జమ్మూ జిల్లా నగ్రోటా ఎన్ కౌంటర్ లో చనిపోయిన నలుగురు టెర్రరిస్టులు భారీ కుట్రతోనే దేశంలోకి చొరబడ్డారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో ఇవే అంశాలు వెలుగుచూశాయి. హోంమంత్రి అమిత్ షా, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ ఎజిత్ దోవల్, ఫారెన్ సెక్రటరీ హర్షవర్ధన్ శ్రింగ్లాతో పాటు ఇంటెలిజెన్స్ ఉన్నతాధికారులు నగ్రోటా ఎన్ కౌంటర్ పై సమీక్షించారు. 2008 నవంబర్ 26న ముంబై మీద జరిగిన టెర్రరిస్టు దాడి తరహాలోనే తాజాగా కాశ్మీర్ లో భారీ కుట్రకు ప్లాన్ చేశారని భద్రతా దళాలు అంచనా వేశాయి. మరో వారం రోజుల్లో ఆనాటి భారీ అటాక్ జరిగిన దినం సమీపిస్తున్న దృష్ట్యా ఉగ్రవాదులు ట్రక్ లో దాక్కొని మళ్లీ అలాంటి భయానకమైన దాడికి పాల్పడేందుకు ప్లాన్ చేసిన విషయంపై చర్చించారు.
గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు టెర్రరిస్టులు హతమవడం, ఆ తరువాత కొన్ని గంటల్లోనే పీఓకే లోని టెర్రరిస్టు స్థావరాలను భారత దళాలు ధ్వంసం చేయడం గమనించాల్సిన అంశం. అలాగే జమ్మూ-కాశ్మీర్ లో జిల్లా అభివృద్ధి మండళ్ల ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా భీకరమైన దాడులకు పాల్పడి కాశ్మీర్ లో మళ్లీ అల్లకల్లోలం సృష్టించేందుకు టెర్రరిస్టులు ప్లాన్ చేస్తున్నారు.
Comments
Post a Comment
Your Comments Please: