Skip to main content

ఆ రాష్ట్రంలో ఆ కులం వర్సెస్ ఈ కులం


రాజకీయాలంటే కులాల పోరాటమా? విభిన్న వర్గాల మధ్య సమరమా? మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏం జరిగింది? అంతకుముందు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ కులాలకు రాజకీయ ప్రాధాన్యత లభించింది? ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్న జగన్ ఏ వర్గాలకు కొమ్ము కాస్తున్నాడు? తాజాగా రోజా చేసిన అతిశయింపు వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. 


 


రాజకీయాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు.   అవి కదిలే ప్రవాహంలా సాగిపోతుంటాయి. ఈ నిముషానికి సుఖం అనుకుంటే మరు నిముషంలో పెద్ద సంక్షోభం పుడుతుంది. సాగరంలో బడబాగ్ని దాగున్నట్లుగా బయటకు వచ్చి ఎపుడు ఎగిసి పడతాయో తెలియదు.  ఈ నిమిషానికి ఉన్న రాజకీయాలు మరునిమిషం మారిపోగలవు. అందుకే రాజకీయాలు హ్యాపీ అని ఎవరూ తీరిగ్గా కూర్చోవడానికి వీల్లేదు. కార్తీక మాసం వనభోజనాల సందర్భంగా వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యలు ఇపుడు ఏపీ రాజకీయాల్లో  ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గత ప్రభుత్వం రెడ్లను రాజకీయంగా, ఆర్థికంగా అణచివేసిందని రోజా గతాన్ని తవ్వారు. అంతేకాదు గత ప్రభుత్వం రెడ్లను అవమానాలను గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. బడుగు బలహీన వర్గాలను రాజకీయాల్లో ఎదగనీయలేదని ఆరోపించారు. అలాంటి ప్రభుత్వాన్ని మట్టి కరిపించి అధికారం చేపట్టిన జగన్ ను సైరా నరసింహారెడ్డితో పోల్చారు. ఇపుడు ఈ వ్యాఖ్యలే ఏపీ కుల రాజకీయాల్లో కాక పుట్టిస్తున్నాయి. 

తెలుగునాట కులాలవారీగా రాజకీయ బలాన్ని విశ్లేషించాలంటే నిజానికి 11వ శతాబ్దం నాటి  కాకతీయుల పతనం నుంచీ మొదలుపెట్టాలి. లేదంటే బ్రిటిష్ హయాంలో జరిగిన ఎన్నికలను గమనించినా ఆంధ్రాలో కుల రాజకీయాల ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమయంలో తెలంగాణ నిజాం పాలనలో ఉండడంతో కులాల ప్రత్యక్ష పెత్తనాలు లేవు. పరోక్షంగా బ్రాహ్మణ, వెలమ, రెడ్డి కులాల ఆధిపత్యం ఉండేది. కానీ వారి ఆధిపత్యం ముస్లిం నవాబులకు లోబడి ఉండేది. అయితే ఆంధ్రాలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. స్వతహాగా ఆర్థికంగా స్థితిమంతులు కావడం, రాజకీయ చైతన్యం కలవారు కావడంతో  ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా ఉండేవి. స్వాతంత్ర్యం తరువాత కులాల ప్రభావాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి పదవిని మాత్రమే సరైన కొలమానంగా భావించాల్సి ఉంటుంది. తెలుగునాట ఆ పదవి కోసమే ప్రధానమైన అన్ని కులాల మధ్యా పోటీ జరుగుతుంది. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన, ప్రస్తుతం చేస్తున్న వ్యక్తుల కులాలు, ముఖ్యమంత్రి పదవి కోసం తపన పడుతున్న కులాలు, ఇప్పట్లో ఆ పదవి దరిదాపుల్లోకి వచ్చే పరిస్థితి లేని కులాలు....   ఇష్టమైనా, కష్టమైనా ఏపీలో కులాల పరిస్థితులను ఇలానే విశ్లేషించాల్సిఉంటుందంటే అతిశయోక్తి లేదు. 



ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొదట్లో కుల రాజకీయాలు అసలు లేవనే చెప్పొచ్చు. చెన్నై నుంచి విడిపోయాక కాంగ్రెస్ నేత్రుత్వంలో కొంతకాలం బ్రాహ్మణులు పరిపాలించారు. మధ్యలో ఒకటి రెండు పర్యాయాలు దళిత ముఖ్యమంత్రులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు నాయకత్వం వహించారు. వీరు మినహా 1983 దాకా ఎక్కువ కాలం ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ను రెడ్డి సామాజిక వర్గం వారు మాత్రమే పరిపాలించారు.  మిగతా కులాల వారు మంత్రి పదవులతో సరిపెట్టుకునేవారు. 



ప్రస్తుత ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉన్న సమయంలో బ్రాహ్మణులు రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారు. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా మిగిలిన అగ్ర కులాలైన  వెలమ, కమ్మ, రెడ్డి, కాపు... జస్టిస్ పార్టీ వైపు మొగ్గాయి. జస్టిస్ పార్టీ మొత్తం జమీందార్లతో నిండి ఉండేది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి లేదా ప్రీమియర్లుగా పనిచేసిన తెలుగువారిలో టంగుటూరి ప్రకాశం పంతులు బ్రాహ్మణ కులానికి చెందినవారు. బొబ్బిలి రాజా, పానగల్లు రాజాలు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు.  మునిస్వామి నాయుడు కమ్మ సామాజిక వర్గం కాగా, రామస్వామి రెడ్డియార్, సుబ్బరాయలు రెడ్డియార్... వీరు తమిళ రెడ్లు. ఇక కూర్మా వెంకట రెడ్డి నాయుడు సామాజికవర్గం కాగా... పీఎస్ కుమారస్వామిరాజా రాజుల కులానికి చెందినవారుగా ఉన్నారు. వీరిలో కొందరు తమిళనాడు వారైనా కులాల రీత్యా, బంధుత్వం రీత్యా ఆంధ్రాతో వారికి సంబంధాలు ఉన్నాయి.  బ్రాహ్మణ, క్షత్రియ, రెడ్డి, వెలమ, కమ్మ, కాపులు ఉమ్మడి మద్రాస్ ముఖ్యమంత్రులయ్యారు. ఇక నిజాం రాజ్యం భారత్‌లో విలీనం అయిన తరువాత బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన బూర్గుల రామకృష్ణా రావు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 



1983లో ఎన్‌టీఆర్ రాజకీయ ప్రవేశంతో ఏపీ రాజకీయాలలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. సినీ రంగంలో అశేష అభిమానులను సంపాదించుకున్న నందమూరి తారక రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పేరుతో రాజకీయ పార్టీని స్థాపించడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెనుమార్పులకు నాంది పలికారు. పార్టీని స్థాపించిన కేవలం 9 నెలల్లోనే ఆంధ్ర ప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఏకచ్ఛత్రాధిపత్యానికి తెరదించుతూ అధికారాన్ని కైవసం చేసుకున్నారు. ఆ తరువాత మూడు దఫాలుగా దాదాపు 8 సంవత్సరాల పాటు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి, అప్పటి వరకు అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ నిలిచారు. అయితే కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తు్న్న నిరంకుశ ధోరణికి వ్యతిరేకంగా ...ఢిల్లీలో తెలుగువారికి జరుగుతున్న అన్యాయాలను, అవమానాలను ఎదుర్కొనేందుకు .... తెలుగువాడు ఎక్కడికెళ్లినా తలెత్తుకుని సగర్వంగా నిలవాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రజానీకంలో రాజకీయ చైతన్యం పెద్దగా లేదనే చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రతి చిన్న వ్యవహారానికి ఢిల్లీలో  ఉన్న అధిష్ఠానం అనుమతి తీసుకోవాల్సి వచ్చేది.  ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం తరువాత మొట్టమొదటిసారి కమ్మ సామాజిక వర్గానికి సీఎం పీఠం దక్కింది. అంతకుముందు దాదాపు ఒక శతాబ్ద కాలం రాజకీయాల్లో చురుగ్గా ఉన్నా పూర్తి అధికారాన్ని కమ్మ వర్గీయులు సొంతం చేసుకోలేక పోయారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టడంతో ... కులాలు, మతాలతో సంబంధం లేకుండా మంచి వ్యక్తులు ఏ కులంలో ఉన్నా ప్రోత్సహించిన దాఖలాలు కోకోల్లలు. ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న నేతలు చాలామంది ఎన్టీఆరే తమకు రాజకీయ భిక్ష పెట్టారని గర్వంగా చెప్పుకున్న సందర్భాలూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాలు ముఖ్యంగా ఎన్టీఆర్ హయాంలో బీసీలకు పెద్దపీట వేసి రాజకీయాల్లో కొత్త ఒరవడికి నాంది పలికారు. 1983 తరువాత కమ్మ వర్గానికి చెందిన వారు ముగ్గురు ముఖ్యమంత్రులుగా పనిచేశారు. నాదెండ్ల భాస్కర రావు అత్యల్పంగా నెల రోజులు, టీడీపీ తరపున చంద్రబాబు నాయుడు అత్యధికంగా కాలం ముఖ్యమంత్రిగా పనిచేశారు.
 



1995 లో తన కేబినెట్ లో మంత్రిగా ఉన్న  ఎన్టీఆర్ అల్లుడు నారా చంద్రబాబు నాయుడు పార్టీపై తిరుగుబాటు బావుటా ఎగుర వేశారు. ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని సీఎం పీఠంపై అధిరోహించారు. టీడీపీలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీ పార్వతి జోక్యం ఎక్కువ కావడంతో పార్టీలో చీలికను నివారించేందుకు చంద్రబాబు నాయుడు పార్టీ పగ్గాలు తీసుకున్నారని ఆయన అనుయూయులు చెబుతుంటారు. ఏది ఏమైనా అప్పటి నుంచి ఏపీ రాజకీయాల్లో ఒక్క సారిగా డబ్బు పాత్ర పెరిగిపోయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతుంటారు. ధన ప్రవాహంతో ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకున్నారని చంద్రబాబుపై అప్పట్లో విమర్శలు వచ్చాయి. చంద్రబాబు సీఎం అయినప్పటినుంచి రాజకీయాలలో కుల రాజకీయాలతో పాటు డబ్బు కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ఆయన తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కూడా అదే పంథాను అవలంబించాల్సి వచ్చింది. ఇది ఏపీ రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఆది నుండి రెడ్డి సామాజిక వర్గం కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. ఇతర సామాజిక వర్గాల వారికి ప్రాతినిథ్యం ఉన్నా టీడీపీ ఏక వ్యక్తి పాలనలో కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలో కి వస్తే రెడ్డి సామాజిక వర్గం వారే సీఎం రేసులో ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో 2004లో కాంగ్రెస్ నుంచి చంద్రబాబు అనుంగు మిత్రుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 



మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీల వైఖరుల్లోనూ మార్పులు వస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ విభజన తరువాత రాజకీయాల్లో క్రియా శీలకం కాని కమ్మ సామాజిక వర్గం చంద్రబాబు సీఎం అయినప్పటి నుండి వ్యాపారాలు, సినీ రంగంలో ఉన్న తమ సామాజిక వర్గం వారిని రాజకీయాల్లోకి చంద్రబాబు తీసుకు రావడం జరిగింది. స్వతహాగా ధనికులు కావడం వ్యాపారాల్లో స్థిరపడటం...ప్రభుత్వం నుంచి అండదండలు పుష్కలంగా ఉండటంతో రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన  వారు క్రియాశీల పాత్ర పోషిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గం అధికారంలో ఉంటే స్వతహాగా ప్రత్యర్థులను చెప్పు చేతల్లో ఉంచడం...వారికి ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు సరిగా అందించకపోవడం జరుగుతూ ఉండేది. 



ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 80ల వరకూ రెడ్ల ఆధిపత్యం కొనసాగినా, ఎన్టీఆర్ ప్రవేశం తరువాత అధికారం మొత్తం కమ్మ, రెడ్డి కులాల మధ్యే దోబూచులాడుతోంది. మిగిలిన కులాలు ద్వితీయ స్థాయికి మాత్రమే పరిమితమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచీ రెడ్లే బలం. తరువాత ఆ వర్గం వైసీపీ వైపు మళ్లింది. కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశంతో రంగప్రవేశం చేశాక, అధికారంలో రెడ్లతో పోటీ పడ్డారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రంలో ఈ రెండు కులాలదే ఆధిపత్యం అయింది. వెలమలు జనాభా పరంగా చాలా చిన్న కులం. వాస్తవానికి మొత్తం రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి ఆ కులానికి లేదు. కానీ కాలం కలిసివచ్చింది. బలమైన నాయకత్వం ఏర్పడింది. కాపుల పరిస్థితి పూర్తిగా వేరు. అధికారాన్ని పొందే కులాలకు పెద్ద సంఖ్యలో పారిశ్రామికవేత్తలు ఉండడం, సొంత మీడియా సంస్థలు ఉండడం వంటి లక్షణాలు కలిసొచ్చాయి. కాపుల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ, ఆ వర్గానికి ఆ లక్షణాలు లేవు. సొంత మీడియా కానీ, పెద్ద సంఖ్యలో ఆర్థికంగా బలీయమైన వ్యక్తులు కానీ లేరు. క్షత్రియుల సంగతి కూడా అలాంటిదే. వాళ్లు చాలా సంపన్నులు. కానీ జనాభా చాలా తక్కువ. అందుకే అధికారం కోసం పోరాటం రెండు కులాల మధ్య జరిగితే, మిగిలిన ప్రభావవంతమైన కులాలు ఎటో ఒకవైపు ఉండి కీలక పాత్ర పోషిస్తాయి.



ఏపీ రాజకీయాల్లో జనాభా పరంగా ఇతర కులాల వారు  రాజకీయాల్లో కింగ్ మేకర్ అయ్యేందుకు తమ తమ కులాలకు ప్రాతినిథ్యం వహించాలని ఆసక్తి కనబరుస్తున్నారు. రెడ్లు, కమ్మ సామాజిక వర్గాల తరువాత అంత రేంజ్ లో రాజకీయాలను శాసించేది కాపు సామాజిక వర్గం. రెడ్లు, కమ్మ తరహాలో ముఖ్యమంత్రి పదవి పొందడం కోసం తీవ్ర ప్రయత్నిస్తున్న మరో కులం కాపులు. జనాభా పరంగా కమ్మ, రెడ్లకంటే వీరు ఎక్కువ. స్వాతంత్ర్యానికి ముందు కూర్మా వెంకటరెడ్డి నాయుడు ఈ వర్గం నుంచి మద్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ తరువాత ఈ కులస్థులు కాంగ్రెస్ హయాంలో మెజార్టీ మంత్రి పదవులు దక్కించుకుంటూ వచ్చారు. 1970, 80లలో క్రుష్ణా జిల్లాకు చెందిన వంగవీటి రంగా  కాపు కులం నుంచి బలీయమైన శక్తిగా ఎదిగారు. ఆయన హత్యకు గురైన తరువాత కృష్ణా డెల్టాలో కాపు, కమ్మల మధ్య విద్వేషాలు తారా స్థాయికి చేరాయి. సంక్లిష్ట రాజకీయాల మధ్య సినీ రంగంలో కాపు సామాజిక వర్గానికి చెందిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ అవతరించింది. ఎన్టీఆర్ తరహాలో రాజకీయం చేద్దామనుకున్న చిరంజీవి అనుకున్న రీతిలో రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోయారు. ప్రస్తుతం చిరంజీవి సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పేరుతో పార్టీని స్థాపించి రాజకీయాల్లో ఉన్నారు. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో చివరకు 2019లో  వంగవీటి రంగా కుమారుడు రాధా తెలుగుదేశంలో చేరారు. ప్రస్తుతం జనసేన అధినాయకత్వం ఈ కులం చేతుల్లోనే ఉంది.



రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో వచ్చాక ప్రత్యర్థులను దారుణంగా వేధింపులకు గురిచేయడం పరిపాటయింది. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బతీయడం ద్వారా రాజకీయాల్లో పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన జగన్మోహన్ రెడ్డి సీఎం కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ఇపుడు హర్షం వ్యక్తం చేస్తు్న్నారు.  అయితే ఏపీ లో అన్ని వర్గాల ప్రజల అభిమానాన్ని చూరగొన్న జగన్ మోహన్ రెడ్డి గతంలో జరిగిన తప్పిదాలను సరిచేస్తారా... లేక అదే పంథాను అనుసరిస్తారా.. అన్న అనుమానాలు అన్ని వర్గాల నాయకులతో పాటు సామాన్య పౌరుల్లోనూ మెదుల్తన్నాయి. తాజాగా రోజా చేసిన వ్యాఖ్యలతో కులరాజకీయాల అంశం తెరమీదికి వచ్చింది. అయితే రోజా కేవలం విషయాన్ని ప్రస్తావించి వదిలేశారా.. లేక సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎజెండాలో హిడెన్ గా ఇంకేదైనా ఉందా అన్న చర్చ మాత్రం ఏపీలో నడుస్తోంది. ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి మరి. 


 


Comments

Popular posts from this blog

తాటికొండ సుదర్శనం స్మారక చలివేంద్రం ప్రారంభం

కమాన్ పూర్, ఏఫ్రిల్ 12: పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలో స్వర్గీయ తాటికొండ సుదర్శనంగారి స్మారక చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని స్థానిక ఛత్రపతి శివాజీ యువసేనవారు నిర్వహిస్తున్నారు. కమాన్ పూర్ లో గల స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ మేనేజర్ బి.వెంకటేశ్వర్లు చేతులమీదుగా చలివేంద్రం ప్రారంభమైంది. వేసవిలో బ్యాంకు పని మీద వచ్చేవారితో పాటు.. మెయిన్ రోడ్డు గుండా వెళ్లే వందలాది మంది బాటసారులకు, వాహనదారులకు ఈ చలివేంద్రం ప్రతి వేసవిలోనూ ఎంతో ఉపయోగపడుతుందని.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ వెంకటేశ్వర్లు ప్రజలను కోరారు. ఈ చలివేంద్రంలో ప్రతి రోజూ మధ్యాహ్నం అంబలి పంపిణి చేస్తారని, ప్రజలు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.  తాటికొండ సుదర్శనంగారు 2019, ఫిబ్రవరి 14న పరమపదించారు. ఆయన జ్ఞాపకార్థం వారి శ్రీమతి చంద్రకళ, కుమారులు రమేశ్ బాబు, నాగభూషణాచారి, వీరాచారి పూనుకొని ప్రతి వేసవిలోనూ ప్రజలకు చల్లని మంచినీళ్లు అందించాలన్న ఉద్దేశంతో ఫ్రిజ్ ను సమకూర్చారు. వారి కార్యక్రమానికి కొనసాగింపుగా గ్రామంలోని ఛత్రపతి శివాజీ యువసేనవారు చలివేంద్రం నిర్వహించేందుకు ము

రోమ్ నగరానికి శ్రీరామనవమి రోజే బొడ్రాయి వేశారా?

ఇటలీ రాజధాని రోమ్ నగరానికి శ్రీరామ నవమి రోజే శంకుస్థాపన చేశారా? ఇటలీ భాషలో రోమ్ అంటే రాముడనే అర్థమా? ఈజిప్టు, ఇటలీ, ఇజ్రాయెల్ వంటి నగరాల్లో రాముడి పేరు మీద పట్టణాలే కాదు.. దాాదపు మూడు వేల ఏళ్ల పూర్వమే రామాయణంలోని గాథల చిత్రాలు, కార్వింగ్స్, విగ్రహాలు ఎందుకున్నాయి? పురాణాల ప్రకారం విష్ణుమూర్తికి ఉండే అవతారాలు అన్నిటిలోకీ.. రామావతారానికే పాపులారిటీ దక్కింది. రాముడికి సంబంధించిన చెక్కడాలు, విగ్రహాలు, నగరాల పేర్లు, మనుషుల పేర్లు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. అయితే చారిత్రకంగా కొన్ని ఆధునిక మతాలు వ్యాప్తిలోకి వచ్చాక.. ప్రాచీన సంప్రదాయాలను, సంస్కృతులను ధ్వంసం చేసే ప్రయత్నం కొన్ని వందల ఏళ్లుగా జరుగుతోంది. అయితే ఈ మతాలన్నీ దాదాపుగా 2వేల సంవత్సరాలకు సంబంధించినవే. కానీ భారతీయ సనాతన ధర్మం వేలు, లక్షల ఏళ్ల క్రితానికి చెందినది. కాబట్టి హిందూ ధర్మం ఆనవాళ్లు ప్రపంచంలో ఎక్కడ చూసినా కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదంటున్నారు చారిత్రక పరిశోధకులు.  విష్ణు అవతారాల్లో ఒకటైన నరసింహావతారానికి చెందిన భారీ కార్వింగ్ జర్మనీలో కనిపించింది. అది 40 వేల ఏళ్ల క్రితం చెక్కారని ఆర్కియాలాజికల్ నిపుణులు ధ్రువీకరించారు. అది అచ్

సంస్థాగత ఎన్నికలకు సిద్ధమవుతున్న 'వేదాస్'

కుల సంఘంలో ఎన్నికలు నిర్వహించి ఓ సరికొత్త సంప్రదాయానికి తెరతీసిన 'వేదాస్' (విశ్వకర్మ ఎంప్లాయీస్ అండ్ డెవలప్మెంట్ అసోసియేషన్) తన సంస్థాగత ఎన్నిక కోసం సమాయత్తమవుతోంది. ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీని రద్దు చేసి ఇకపై పూర్తిస్థాయి కమిటీని ఎన్నుకొనేందుకు వేదాస్ కార్యవర్గం తీర్మానం చేసిందని, అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో రాష్ట్ర స్థాయి ముఖ్య నేతలు, క్రియాశీల సభ్యుల సమావేశం జరిగిందని వేదాస్ ముఖ్యనాయకులు వి.నరసింహాచారి తెలిపారు. వేదాస్ పూర్తి స్థాయి కమిటీ కోసం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించుకోవాలనే సభ్యుల తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించామని ఆయన చెప్పారు. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ లోపు రాష్ట్రస్థాయి, జిల్లా, మండల స్థాయి ఎన్నికలు జరుపుకొని కొత్త బాడీని ఎన్నుకుంటామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం పాత ఉమ్మడి జిల్లాకు ఒకరు చొప్పున బాధ్యులను ఎంపిక చేశామని.. రాష్ట్ర స్థాయి బాధ్యతలను సచ్చిదానందాచారితో పాటు సంతోష్ కుమార్ ఆచారి నిర్వహిస్తారని నరసింహాచారి చెప్పారు.  తాజా తీర్మానంతో ఇప్పటివరకు ఉన్న తాత్కాలిక కమిటీ రద్దయిపోయిందని, ఎలాంటి బాధ్యత