో.. ప్రజాసంక్షేమం విషయంలో అంతే మానవీయత ప్రదర్శిస్తారు. అందుకు ఎన్నో ఉదాహరణలున్నాయి. ఈ ఏడేళ్ల పాలనే అందుకు తిరుగులేని సాక్ష్యం. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అనే నానుడి మూలాలేంటో తెలిసిన కేసీఆర్... పల్లెల్లో వృద్ధులకు వచ్చే కంటి జబ్బులు నయం చేయడాన్ని ఓ ఉద్యమ రూపంలో తీసుకున్నారు. వృద్ధులందరికీ ఉచిత కంటివైద్యంతో పాటు అవసరమైన అందరికీ ఆపరేషన్ కూడా చేసిన ఉదంతాలు దేశంలో ఎక్కడా లేవు. అది తెలంగాణలో, కేసీఆర్ హయాంలో మాత్రమే సాధ్యమైంది. అంతేకాదు.. షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి వంటి పథకాలతో ఈడొచ్చిన ఆడపడుచులకు పెళ్లిళ్లు చేస్తూ ప్రతి తండ్రికీ నేనున్నానంటూ దేవుడిచ్చిన పెద్దకొడుకయ్యారు. వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ ఇస్తూ వారి జీవితాలకు కనీస భరోసా ఇస్తున్నారు. ప్రభుత్వం నెలనెలా ఇచ్చే 3 వేలతో కనీస అవసరాలు తీరుతుండడంతో ఎందరో వికలాంగుల ముఖాల్లో ఆత్మగౌరవపు ఛాయలు కనిపిస్తుండడం గమనించాల్సిన అంశం. ఇవే కాదు.. తీవ్రమైన జబ్బులో, అనుకోని ప్రమాదాలో ఎదురై ఆపదల్లో చిక్కుకునేవారినీ కేసీఆర్ విస్మరించలేదు. ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఎంతో మంది బాధితుల బాధలు తీర్చారు కేసీఆర్. 


కేసీఆర్ చేపట్టిన మరో ప్రజాపథకమే రైతుబంధు. ఆరుగాలం కష్టించి ప్రజలకు అన్నం పెట్టే రైతన్నకు.. వాతావరణం అనుకూలించకనో, చీడపీడల వల్లనో పంటనష్టం ఏర్పడితే దాన్నుంచి కోలుకునే మార్గమే లేదు. పంటకు గ్యారెంటీ కోసం, రైతన్నకు భరోసా కోసం ప్రవేశపెట్టిందే రైతుబంధు. ఎకరానికి ఐదువేల సాయం చొప్పున రెండు పంటలకు 10 వేల సాయం... అంటే ఏటా ఒక్కో ఎకరాకు పదివేల చొప్పున తెలంగాణలోని దాదాపు 65 లక్షల మంది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూర్చారు. తనను స్వయంగా రైతుబిడ్డగా చెప్పుకునే కేసీఆర్.. రైతుల కోసం తీసుకొచ్చిన సంస్కరణాత్మకమైన పథకంగా మంచిపేరు తెచ్చుకుంది. ఆయన తీసుకొచ్చిన మరో అద్భుతమైన పథకమే దళిత బంధు స్కీమ్. సామాజికంగా చిన్నచూపుకు, అవమానాలకు గురవుతున్న ఎస్సీల్లోని ఒక్కో కుటుంబాన్ని ఎంచుకొని అందరికీ రూ. 10 లక్షల వంతున ఖర్చు చేస్తామని, అవసరమైతే ఇందుకోసం లక్ష కోట్లయినా వెచ్చిస్తామని చెప్పి యావత్ దళిత ప్రజల మనసు చూరగొన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ వంటి పథకాలతో తాగునీరు, సాగునీరుకు ఢోకా లేకుండా చేశారు. ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థుల గెలుపును ఖాయం చేస్తాయనేది కేసీఆర్ విశ్వాసం. ఆయన విశ్వాసమే ఇప్పుడు నిజం కాబోతుందన్న అంచనాలు బలం పుంజుకుంటున్నాయి. 
మరోవైపు ట్రబుల్ షూటర్ గా పేరున్న మంత్రి హరీశ్ రావు హుజూరాబాద్ లోనే మకాం వేయడం గెల్లుకు బాగా కలిసొచ్చే అంశంగా మారింది. ప్రజాక్షేత్రంలో తనకున్న సుదీర్ఘమైన అనుభవంతో, ప్రజానాడిని ఒడిసిపట్టడంలో మొనగాడిగా పేరున్న హరీశ్.. గెల్లు గెలుపును భుజాలమీద వేసుకోవడం, ఊరూరా ప్రత్యేకమైన ప్రచార వ్యూహాలు రూపొందించడం, దగ్గరుండి అమలు చేస్తుండడం, అన్ని సామాజికవర్గాలతో మీటింగ్ లు పెట్టించడం, గెల్లు గెలిస్తే నియోజకవర్గానికి జరిగే ప్రయోజనాల గురించి వివరిస్తుండడం.. ఇవన్నీ ప్రజల ఆలోచనా స్థాయిని  మార్చేశాయని  విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం మిగిలిన రెండున్నరేళ్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రజలను కన్విన్స్ చేస్తున్న హరీశ్ స్ట్రాటజీ వర్కవుట్ అయ్యే అవకాశాలు మెరుగయ్యాయంటున్నారు. ఈటల గెలిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వచ్చే ఇబ్బందేమీ ఉండదని, కానీ గెల్లు గెలిస్తే అదనపు ప్రయోజనాలు ఎన్నో అందుకోవచ్చనే  పాయింట్ మీద ప్రజలు పునరాలోచనలో పడ్డారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. 


అనూహ్యంగా తెరమీదికొచ్చిన గెల్లు.. అంతే ఆత్మవిశ్వాసంతో ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఓయూ స్టూడెంట్ గా వర్గాతీత, కులాతీత భావనలు ఒంట పట్టించుకున్న గెల్లు.. నియోజకవర్గంలోని  అన్ని గ్రామాల్లో అదే స్ఫూర్తిని ప్రదర్శిస్తున్నారు. తాను గెలిస్తే వచ్చే ఎన్నికల లోపు ప్రభుత్వం మరింత అభివృద్ధిని చేసి చూపిస్తుందని, ఈటలను గెలిపిస్తే ప్రభుత్వానికేమీ  నష్టం రాకపోగా.. నియోజకవర్గం ఎంతో కోల్పోతుందని తనదైన పంథాలో కన్విన్స్ చేస్తున్నారు. కేసీఆర్ ఇప్పటికే ఈ విషయంలో క్లారిటీ కూడా ఇవ్వడం విశేషం. ఇటీవల జరిగిన పార్టీ ఉన్నతస్థాయి సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్ లు... ఇలా అందరూ కూడా తమ కార్యక్షేత్రాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ  అప్రమత్తం చేశారు. మేనిఫెస్టోలో లేని పనులు చాలావరకు పూర్తిచేశామని, అయినా ప్రజలకు తానిచ్చిన మేనిఫెస్టోలో మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా రానున్న రెండున్నరేళ్లలో   పూర్తి చేయడం జరుగుతుందంటూ ప్రజాప్రతినిధులందరికీ భవిష్యద్దర్శనం చేశారు. ఓసారి అసెంబ్లీలో కేసీఆర్ ఏమన్నారంటే.. తన దగ్గర అద్భుతమైన రెండు అస్త్రాలు ఉన్నాయని, సమయానుకూలంగా వాటిని ప్రజల ముందు పెడతానని, ఆ అస్త్రాలే ఇతర రాజకీయ పార్టీల బ్రహ్మాస్త్రాలుగా మారతాయని, ప్రజా సంక్షేమం విషయంలో కనీవినీ ఎరుగని మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పడం గమనించాల్సిన అంశం. ఇదే విషయాన్ని గెల్లు శ్రీనివాస్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రజలందరికీ చెబుతూ విజయావకాశాలను మెరుగు పరుచుకుంటున్నారని నియోజకవర్గ పౌరులు చెప్పుకుంటున్నారు. మొత్తానికి గెల్లు విజయావకాశాలు గతంలో కంటే బాగా మెరుగవడం కాదనలేని వాస్తవంగా బహిరంగంగానే చెప్పుకుంటున్నారు. ఈటల లాంటి యోధుణ్ని ఓ యువనాయకుడు గెల్లు ఢీకొనడం మొత్తానికి ఆసక్తికరంగా మారింది. - T. Rameshbabu senior journalist

Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత