దినసరి కూలీగా వచ్చి పేదల మనసుల్లో గుడి కట్టుకున్న బాలలింగం
కరోనా సృష్టిస్తున్న కల్లోలంతో నిరుపేదలు, రెక్కాడితే గాని డొక్కాడని దినసరి కూలీలు, పొట్ట చేత పట్టుకొని దూర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు వీధిపాలవకుండా కొందరు ఆపద్బాంధవులు ఆదుకుంటున్నారు. ముఖ్యంగా ప్రతినెలా ఫస్టు రాగానే ఇంటి అద్దెల కోసం టీనెంట్స్ వెంట పడే ఆసాములు హైదరాబాద్ లాంటి పట్టణాల్లో అడుగడుగునా ఉంటారు. అయితే తాను మాత్రం అలా కాదంటూ ఓ ఆపన్నహస్తం ముందుకొచ్చింది. కరోనా సమయంలో తనకు అద్దెలు చెల్లించాల్సిన అవసరం లేదని పెద్దమనసు చేసుకున్న యజమాని తన టీనెంట్స్ కి భరోసా ఇవ్వడం ఎందరో యజమానులకు స్ఫూర్తిదాయకంగా మారింది.
Also Read: రెంట్లు తగ్గాలి.. ఫీజులు ఎత్తేయాలి.. సామాన్యుడి సరికొత్త డిమాండ్లు
హైదరాబాద్, బాలానగర్ లో ఉంటున్న కోడూరి బాలలింగంను మా ప్రతినిధి ఫోన్లో పలకరించాడు. రాజన్న సిరిసిల్ల జిల్లానుంచి చాలా ఏళ్లక్రితం పని వెదుక్కుంటూ హైదరాబాద్ వలస వచ్చిన బాలలింగం పెద్దగా చదువుకోలేదు. బతుకుబండి లాగేందుకు బార్ లో పాత్రలు క్లీన్ చేసే పనికి కుదురుకొని.. అలా నెమ్మదిగా ఓ మిత్రుడి సాయంతో మెకానికల్ వర్క్ షాప్ పెట్టుకొని చిన్నపాటి యజమానిగా మారారు. ఆ విధంగా దశ తిరిగిన బాలలింగం పలు చోట్ల సొంత ఇళ్లు కట్టుకున్నారు. తానుండేది ఇండస్ట్రియల్ ఏరియా కాబట్టి... అక్కడి పరిశ్రమల్లో పనిచేసేది చాలావరకు లేబర్సే. తన ఇళ్లలో అద్దెకు ఉండేది కూడా లేబర్సే కావడం వల్ల... ఈ కరోనా విసిరిన పంజా కారణంగా... వారి కష్టాలను స్వానుభవంగా గ్రహించిన బాలలింగం.. ఏప్రిల్ నెలకు టీనెంట్స్ కు అద్దె నుంచి మినహాయింపునిచ్చినట్లు భాగ్యనగర్ పోస్ట్ కు వివరించారు. రెంట్ల నుంచి 75 మంది టీనెంట్స్ కి ఉపశమనం ఇవ్వడం ద్వారా బాలలింగం రూ. 3.2 లక్షలు వదులుకున్నట్టయ్యింది. తన ఇళ్లలో ఎక్కువగా బిహార్ నుంచి వచ్చిన కూలీలే కావడం వల్ల.. వారు చెల్లించలేని అశక్తతను అర్థం చేసుకున్న ఈయన ఈ విధమైన నిర్ణయం తీసుకోవడంతో వారంతా టీనెంట్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే తనలాగా ఇతరులు కూడా స్వచ్ఛందంగా చేస్తే బాగుంటుందని బాలలింగం అభిప్రాయపడుతున్నారు.
ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కార్మికుల కుటుంబాలకు అండగా..
ఇది కాకుండా డబ్బు అవసరం ఉన్న పేదలను ఆదుకోవడం బాలలింగానికి అలవాటు. కరోనా సీజన్లో దాదాపు 250 మంది వరకు ఆయన 2.5 లక్షల రూపాయలు అందజేశారు. అలా ఇప్పటివరకు కోటి 20 లక్షల రూపాయల నగదు పంపిణీ చేయడం విశేషం. ఆర్టీసీ సమ్మె జరిగినప్పుడు కార్మికుల పట్ల ఎంతో ఉదారతను ప్రదర్శించడమే కాక ప్రభుత్వ పాఠశాలల్లో వలంటీర్లుగా విద్యాబోధన చేసేవారికి వేతనాలు చెల్లించారు. ఇలా చెప్పుకుంటే పోతే మనసు స్పందించిన ప్రతిసారీ తానేంటో నిరూపించుకుంటూ వస్తున్నారు బాలలింగం. సమాజానికి ఆపత్కాలం సంభవించినప్పుడు ఇలాంటి కొందరే తాము చిన్నవాళ్లే అయినా పెద్దమనసున్న పెద్దలుగా వ్యవహరించి నడిపిస్తుంటారని పలువురు బాలలింగాన్ని ప్రశంసిస్తున్నారు.
నోట్ - ఈ ఆపత్కాలంలో హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో ఇంటి అద్దెల నుంచి టీనెంట్స్ కు రిలీఫ్ ఇవ్వడం తక్షణావసరం. అందుకోసం ఈ లింక్ ను క్లిక్ చేసి మద్దతు తెలపాల్సిందిగా విజ్ఞప్తి.
ఇంటి అద్దె మినహాయింపు కోసం క్యాంపెయిన్
News to follow: చంద్రుడి మీద మైనింగ్ కి ట్రంప్ గ్రీన్ సిగ్నల్
Comments
Post a Comment
Your Comments Please: