Skip to main content

<అసదుద్దీన్ కి తమ్ముడే తలనొప్పి>

తమ్ముడంటే ఎలా ఉండాలి? రాముడికి లక్ష్మణుడిలా ఉండాలి. అన్న గౌరవాన్ని పెంచేలా తమ్ముడు నడుచుకోవాలి. కానీ.. అన్న నిర్మించుకుంటూ వస్తున్న గౌరవ-మర్యాదలను వెనుక నుంచి కూల్చేస్తూ రావడం... బాధ్యత గల తమ్ముడు చేయాల్సిన పనేనా? తండ్రి నుంచి సంక్రమించిన రాజకీయ వారసత్వాన్ని.... సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అన్న బిల్డప్ చేస్తూ వస్తుంటే... తమ్ముడు చేసే దుందుడుకు వ్యాఖ్యలు ఏ పరిణామాలకు దారితీస్తాయి? టీఆర్ఎస్ కు మిత్రపక్షంగా వ్యవహరిస్తున్న మజ్లిస్ లో అన్నదమ్ముల మధ్య పొసగని అభిప్రాయాలతో భారీ మూల్యం తప్పదన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 




దశాబ్దాలుగా పాతబస్తీలో పాగావేసిన మజ్లిస్ పార్టీకి గడ్డుకాలం నడుస్తున్నట్లే కనిపిస్తోంది.  హైదరాబాద్ లో ఒవైసీ సోదరుల గురించి పరిచయం అక్కర్లేదు. తండ్రి సుల్తాన్ సలాఉద్దీన్ ఒవైసీ హయాంలో ఎంఐఎం ఓ వెలుగు వెలిగింది. ఆయన అనంతరం పార్టీని నడిపిస్తున్న అసదుద్దీన్, అక్బరుద్దీన్  ఒవైసీల ఆధ్వర్యంలో కూడా పార్టీ దూసుకుపోతోంది. అందులో నో డౌట్. అయితే సహోదరుల మధ్య వ్యవహారాల్లో మాత్రం కొన్ని భిన్న వైఖరులు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.  అన్న అడుగుజాడల్లో అక్బర్ నడుస్తున్నట్లే కనిపిస్తున్నా... అక్బర్ అనాలోచిత ఆవేశంతో అన్నకు కొత్త చిక్కులు తేవడం ఖాయమన్నట్లుగా కనిపిస్తోంది. అన్నివర్గాలను కలుపుకు పోవాలని అసదుద్దీన్ ప్రయత్నిస్తుంటే... అక్బర్ మాత్రం అందుకు భిన్న ధ్రువంగా మారినట్టు కనపిస్తోంది. దళితులను, ముస్లింలను కలుపుపోయేందుకు అసదుద్దీన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. తెలంగాణలో బీజేపీ దూకుడుని అడ్డుకునేందుకు ఎంఐఎం, టీఆర్‌ఎస్‌లు ఉమ్మడిగా ప్రయత్నిస్తున్నాయి. అయితే అక్బరుద్దీన్ అనాలోచిత నిర్ణయాలు, ఆవేశపూరిత ప్రసంగాలు బీజేపీకి అందిన అస్త్రాలుగా మారుతున్నాయి. బీజేపీ హవాను ఎలాగైనా  అడ్డుకోవాలని అసద్, కేసీఆర్ లు తీవ్రంగా ప్రయత్నిస్తుండగా... తన పరుష పదజాలంతో, టెంపర్ మెంట్ బాడీ లాంగ్వేజ్ తో అక్బరుద్దీన్ అనేక అనుమానాలు రాజేస్తున్నారు. ఆయన వైఖరి చూస్తుంటే.. రెండు ప్రధాన వర్గాల ప్రజల మధ్య సున్నితమైన స్నేహ సంబంధాలు బెడిసికొట్టేలా కనిపిస్తున్నాయన్న ఆందోళన తెలంగాణ వాదుల్లో వ్యక్తమవుతోంది. ఈ ప్రమాదం రాకుండా ఉండేందుకు అన్న అసదుద్దీన్ చిత్తశుద్ధితో శ్రమిస్తుండగా.. అక్బరుద్దీన్ వైఖరితో అసద్ విసిగిపోతున్నట్లు సమాచారం. 


హిందూ-ముస్లింలు కావడి కుండలుగా కలిసి ఉండేందుకు, మత సామరస్యాన్ని కాపాడేందుకు తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కూడా కేసీఆర్ అనేక జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నారు. అక్కడి నుంచే అసదుద్దీన్ కు కూడా కేసీఆర్ మీద గురి కుదిరిందని చెబుతారు. ఆ నమ్మకమే అసదుద్దీన్ చేత అనేక సందర్భాల్లో కేసీఆర్ కు ఆత్మీయ హస్తం అందించేలా చేసింది. వారి మధ్య ఏర్పడ్డ స్నేహ బంధం చేతనే.. ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ కు ఎంఐఎం బహిరంగ మద్దతు ప్రకటించడం విశేషం. అలాంటిది ఇప్పుడు తమ్ముడు అక్బర్ కారణంగా రెండు వర్గాల ప్రజల మధ్య అనుమానాలు మొదలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. తమ్ముడి మాటల్లో చట్ట వ్యతిరేక పదాలేవీ లేవని పోలీసు అధికారులు క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ.. ఆయన చేసిన పాత కామెంట్లతో పాటు, కరీంనగర్ లో ఆయన ఆవేశపూరిత ప్రసంగం, ఆ సందర్భంగా అక్బర్ బాడీ లాంగ్వేజీ, ఆయన వెనుక కుర్రకారు కేరింతలు చూస్తే.. అందులో జరిగిన కమ్యూనికేషన్ ఏంటో ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుందన్న వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 


మతతత్వ పార్టీగా ముద్రపడిన మజ్లిస్ రానురాను తన పంథాను మార్చుకుంటూ తనపై ఉన్న ముద్రను చెరిపేసేందుకు ప్రయత్నిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కుల సాధన, వారి సంక్షేమమే ప్రధాన ఎజెండా గా పార్లమెంటులో సైతం అసద్ వాణి వినిపిస్తున్నారు. వీరితో పాటు హిందువులకు కూడా తగు ప్రాతినిధ్యమిస్తూ 1986లో కాంగ్రెస్ మద్దతుతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో అధికారంలోకి వచ్చిన మజ్లిస్ ముగ్గురు హిందువులను ఒక్కొక్కరిని ఒక్కో ఏడాది మేయర్లుగా నియమించింది. 2009 ఎన్నికలలో రాజేంద్రనగర్ నుంచి ఎంఐఎం తన ఎమ్మెల్యే అభ్యర్థిగా హిందూ అభ్యర్థి మురళీధర్‌రెడ్డిని బరిలోకి దించింది. గత మూడు పర్యాయాలుగా హైదరాబాద్ కార్పొరేషన్‌లో ఎంఐఎం పార్టీ నుంచి ఐదు నుంచి ఆరుగురు హిందువులు కార్పొరేటర్లుగా ఎన్నికవుతూ వస్తున్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన ఉద్యమ పార్టీ టీఆర్‌ఎస్‌కు మజ్లిస్ పార్టీ మద్దతుగా నిలిచింది.  


ఇప్పటివరకూ ఓల్డ్ సిటీకే పరిమితమైన ఎంఐఎం తెలంగాణ అంతటా దాని ప్రాభవాన్ని విస్తరించేందుకు వ్యూహరచన చేస్తోంది. గ్రేటర్ పరిధిలో మాత్రం తన పట్టు సడలకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే అక్బరుద్దీన్ వైఖరితో గతంలో ఎంఐఎం మాత్రమే ఇరుకున పడేది. ఇపుడు టీఆర్ఎస్ తో దోస్తీ కారణంగా అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు గులాబీ పార్టీకి తీరని నష్టం చేకూర్చుతున్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అటు ఎంఐఎం అనే మత తత్వ పార్టీకి కేసీఆర్ కొమ్ము కాస్తున్నారని, ముస్లింల ఓట్ల కోసం ఎంఐఎం ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడినా వారికి అండగా నిలుస్తూ అధికారాన్ని సైతం తాకట్టు పెట్టేందుకు కేసీఆర్ రెడీ అవుతున్నారంటూ విమర్శల్లో పదును పెంచుతోంది. ఇలా రాజకీయ, సామాజిక వాతావరణాన్ని ప్రభావితం చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్న క్రమంలో... అక్బర్ ను దారికి తెచ్చుకోవడం అసద్ కు తప్పనిసరి వ్యవహారంగా మారింది. అయితే తమ్ముణ్ని సరిదిద్దుకోలేని పక్షంలో అసద్ నిర్మించుకుంటూ వస్తున్న ఫ్రెండ్లీ ఇమేజ్ కాస్తా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరి అసద్.. తమ్ముణ్ని ఎలా దారికి తెస్తాడు? అటు దారికి తెచ్చుకోలేక ఆత్మీయ మిత్రుడైన కేసీఆర్ ను అసమర్థుడిగా ప్రజల ముందు నిలబెడతారా? ఆ విధంగా పరోక్షంగా బీజేపీ ప్రాభవానికి పట్టం కడతారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు అసదుద్దన్ మస్తిష్కాన్ని తొలుస్తున్నట్లు అసదుద్దీన్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. మరి అసదుద్దీన్ ఈ వ్యవహారాన్ని ఎలా సరిదిద్దుతారో చూడాలి. 


- టి.రమేశ్ బాబు


- rameshbabut@hotmail.com


 


Comments

Popular posts from this blog

తెలంగాణ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు

తెలంగాణలోని తెలుగు, ఉర్దూ జర్నలిస్టులకు జహీరుద్దీన్ అలీఖాన్ స్మారక పోటీలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ జర్నలిస్టుల సంఘం (టీయూజేఎస్) ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఈ పోటీలను ప్రింట్ జర్నలిస్టులకు మాత్రమే నిర్వహిస్తున్నట్టు టీయూజేఎస్ అధ్యక్షుడు ఎం.ఎం.రహమాన్, ప్రధాన కార్యదర్శి టి.రమేశ్ బాబు తెలిపారు. 2023 జనవరి నుంచి 2024 ఫిబ్రవరి నెలాఖరు వరకు తెలుగు, ఉర్దూ పత్రికల్లో అచ్చయిన మానవీయ కథనాలు గానీ, ప్రభుత్వ వ్యవస్థలను కదిలించిన కథనాలు గానీ, అత్యుత్తమంగా నిలిచిన మరేవైనా కథనాలను గానీ జర్నలిస్టులు పంపాలని వారు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జర్నలిస్టులు తమ ఎంట్రీలు పంపడానికి ఆఖరు తేదీ ఏప్రిల్ 30వ తేదీగా గడువు విధించారు.  తెలుగు కథనాలను zaheeruddinalikhantelugu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని, అలాగే ఉర్దూ కథనాలను zaheeruddinalikhanurdu@yahoo.com అనే మెయిల్ ఐడీకి పంపాలని చెప్పారు. అభ్యర్థులు తమ ఎంట్రీలను పోస్టులో గనక పంపినట్లయితే #119, 120, మొదటి అంతస్తు, డౌన్ టౌన్ మాల్, లోటస్ హాస్పిటల్ పక్కన, లక్డీకాపూల్, ఖైరతాబాద్, హైదరాబాద్ అనే అడ్రసుకు పంపాలని చెప్పారు.  జూన

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

తెలంగాణ జాతిపిత యాదిలో..

తొలిదశ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను, మలి దశలో యువతరం పోరాట పటిమను కళ్లారా చూసిన వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ కోసమే బతికిన, తెలంగాణ కోసమే శ్వాసించిన వ్యక్తిగా.. తెలంగాణ జాతిపితగా ఆయన్ని నిన్నటితరం, నేటి తరం గుర్తుంచుకుంటుంది. అలాగే రేపటి తరం కూడా ఆయన స్ఫూర్తిని కొనసాగించాల్సిన అవసరం ఉంది. జూన్ 21న ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి.  Also Read:  తెచ్చుకున్న తెలంగాణలో మరో ఉద్యమం Also Read: హైదరాబాద్ రెండో రాజధాని? "పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది" తిరుగు లేని బాణంలా ఎక్కుపెట్టిన ఆ మాట మాట్లాడి వ్యక్తే.. కాళోజీ నారాయణరావు. కవిత్వం రాయడమే కాదు.. కవనమై జీవించడం ఆయనకే చెల్లింది. ఆయన కవితాగానానికి సరిపోలిన నిలువెత్తు విగ్రహమే ప్రొఫెసర్ జయశంకర్ సార్. కాళోజీ కవిత్వీకరించినట్టు తెలంగాణ సమాజానికి ఉద్యమ బ్రహ్మాస్త్రమైన వ్యక్తే ప్రొఫెసర్ జయశంకర్. పుట్టుక, చావులు మాత్రమే జయశంకర్ వి. ఆ రెంటి నడుమ బతికిన కాలమంతా ఈ దేశానిదే... తెలంగాణ సమాజానిదే. ప్రొఫెసర్ జయశంకర్ కు వ్యక్తిగత జీవితం గానీ, వ్యక్తిగతమైన ఆస్తులు గానీ లేవు. ఆయన బతుక్కి భరోసా ఇచ్చే బంధుగణం గానీ, వారసులు గానీ లేరు. అంత