Skip to main content

మనోజ్ లాస్ట్ మెసేజ్


 


ఎప్పుడూ ఏదో ఒక మెసేజ్ ఇచ్చే జర్నలిస్టు మనోజ్ ఫోన్ ఇక మోగదు. ఫోన్ మీద మెసేజ్ టైప్ చేసే వేళ్లు చలనం లేకుండా పడి ఉన్నాయి. టీవీలో ఫోన్-ఇన్ లేదా లైవ్ ఇచ్చే ఆ గొంతు శాశ్వతంగా వినపడదు. ఆ మొహం ఇక శాశ్వతంగా కనపడదు. రిపోర్టర్ గా స్క్రీన్ మీద నీట్ గా కనిపించే మనోజ్... ఆఫ్ లైన్లో ఇచ్చే మెసేజ్ లు చాలా విలువైనవి. ఇలాంటి క్రైమ్ రిపోర్టర్లు సేకరించే సమాచారమే చానల్ యాజమాన్యాలను కవరేజ్ విషయంలో ముందుంచుతుంది. ఆ వేగమే, ఆ ఎక్స్ క్లూసివ్ నెస్సే రిపోర్టర్లను ఉన్నకాడ ఉండనీయదు. ఏదో  కొత్త కబురు తేవాలి.. ఇంకేదో ఎవరికీ తెలియని విషయాన్ని తన చానల్లో, తన ద్వారా ప్రజలకు చేరవేయాలి... తానేంటో నిరూపించుకోవాలి... మేనేజ్ మెంట్ దగ్గర గుడ్ బుక్స్ లో చోటు సంపాదించుకోవాలి... బ్యూరో చీఫ్, ఇన్ పుట్ ఎడిటర్, ఎడిటర్, చైర్మన్ లకు తానిచ్చే ఇన్ పుట్స్ కీలకమని తెలియాలి. అందుకోసమే ఏ జెన్యూన్ జర్నలిస్టయినా ఎన్ని మైళ్లయినా పరుగులు తీస్తాడు. అదే చేశాడు మనోజ్. ఆ పరుగులు తీస్తున్న క్రమంలోనే కన్నుమూశాడు. మనోజ్.. జర్నలిజం వృత్తిలో భాగంగా మేనేజ్ మెంట్ కు అవసరమైన ఇతర కీలకమైన పనులే చేసేవాడని తెలుస్తోంది. అంటే మేనేజ్ మెంట్ కు చాలా దగ్గరి మనిషన్నమాట. ఉదయం 8 గంటలకు గాంధీ ఆస్పత్రిలో చనిపోయిన మనోజ్ గురించి వాట్సాప్ జర్నలిస్టు గ్రూపుల్లో అప్పుడే బ్రేకింగ్స్ పడిపోయాయి. మిస్త్రీనియా గ్రేవీస్ అనే వ్యాధితో బాధపడుతున్న మనోజ్ కు ఆపరేషన్ జరిగింది. ట్రీట్ మెంట్ జరుగుతున్నప్పుడే కరోనా సోకిందంటున్నారు. వ్యాధి తిరగబెట్టడం, కరోనా సోకడం కారణంగా మనోజ్ ఆరోగ్య పరిస్థితి విషమించిందని ప్రాథమికంగా డాక్టర్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే వెంటిలేటర్ మీదికి ఎక్కించినా కూడా ఫలితం లేకుండా పోయింది. కాసేపటికే మరణాన్ని డాక్టర్లు డిక్లేర్ చేశారు. 



కానీ అదేం చిత్రమో... వార్తా చానల్లో పనిచేసి.. ఓ వార్తగా మారిన కూలీ మరణం మాత్రం వార్త కాకుండా పోయింది. కరోనాతో ఫలానా చోట, ఫలానా వ్యక్తి చనిపోయాడని గంభీరమైన మ్యూజిక్స్ తో బ్రేకింగ్స్ తిప్పే చానళ్లకు ఓ జర్నలిస్టు మరణం మాత్రం అసలు న్యూసే కాకుండా పోయింది. మరో విచిత్రమేమంటే ఏడాది క్రితం ఏపీ నుంచి ఓ స్టాఫర్ చనిపోతే బ్రేకింగ్స్ మీద బ్రేకింగ్స్ తిప్పిన చానళ్ల సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఇక్కడా ప్రాంతీయమే పని చేస్తోందా అన్న అనుమానాలు కూడా కొందరు సీనియర్లు వ్యక్తం చేస్తుండడం విశేషం. 


సరే.. ఇక మనోజ్ కుటుంబ విషయానికొద్దాం. 8 నెలల క్రితమే మనోజ్ కి పెళ్లయిందట. త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఆ సంతోషం తీరకుండానే మనోజ్ శాశ్వతంగా బిడ్డకు దూరమయ్యాడు. పుట్టబోయే బిడ్డకు తండ్రి ఆనవాళ్లు తెలియకుండా పోయాయి. భార్య పరిస్థితేంటి.. తల్లిదండ్రులు, ఇతర కుటుంబసభ్యుల పరిస్థితేంటి.. ఇదీ ఓ జర్నలిస్టు అకాల మరణం చుట్టూ ముడివడి ఉన్న అంశాలు. 
ఇక తెలంగాణ సర్కారు కూడా జర్నలిస్టుల పట్ల చాలా వింతగా, మొండిగా వ్యవహరిస్తోందన్న అపవాదు చాలాకాలంగా ఎదుర్కొంటోంది. అది పలు సందర్భాల్లో కేసీఆర్ ప్రెస్ మీట్లలో కూడా కనిపించింది. జర్నలిస్టుల విషయంలో తన అలక్ష్యాన్ని కేసీఆర్ ఎక్కడా దాచుకోలేదు. అయితే కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో కూడా అదే శైలిని కేసీఆర్ సర్కారు అనుసరిస్తోంది. ఉపాధి దెబ్బతిని ఉద్యోగాలు కోల్పోయి వీధినపడ్డ సెక్షన్ లో జర్నలిస్టులు పెద్దసంఖ్యలో ఉన్నారు. పలు చానళ్లు కూడా ఇప్పటికే తీసివేతలు పూర్తి చేశాయి. ఇటు మనోజ్ మరణవార్త సోషల్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతున్న టైమ్ లోనే తెలంగాణలోని ఓ ప్రముఖ పత్రిక నుంచి ఓ జిల్లా ఎడిషన్ లో పనిచేస్తున్న 10 మంది సబ్ ఎడిటర్లకు ఉద్వాసన పలికినట్లు వార్తలు రావడం గమనించాల్సిన అంశం. మరోవైపు కోర్టు కేసులను వాయిదాల మీద వాయిదాలు వేయిస్తూ.. కక్షిదారుల జేబులు గుల్ల చేసే లాయర్లకు కరోనా సాయంగా రూ. 25 కోట్లు ప్రకటించిన కేసీఆర్ సర్కారు.. జర్నలిస్టుల కోసం కనీసం ఓదార్పు మాటైనా మాట్లాడలేదని పలువురు సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. 


మనోజ్ మరణంతో కలత చెందిన ఓ జర్నలిస్టు సోదరుడి మనోగతం ఇలా ఉంది.


ఏంది భాయ్ ఈ దారుణం.... 
జీతం సరిగా ఇవ్వని మీడియా కోసం జీవితం ఇచ్చేశావా....
- న్యూస్ కవరేజ్ కోసం వెళితే దారిలో ప్రమాదం జరిగినా పనిచేసే సంస్ధలు పైసా ఇవ్వరని తెలుసు...
- పైగా జాగ్రత్తగా ఉండక్కర్లేదా అని జాలి చూపించి ఉచిత సలహాలు ఇచ్చి చేతులు దులుపుకొనే మేనేజ్మెంట్లు ఉన్నాయని తెలుసు..
- రేపు లీవ్ తీసుకుని ఎల్లుండి వచ్చేయ్ అనే హృదయంలేని ఇన్చార్జులు ఉన్నారని తెలుసు..
- అన్నం తినే సమయంలో పక్క ఛానల్ లో బ్రేకింగ్ పడుతుంటే చేతులు కడుక్కొని పరిగెత్తాలని తెలుసు...
- అర్దరాత్రి గాఢ నిద్రలో ఫోన్ రింగ్ అయితే పరిగెత్తాలని తెలుసు....
- 24 గం.లు ఫోన్ & వాట్సప్ ఆన్ లో ఉండాలని తెలుసు..
- మిగిలిన బీట్లు లాగ కాకుండా 24 గం.లు డ్యూటి చేయాలని తెలుసు..
- రెగ్యులర్ గా మార్చురి దగ్గర వాసన పీల్చాలని తెలుసు...
- శవాలతో సావాసం, పోలీసులతో పరుగులు ఉంటాయని తెలుసు..
- సమాచారం వస్తే 5 నుండి 10 నిమిషాల్లో స్పాట్ లో ఉండాలని తెలుసు...
- కుటుంబంతో ఒక పూట కూడా గడిపే అవకాశం ఉండదని తెలుసు..
- మూడు పూటల టైమ్ ప్రకారం తినడం అంటే అద్బుతం అని తెలుసు...
- టైమ్ కి తినక ఆరోగ్యం పాడైపోతుందని తెలుసు...
- ఒక్కరోజు రెస్ట్ తీసుకుంటే పై నుండి పడే అక్షింతలు తెలుసు...
- హెల్త్ ఇన్స్యూరెన్స్ లేదని తెలుసు..
- ఎవడూ సాయం చేయడని తెలుసు..
- జీతం టైయానికి ఇవ్వరని తెలుసు..
-  జీవితానికి గ్యారంటి లేదని కూడా తెలుసు..
- కరోనా కవరేజ్ ఇవ్వాలని తెలుసు..
- కరోనా వైరల్ వైరస్ అని తెలుసు..
- జాగ్రత్తలు తీసుకొనే డాక్టర్లే బలైపోతున్నారని తెలుసు..
- మిగిలిన స్టాఫ్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసినా నువ్వు మాత్రం ఫీల్డ్ లో ఉండాలని తెలుసు..
- కోవిడ్ హాస్పటల్స్ దగ్గరకి, కంటోన్మెంట్ ఏరియాల దగ్గరకి వెళ్లాలని తెలుసు...
- కరోనా సోకే ప్రమాదం ఉందని తెలుసు...


ఇన్ని తెలిసి కూడా ధైర్యంగా పనిచేస్తున్నావంటే... అదీ రిపోర్టర్ అంటే...


Note: 
సాటి  మిత్రుని గా నీ మరణం నన్ను కలచివేసింది మిత్రమా....  ఈ మరణంతో అయినా మీడియా యాజమాన్యాలు & జర్నలిస్టు సంఘాలు కళ్లు తెరిచి హెల్త్, లైఫ్ ఇన్స్యూరెన్స్ పై దృష్టిపెట్టాలి.


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత