రాష్ట్ర శాసనమండలిలో ఖాళీగా ఉన్న మూడు ప్రభుత్వ నామినేటెడ్ ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, మాజీ మంత్రి, రజక సంఘం జాతీయ నాయకుడు బస్వరాజు సారయ్య, వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్, ఆర్యవైశ్య సంఘం నాయకుడు బొగ్గారపు దయానంద్ పేర్లను మంత్రివర్గం ఖరారు చేసింది. ఈ ముగ్గురి పేర్లను ప్రభుత్వం గవర్నర్ ఆమోదానికి పంపింది. శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం.
బస్వరాజు సారయ్య:
ఉమ్మడి వరంగల్ జిల్లాకు బస్వరాజు సారయ్య టీఆర్ఎస్ లోకి చాలా కాలం క్రితమే వచ్చినా.. ఎప్పుడూ, ఎక్కడా క్రియాశీల రాజకీయాల్లో పాల్గొనలేదు. ఏ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనలేదు. వైఎస్ హయాంలో మంత్రిగా పనిచేసిన సారయ్య.. తన పోర్ట్ ఫోలియోకు తగిన స్థానం లభించకపోవడంతో నియోజకవర్గానికే పరిమితమయ్యారు. ఇప్పుడు జరగనున్న మున్సిపల్ ఎలక్షన్స్ తో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వాధినేత కేసీఆర్ సారయ్య పేరును బీసీ కోటాలో ఫైనల్ చేశారు. బీసీలకు 50 శాతం కోటా డిమాండ్ బలంగా వినిపిస్తున్న క్రమంలో వరంగల్ జిల్లా నుంచి బీసీల్లో అట్టడుగు వర్గానికి చెందిన సారయ్యను తీసుకోవడం వల్ల పార్టీకి మేలు జరుగుతుందని భావిస్తున్నారు.
గోరటి వెంకన్న:
తెలంగాణ కవి, గాయకుడు అయిన గోరటి వెంకన్నను కూడా ప్రభుత్వ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు. తెలంగాణ వాదానికి, సాహిత్యానికి పట్టం కట్టిన గోరటి కృషికి దీంతో మంచి గుర్తింపు లభించినట్టయింది.
బొగ్గారపు దయానంద్:
ఇక తెలంగాణలో మరో బలమైన సామాజికవర్గం ఆర్యవైశ్యుడైన బొగ్గారపు దయానంద్ ను ఓసీ విభాగంలో ఎమ్మెల్సీగా తీసుకుంటున్నారు. వాసవి సేవాకేంద్రం చీఫ్ అడ్వయిజర్ గా ఆర్యవైశ్యుల్లో మంచి గుర్తింపు పొందిన దయానంద్ అనేక సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గురి ఎంపిక కారణంగా ఆయా సామాజికవర్గాలను సంతృప్తిపరచి అనుకున్న ఫలితాలు సులభంగా రాబట్టవచ్చని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: