కరోనా దెబ్బకు దాదాపు 2 నెలలుగా ఉపాధి కోల్పోయి, కూలీ పని కూడా దొరక్క పేదల కుటుంబాలన్నీ అల్లకల్లోలంగా మారుతున్న క్రమంలో అత్యంత వెనుకబడ్డ వర్గాలను ఆపద్బాంధవుడైన ముఖ్యమంత్రి కేసీఆరే ఆదుకోవాలని జాతీయ ఎంబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కె.సి.కాళప్ప విజ్ఞప్తి చేశారు. జనతా కర్ఫ్యూ, ఆ తరువాత మూడో దఫా లాక్ డౌన్ కొనసాగుతున్న క్రమంలో రెక్కాడినప్పుడే పూర్తిగా డొక్కాడని పరిస్థితుల్లో ఉన్న ఎంబీసీలు.. కరోనా దెబ్బకు కనీసం ఆకలి కూడా తీర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని.. అలాంటివారి కోసం ప్రత్యేకంగా ఆపన్నహస్తం అందించాల్సిన అవసరం ఉందని కాళప్ప అభిప్రాయపడ్డారు.
కుప్పకూలిన చేతివృత్తులు
చేతివృత్తులు, మానవసేవలు అందించే బడుగులు, నిరుపేదలంతా మోస్ట్ బ్యాక్ వార్డ్ కులాల్లోనే ఉన్నారని.. వారిని కాపాడుకోవడం యావత్ సమాజ కర్తవ్యమన్న ఆయన.. అలాంటివారిని కాపాడుకోకపోతే వారి సేవలమీదనే ఆధారపడ్డ అనేక కుటుంబాల పరిస్థితి సంకటంలో పడుతుందన్నారు. హైదరాబాద్ లో నిర్మాణరంగానికి అవసరమైన కూలీలుగానీ, హమాలీలు గానీ, పరిశ్రమల్లో పనిచేసే వర్కర్లు గానీ, అడ్డా మీది లేబర్లు గానీ, ఆఫీసులు-కార్యాలయాలకు వెళ్లే ఉన్నత కుటుంబాల ఇళ్లలో పనిచేసే పనిమనుషులు, ఆయాలు, అనాథాశ్రమాల్లో సేవలందించేవారు.. ఇలా కీలకమైన శ్రామిక, సేవారంగాన్ని నడిపిస్తున్నవారంతా కింది కులాలవారేనని, ఈ కష్టకాలంలో ఆదుకోకపోతే ముందుముందు యావత్ సమాజం అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. అందుకే రేపటి సమాజం సురక్షితంగా ఉండాలంటే వారికి తక్షణమే ఆపన్నహస్తం అందించాలని తెలంగాణ సర్కారుకు ఆయన విన్నవించారు.
ఉపాధి కోల్పోయి దెబ్బతిన్న కులాలు ఇవే
షాపులు, మడిగెలు మూతపడడంతో నాయీబ్రాహ్మణులు బజారునపడ్డారు. మంగళి షాపు యజమానులే కాక షాపుల్లో పనిచేసే రోజువారీ కూలీలకు పూట గడవడం కష్టంగా మారింది. అలాగే వాషింగ్ మెషీన్ల రాకతో ఇప్పటికే పూర్తిగా దెబ్బతిన్న రజక వృత్తిలో.. ఆ మహిళలు పట్నంలోని పలువురి ఇళ్లలో పనివారుగా కుదురుకున్నారు. ఇప్పుడా పని కూడా లేక ఆయా కుటుంబాలన్నీ పస్తులతో పడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. అలాగే చేపలు, రొయ్యలు అమ్ముకొని వాటిమీదనే జీవించే గంగపుత్రులు.. మార్కెట్లన్నీ మూతపడడంతో దిక్కుతోచని పరిస్థితిలో కూరుకుపోయారు. వేర్వేరు ఇళ్లలో పనివాళ్లుగా కుదురుకున్న కొందరు మహిళలకు కూడా ఉపాధి లేకుండాపోయింది. అలాగే తెలంగాణలో చెప్పుకోదగ్గ పెద్దసంఖ్యలో ఉన్న విశ్వబ్రాహ్మణులు అత్యంత దయనీయ స్థితిని ఎదుర్కొంటున్నారని కాళప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే చేతివృత్తులు చతికిలపడ్డ క్రమంలో రెడీమేడ్ పనుల కోసం పట్నాలకు వలస పోయిన వేలాది మంది విశ్వబ్రాహ్మలు.. ఇప్పుడు వారి చేతుల్లోనే పనిముట్లకు పనిలేక, అర్ధాకలితో అలమటిస్తున్నారు. దీర్ఘకాల వ్యాధులకు చికిత్స చేయించుకునే స్తోమత లేక అనారోగ్యాలతో కునారిల్లుతున్నారు. అలాగే పట్టెడన్నం కోసం సంస్కృతిని ప్రదర్శిస్తూ రోజంతా బిచ్చమెత్తుతూ సంచరించే దాసరి, దొమ్మర, కాటిపాపల, మొండిబండ, పిచ్చుగుంట్ల వారేకాక... పాములోళ్లు, వీరముష్టి, బోయ, వడ్డెర వంటి చేతికష్టాన్నే నమ్ముకున్న అనేక వేలాది మంది బడుగులు రోడ్డునపడ్డారని, వారికోసం ప్రత్యేకంగా ఆలోచించకపోతే ఆ వర్గాలు ఉనికిలో లేకుండా పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. వీరి తక్షణావసరాల కోసం కుటుంబానికి రూ. 5 వేల చొప్పున జమ చేయాలని కేసీఆర్ ను కోరారు.
ఆనాటి సుదీర్ఘ చర్చాంశాలను అమలు చేయండి
తెలంగాణ ఆవిర్భావం తరువాత తొలి తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన సమయంలో 2017లో అత్యంత వెనుకబడిన కులాల నాయకులతో దాదాపు 7 గంటలపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారని, సమాజంలో గుర్తింపుకు నోచుకోని లక్షలాది మంది కోసం సుదీర్ఘంగా చర్చించడం దేశ చరిత్రలోనే తొలిసారి అని.. ఆ క్రెడిట్ కేసీఆర్ కే దక్కుతుందని గుర్తు చేశారు. అలా ఎంబీసీల కోసం ప్రత్యేకంగా ఆలోచించి, ఎంబీసీ నాయకత్వం నుంచి సూచనలు, సలహాలు కోరిన కేసీఆర్.. ఇప్పుడు తలెత్తిన కరోనా సంక్షోభాన్ని అధిగించేందుకు అద్భుతమైన రీతిలో ప్రణాళికలు అమలు చేస్తున్నారని... తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అద్భుతంగా కరోనాను ఎదుర్కొంటోందని ప్రశంసించారు. ఈ క్రమంలోనే కేసీఆర్ సర్కారు… తక్షణమే నోరు లేని బడుగుల పక్షాన ఆలోచించి, వారి కోసం తక్షణావసరంగా నిధులు విడుదల చేయాలని కోరారు. కరోనా కష్టకాలంలో ఏ చిన్న సాయం ప్రభుత్వం వైపు నుంచి అందినా.. లక్షలాది కుటుంబాలు ఊపిరి పీల్చుకుంటాయని.. వారంతా కేసీఆర్ ను ఎప్పుడూ గుండెల్లో పెట్టుకుంటారన్నారు.
Comments
Post a Comment
Your Comments Please: