హిమాలయాల్లోని మానసరోవరానికి రోడ్డు మార్గం ద్వారా వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ కీలకమైన ముందడుగు వేసింది. భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్ వద్ద లింక్ రోడ్డు వేయడంతో కైలాస మానసరోవరానికి మరింత సులభంగా వెళ్లేందుకు రూట్ క్లియర్ అయింది. ఈ చర్యతో టూరిస్టులకు ఢిల్లీ నుంచి మానసరోవారం అత్యంత సమీపానికి నేరుగా బస్సులోనే వెళ్లే అవకాశం ఏర్పడింది. ప్రతి సంవత్సరం మానసరోవరానికి జూన్ నుంచి సెప్టెంబర్ వరకు అనుమతిస్తారు. ఇండియా-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఈ లింక్ రోడ్డు ద్వారా టిబెట్ భూభాగంలో ఉన్న మానసరోవరాన్ని నేరుగా సందర్శించవచ్చు. చైనా సరిహద్దుల్లో ఉన్న ఈ పుణ్యక్షేత్ర సందర్శనకు ప్రతి సంవత్సరం పెద్దసంఖ్యలో హిందువులు పోటీపడుతుంటారు.
రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. పూర్తయిన ఈ రోడ్డు మార్గాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. లిపులేఖ్ పాస్ నుంచి మానసరోవరం 90 కి.మీ. దూరంలో ఉంటుంది. రోడ్డుమార్గం ప్రారంభంలో రాజ్ నాథ్ తో పాటు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవానే పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా మానసరోవరానికి మొదటి జట్టు భక్తుల యాత్రకు రాజ్ నాథ్ జెండా ఊపారు. బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్వో) ఈ రోడ్డును పూర్తి చేసింది. ఈ పని చేసినందుకు రాజ్ నాథ్ బీఆర్వోను అభినందించారు.
లిపులేఖ్ పై వివాదం
భారత్-నేపాల్ సరిహద్దుల్లో ఉన్న లిపులేఖ్ ద్వారం గుండా టిబెట్ లోకి, చైనాలోకి ప్రవేశించవచ్చు. అయితే లిపులేఖ్ పాస్ నేపాల్ అధీనంలో ఉంది. నేపాల్ ప్రభుత్వానికి అధికారిక సమాచారం లేకుండానే భారత్ ఈ రోడ్డు మార్గం నిర్మించిందంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే ఢిల్లీలోని నేపాల్ ఎంబసీలో గల ఉన్నతాధికారుల ద్వారా నేపాల్ ప్రభుత్వానికి సమాచారం ఉందని, దీనిపై చాలా ఏళ్లుగా చర్చలు నడుస్తున్నాయని భారత్ పేర్కొంది. లిపులేఖ్ నుంచి రోడ్డు మార్గం నిర్మాణానికి 1997లోనే ద్వైపాక్షిక ఒప్పందం జరిగిందని, ఆ తరువాత 2015లో కూడా ప్రధాని మోడీ హయాంలో ఈ చర్చలు జరిగాయని.. ఈ క్రమంలోనే ఈ ప్రక్రియ పూర్తయిందని భారత విదేశీ వ్యవహారా నిపుణులు చెబుతున్నారు. అయితే తమకు ఢిల్లీలోని నేపాల్ ఎంబసీ ద్వారా సమాచారం ఉన్నప్పటికీ.. రోడ్డు నిర్మాణానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియదని, ఆ నోట్ వచ్చాక అధికారికంగా స్పందిస్తామని నేపాల్ చెబుతోంది.
Comments
Post a Comment
Your Comments Please: