జనమెరిగిన నాయకుడు జానారెడ్డికి….. రాజకీయాల్లో విలువలకు కట్టుబడి ఉంటారనే పేరుంది. నియాజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి వారి మనసుల్లో సుస్థిరమైన స్థానం సంపాదించుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనే బలమైన కోరిక ఆయనలో ఉంది. కాంగ్రెస్ కు అధికారం వస్తే ముఖ్యమంత్రి రేసులో ముందుండే వ్యక్తి ఆయనే. గతంలోనే ఆయన తన కుమారుడికి మిర్యాలగూడ అసెంబ్లీ టికెట్ ఇప్పించాలని గట్టి ప్రయత్నాలు చేశారు. కానీ ఆ అవకాశం రాలేదు. అలాంటి జానారెడ్డి బీజేపీలో చేరతారా? కమలనాథులు జానాకు గవర్నర్ పదవి ఆఫర్ చేశారా.. ? లేక జానారెడ్డినే తనకు గవర్నర్గిరీ కావాలని, తన కుమారుడికి నాగార్జునసార్ ఉపఎన్నిలల్లో టికెట్ ఇవ్వాలని అడిగారా? రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఇదే టాపిక్ చర్చనీయాంశంగా మారింది.
నాగార్జునసాగర్ ఎంఎల్ఏ నోముల నరసింహయ్య ఆకస్మిక మరణంతో జానారెడ్డి భవిష్యత్ రాజకీయాలపై చర్చకు దారితీసింది. సాగర్ కు జరిగే ఉపఎన్నిలను తమకు అనుకూలంగా మార్చుకోవటం ద్వారా తెలంగాణలో టీఆర్ఎస్ కు తామే ప్రత్యామ్నాయం అని మరోమారు చాటి చెప్పాలని చూస్తున్న బీజేపీ నేతలు.. అందుకు సాగర్లో తగిన నాయకుడు జానారెడ్డే కాబట్టి ఆయన్ను ఎలాగైనా తమ పార్టీలోకి లాగాలని గట్టి ఎత్తులే వేస్తున్నట్టు సమాచారం. ఢిల్లీ బాసులు ఈ విషయంపై గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారని, వారికీ ఆయన కొన్ని షరతులు పెట్టారన్న వార్తలు షికార్లు చేస్తున్నాయి. నిజంగా ఆయన షరతులు పెట్టారా? కాంగ్రెస్ కు బై చెప్పేందుకు సిద్దపడ్డారా? అంటే రాజకీయాలలో ఏదైనా జరిగే ఆవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.
జానారెడ్డి రాజకీయాల్లో ఉద్దండుడు. మొదట టీడీపీలో కొనసాగిన ఆయన.. ఆ తరువాత కాంగ్రెస్ లో చేరారు. మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు. 2009 లో ఉమ్మడి రాష్ట్రంలోనూ 2014 ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఆయన నాగార్జునసాగర్ నుంచి ఎన్నికయ్యారు. తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడిగా వ్యహరించారు. అంతకుముందు చిలుకూరు నియోజకవర్గంగా ఉన్న ప్రాంతమే నేటి నాగార్జునసాగర్. అంతకుముందు నాలుగుసార్లు ఆయన అక్కడి నుంచి ఎన్నికయ్యారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఆయన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నరసింహయ్య చేతిలో ఓడిపోయారు. నాటినుంచి రాజకీయాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు జానా. అప్పుడప్పుడు గాంధీ భవన్ లో జరిగే కాంగ్రెస్ సమావేశాలకు హాజరవుతుంటారు. నోముల మరణంతో తిరిగి జానారెడ్డి పాత్ర పై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఆయన ఉప ఎన్నికల్లో పోటీచేస్తారా? లేక కుమారుడైన రఘువీర్ రెడ్డిని పోటీకి పెడతారా? అదికూడా ఏపార్టీ నుంచి... బీజేపీనా, లేక కాంగ్రెస్సా.. ఇలా పరిపరివిధానా జానా భవితవ్యంపై చర్చలు సాగుతున్నాయి. మరోవైపు.. తాను పోటీ చేయబోనని, రాహుల్ గాంధే స్వయంగా వచ్చి చెప్పినా పోటీకి ససేమీరా అంటున్నారని నియోజకవర్గంలో ప్రజలు చెప్పుకుంటున్నారు. సాగర్ నియోజకవర్గంలో బీజేపీకి పెద్దగా బలం లేదు. కాంగ్రెస్ కు బలం ఉన్నా ఇప్పుడున్న పరిస్థితిలో అది గెలుపుకు సరిపోతుందా.. అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. బీజేపీ 2500 ఓట్ల మార్కు నుంచి టీఆర్ఎస్ ను ఢీకొట్టే శక్తిగా ఎదుగుతుందా? ఒకవేళ ఇక్కడ బీజేపీ గెలిస్తే మాత్రం రాష్ట్రంలో అనూహ్య రాజకీయ పరిణామాలు ఖాయంగా సంభవిస్తాయంటున్నారు.. రాజకీయ విశ్లేషకులు. కాంగ్రెస్ సీనియర్ ను బీజేపీలోకి తీసుకోవడం వరకైతే ఇబ్బందేం లేదు కానీ.. ఆ పార్టీ నుంచి వచ్చే జానాలాంటి వ్యక్తులకు గవర్నర్ గిరీ కట్టబెట్టడం జరిగే పనేనా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి మరి.
Comments
Post a Comment
Your Comments Please: